Kids

సజ్జనార్ కథలు

CP Sajjanar Explains How And Why The Encounter Had To Be Done

దిశ హత్యోదంతంలో తొలుత ఎలాంటి ఆధారాలు లేకుండా విచారణ ప్రారంభించి క్రమంగా సైంటిఫిక్‌ ఆధారాలను సేకరించామని సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. కాల్పుల్లో నిందితులు మృతిచెందిన నేపథ్యంలో ఘటనాస్థలంలో మీడియాతో ఆయన మాట్లాడారు. కాల్పులు జరిగిన తీరు, అందుకు గల కారణాలను సీపీ వివరించారు. ‘‘గత నెల 28న ఉదయం దిశను చటాన్‌పల్లి వద్ద కాల్చివేశారు. ఆ తర్వాత నిందితులను పట్టుకుని 30న మెజిస్ట్రేట్‌ వద్ద హాజరుపరిచాం. 10 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీకి ఇచ్చారు. ఈనెల 4న నిందితులను చర్లపల్లి జైలు నుంచి కస్టడీకి తీసుకున్నాం. నిందితులను అనేక విషయాలు ప్రశ్నించాం. రెండు రోజుల కస్టడీలో నిందితులు చాలా విషయాలు చెప్పారు. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం అక్కడకు తీసుకెళ్లలేదు. దిశకు సంబంధించిన వస్తువులు చూపెడతామంటే నిందితులను చటాన్‌పల్లి వద్దకు తీసుకొచ్చాం. దిశ ఫోన్‌, వాచీ, పవర్‌బ్యాంక్‌ దాచిన చోటుకు వారిని తీసుకెళ్లాం. అక్కడ రాళ్లు, కర్రలతో పోలీసులపై నిందితులు దాడికి పాల్పడ్డారు. మహ్మద్‌ ఆరిఫ్‌, చెన్నకేశవులు పోలీసుల వద్ద తుపాకులు లాక్కుని కాల్పులకు యత్నించారు. పోలీసులు పలుమార్లు హెచ్చరించినా వినకపోవడంతో నిందితులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఉదయం 5.45 నుంచి 6.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నిందితులు జరిపిన రాళ్లదాడిలో నందిగామ ఎస్సై వెంకటేశ్వర్లు కానిస్టేబుల్‌ అరవింద్‌గౌడ్‌కు గాయాలయ్యాయి. వారిని స్థానికంగా ప్రథమచికిత్స అందించి కేర్‌ ఆస్పత్రికి తరలించాం. పోలీసులకు బుల్లెట్‌ గాయాలు కాలేదు. నిందితుల మృతదేహాలకు మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహిస్తాం. అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగిస్తాం. గతంలో ఈ నిందితులు తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటకల్లోనూ ఈ తరహా ఘటనలకు పాల్పడినట్లు అనుమానాలున్నాయి. దానిపై లోతుగా విచారణ జరుపుతున్నాం. బాధితురాలితో పాటు నిందితుల కుటుంబసభ్యుల వివరాలు కూడా గోప్యంగా ఉంచాలని కోరుతున్నాం.’’ అని సజ్జనార్‌ వివరించారు.