మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈనెల 18, 19, 20 తేదీల్లో జిల్లా పర్యటన షెడ్యూల్ను విడుదల చేశారు.
శుక్రవారం స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు, జిల్లా పార్టీ ప్రచార కార్యదర్శి బీవీ వెంకటరాముడుతో కలిసి జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి పర్యటన, కార్యక్రమాల వివరాలు విలేకరులకు వెల్లడించారు.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు రెండోసారి జిల్లా పర్యటనకు వస్తున్నారన్నారు.
ఈనెల 18 నుంచి 20 వరకు మూడ్రోజుల పాటు పర్యటన సాగుతుందన్నారు.
18న ఉదయం 8 గంటలకు విజయవాడలో విమానంలో బయలుదేరి బెంగుళూరుకు చేరుకుంటారన్నారు.
అక్కడి నుంచి వాహనంలో బయలుదేరి రోడ్డు మార్గాన మధ్యాహ్నం 12 గంటలకు అనంతపురానికి చేరుకుంటారని తెలిపారు.
అదేరోజు మధ్యాహ్నం నగర శివారులోని బళ్లారి రోడ్డులో ఉన్న ఎంవైఆర్ కల్యాణమంటపంలో నిర్వహించనున్న జిల్లా టీడీపీ సాధారణ సర్వసభ్య సమావేశానికి హాజరవుతున్నట్లు చెప్పారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ చైర్మన్లు, పార్టీ కమిటీల నాయకులు, ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సాయంత్రం 4 గంటల నుంచి నియోజకవర్గాల సమీక్షలు ప్రారంభిస్తారన్నారు.