Business

25.6బిలియన్ డాలర్ల లక్ష్యంతో ఆరాంకో షేర్లు ప్రారంభం

Saudi Aaramco Opens IPO at 32Riyal Per Share

సౌదీ అరేబియాకు చెందిన చమురు రంగ దిగ్గజం ఆరామ్‌కో గురువారం ఐపీవోను ప్రారంభించింది. అత్యధికంగా 32 రియాళ్ల రేటు వద్ద షేరు ధరను నిర్ణయించింది. ఈ ఐపీవో ద్వారా ప్రపంచంలోనే అత్యధికంగా 25.6 బిలియన్‌ డాలర్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఈ మొత్తం చైనాకు చెందిన ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ గ్రూప్‌ అలీబాబా ఐపీవో (25 బిలియన్‌ డాలర్ల) కంటే ఎక్కువ. ఈ సంస్థ మార్కెట్లోకి ప్రవేశిస్తే దీని విలువ 1.7 ట్రిలియన్‌ డాలర్లతో అత్యధిక మార్కెట్‌ విలువ ఉన్న తొలి కంపెనీగా మారుతుంది. ఆ తర్వాత స్థానంలో యాపిల్‌ (1.2 ట్రిలియన్‌ డాలర్లు), మైక్రోసాఫ్ట్‌, అలీబాబా (ఒక్కోటి 1.1 ట్రిలియన్‌ డాలర్లు) ఉన్నాయి. ఆరామ్‌కో ట్రేడింగ్‌ డిసెంబర్‌ 12 నుంచి రియాద్‌లోని తద్వుల్‌ ఎక్స్‌ఛేంజిలో రియాళ్ల వద్ద ట్రేడింగ్‌ మొదలవుతుంది. ఈ ఐపీవోలో ఎక్కువ భాగం సౌదీవాసులే కొనుగోలు చేయనున్నారు. మరోపక్క విదేశీ పెట్టుబదిదారులు మాత్రం ఈ కంపెనీ కార్పొరేట్‌ నిర్వహణ తీరు, కంపెనీ చమురు క్షేత్రాల రక్షణ, పర్యావరణ మార్పులపై వస్తున్న ఆందోళనల నేపథ్యంలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆరామ్‌కో మార్కెట్లోకి రావడంతో వచ్చే సొమ్ముతో సౌదీ ఆర్థిక వ్యవస్థ చమురుపై ఆధారపడటం తగ్గించుకొనేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఈ ఐపీవోలో కంపెనీలోని 1.5శాతం వాటాలను మాత్రమే విక్రయిస్తున్నారు.