టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ను ప్రశంసలతో ముంచెత్తారు. రెడ్లకు ఎక్కువ నామినేటేడ్ పోస్టులు ఇచ్చినందుకు జగన్ కు జేసీ అభినందనలు తెలిపారు. జగన్ గట్స్ ను ఆయన మెచ్చుకున్నారు. ఇలా చేయడం చంద్రబాబుకి చేతకాలేదని జేసీ అన్నారు. చంద్రబాబు హయాంలో కమ్మలకు అన్యాయం జరిగిందన్నారు. జగన్ హయాంలో మాత్రం రెడ్లకు న్యాయం జరిగిందని అభిప్రాయపడ్డారు. ఆరోగ్యశ్రీపై జగన్ కు సెల్యూట్ చేస్తున్నా అని జేసీ చెప్పారు. జగన్ హయాంలో.. తాత రాజారెడ్డి పాలన సాగుతోందన్నారు. మీడియాతో చిట్ చాట్ లో జేసీ ఈ కామెంట్స్ చేశారు.
మాఫియా లేనిది ఎక్కడ..?:
ఏపీ అసెంబ్లీలో రాయలసీమ ప్రాజెక్టులపై జగన్ బాగా మాట్లాడారని జేసీ కితాబిచ్చారు. సీఎం జగన్ ఆశయం బానే ఉన్నా.. ఆచరణ అసాధ్యం అన్నారు. పనులు చేయడానికి డబ్బులు లేవన్నారు. నెల్లూరులో మాఫియా ఉందంటూ వైసీపీ నేత ఆనం రాంనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై జేసీ స్పందించారు. ఆనం అలా మాట్లాడకుండా ఉండాల్సింది అన్నారు. అసలు మాఫియా ఎక్కడ లేదో చెప్పమనండి..అని ప్రశ్నించారు.
”రెడ్డి రాజ్యంలో కక్ష రాజ్యం”:
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమాపైనా జేసీ స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాంగోపాల్ వర్మకు సినిమా పేరు పెట్టడం తెలియదన్నారు. ”కమ్మ రాజ్యంలో రెడ్డి రాజ్యం” కాదు.. ”రెడ్డి రాజ్యంలో కక్ష రాజ్యం” అని టైటిల్ పెట్టాల్సిందన్నారు. చంద్రబాబు రాజ్యంలో కమ్మవారు కృష్ణా, గోదావరిలో కలిసిపోయారని జేసీ అన్నారు