Devotional

ధనుర్మాస ప్రసాదాల్లో ఔషధ గుణాలు

Dhanurmasa Prasadam And Medicinal Values In Hindu Prasadams

చల్లని వాతావరణం.. మది నిండా ఆనందం మాసానాం.. మార్గశీర్షోహం.. అని గీతాచార్యుడిగా శ్రీకృష్ణ భగవానుడు భక్తుడైన అర్జునునికి చెప్పాడు. మాసాల్లో మార్గశిర మాసం తానేనని.. నెల రోజుల పాటు తాను ఆ మాసంలో ఉంటానని ప్రకటించాడు. సాక్షాత్తు మహావిష్ణువు రూపమైన మార్గశిరంలోనే జగానికి వెలుగులను ప్రసాదించే సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించి ధనుర్మాసంగా మలుస్తాడు. మార్గశిరం, ధనుర్మాసం కలగలిసిన రోజుల్లో హేమంత వికసిస్తుంది. అందరిలోనూ భక్తిభావాన్ని పెంపొందిస్తుంది. సూర్య భగవానుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రకృతి పులకింతకు గురైనట్టే. మానవ శరీరం కూడా పలు మార్పులకు లోనవుతుంది. ఆ సమయంలో బలవర్థకమైన ఆహారం తీసుకుంటే శారీరక వికాసం కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ధనుర్మాసంలో చేసే పూజలకు తగ్గట్టుగానే తులసీతీర్థం, చక్కెర పొంగళి, కట్టె పొంగలి, దద్దోజనం, పులిహోర తదితర పోషక విలువలుండే ప్రసాదాలను ఆరగిస్తారు. అలంకార ప్రియుడైన శ్రీమహావిష్ణువును ఆరాధించడంలో స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలను అర్పించడం పుణ్యఫలం..
**ప్రస్తుతం అన్ని వైష్ణవాలయాల్లో ధనుర్మాస పూజలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయాల్లో కర్పూర పరిమళాల మధ్య ఆధ్యాత్మిక సందడి నెలకొంటోంది. చీకట్లను చీల్చుకుంటూ నులివెచ్చని కిరణాలు ఓ వైపు.. తిరుప్పావై పఠనాలు మరో వైపు మనసును ఆధ్యాత్మికతవైపు నడిస్తాయి. అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే పవిత్ర ధనుర్మాసంలోనే గోదాదేవి కాత్యాయనీ వ్రతంచేసి శ్రీరంగనాథడిని పరిణయమాడిందని పురాణ ప్రాశస్త్యం. వేణుగోపాలస్వామి, జనార్థనస్వామి, వెంకటేశ్వరస్వామి, జగన్నాథస్వామి సత్యనారాయణస్వామి తదితర వైష్ణవాలయాలతో గ్రామీణ ప్రాంతాల్లోని చాలా కుటుంబాల్లో నిత్యం ధనుర్మాస వ్రతాలు, తిరుప్పావై పఠనాల్లో లక్షలాది మంది భక్తులు పూజల్లో పాల్గొంటున్నారు. వీటిలో పుణ్యఫలం ఎంత ఉందన్న విషయాన్ని పక్కనపెడితే పరోక్షంగా అవి ఆరోగ్యకరం. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనిషి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్దేశించిన ఈ ధనుర్మాసంలో అందిస్తున్న ప్రసాదాలు ఎన్నెన్నో పోషక విలువలతో ముడిపడిఉండటం విశేషం. తీర్థం.. ప్రసాదంగా మనం స్వామివారికి సమర్పించి స్వీకరించే వీటిలో ప్రతి పదార్థానికి చక్కటి ఔషధగుణాలున్నాయి.
**మానసిక ఉపశమనానికి తులసీతీర్థం
ఆలయాల్లో దేవుడ్ని దర్శించుకున్న తర్వాత అర్చకుడు ఇచ్చే తీర్థమే తులసీతీర్థం. దీనినే భక్తులు తొలి ప్రసాదంగా భావిస్తారు. తులసి పత్రాలు, కర్పూరం.. యాలిక బీజాలను కలిపి తీర్థంగా ఇస్తుంటారు. ఇది మానసిక ఉద్వేగాలను అదుపులో ఉంచుతుంది. దగ్గు, ఆస్థమా, చర్మవ్యాధులు తీర్థ సేవనంతో నయమవుతాయయి. కడుపులో క్రిముల నివారణవుతాయి. కడుపుబ్బరం తగ్గుతుంది. ముక్కుదిబ్బడ నుంచి ఉపశమనం కలుగుతుంది. మానసిక వేదన నుంచి ఉపశమనం లభిస్తుంది.
పరమాన్నం.. పరమ ఔషధం..
పాలు, బియ్యంలో బెల్లం లేదా పంచదార వేసి చేసేదే పరమాన్నం. ఇందులో బాదంపప్పు, యాలకులు, పచ్చికొబ్బరి వేస్తారు. దేహానికి బలం, చక్కని కాంతిని ఇస్తుంది. ఆలోచన శక్తిని పెంచుతుంది. వాత, పైత్యాలను తగ్గిస్తుంది. ప్రతి 100 గ్రాముల బియ్యంలో 78 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 8.5 గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి. 100 గ్రాముల బెల్లంలో 11.4 మిల్లీ గ్రాముల కేలరీలు, ఇనుము ఉన్నాయి దీనికి పుష్టిని ఇచ్చే గుణం ఉంది. వాత రోగాలు నివారణవుతాయి. బాదంలో బలాన్ని చేకూర్చే గుణం ఉంది. ఉత్సాహం పెరగడంతో పాటు నరాల బలహీనత, అధిక రక్తపోటు తగ్గుతుంది.
**వ్యాధుల నిరోధిని దద్దోజనం
తాళింపు పెట్టిన పెరుగన్నమే దద్దోజనం, ఆవుపాలను బాగా మరగకాచి చల్లార్చి తోడుపెట్టిన పెరుగులో మిరియాలు, ఇంగువ, శొంఠి మొదలైన వాటిని అన్నంలో వేసి కలపాలి. దానిని ఆవునెయ్యితో పోపుపెట్టాలి. ధనుర్మాసంలోని రెండో పక్షంలో దీనిని ప్రసాదంగా నివేదిస్తారు మంచు, చలి ఎక్కువగా ఉండే ఈ సమయంలో దద్దోజన ప్రసాదం తీసుకోవటం వల్ల జలుబు, విష జ్వరాలు, శీతల జ్వరం రాకుండా నిరోధిస్తుంది.
**ఆరోగ్యదాయకం పులిహోర..
బియ్యంతో అన్నం వండిన తర్వాత దానికి పసుపు, నూనె, ఆవాలు, ఉప్పు, కరివేపాకు, శెనగపప్పు తదితర వాటిని కలిపిచేస్తారు. దీనివల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఆకలి మరింతగా పెరుగుతుంది. కాలేయానికి బాగా ఉపయోగపడుతుంది. అతిసారం రాకుండా నిరోధిస్తుంది. జలుబు, తుమ్ములు, ఉబ్బసం, దగ్గు నుంచి పూర్తి ఉపశమనం కలుగుతుంది.
**కట్టె పొంగలితో జీర్ణశక్తి
బియ్యం అందులో సగభాగం పెసరపప్పు వేసి ఉడికించాలి. అందులో మిరియాల పొడివేసి నేతితో పోపు పెట్టి పసుపువేయాలి. దీనిని ధనుర్మాసంలో విష్ణుమూర్తికి నివేదిస్తారు. ఆ సమయంలో చలి, మంచు ఎక్కువగా ఉంటాయి. కట్టెపొంగలిని తినడం వల్ల జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది. కీళ్ల జబ్బులు నివారణవుతాయి. దగ్గు, జలుబు రాకుండా చేస్తుంది.
**చక్కటి ఔషధం చక్కెర పొంగలి
బియ్యం, పెసరపప్పు సమానంగా పోసి ఆవునేతితో ఉడికించాలి. అందులో పంచదార, ద్రాక్ష, పచ్చ కర్పూరం, కుంకుమపువ్వు, యాలకులు మొదలైన సుగంధ ద్రవ్యాలు వేయాలి. మృధుత్వాన్ని దేహపుష్టిని ఇచ్చే శక్తి ఇందులో ఉన్నాయి. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. నేతిలో వ్రణాలు, ఉన్మాదం, ధాతుక్షయం, శూల (నొప్పి), జ్వరాన్ని హరిస్తుంది. ఒక చెంచా పంచదారలో 30 కేలరీలు 8 కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. పచ్చకర్పూరం వల్ల ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది. కఫం, శరీరంలోని మంటల్ని నిరోధిస్తుంది.