Politics

తెరాసకు సానుకూల పవనాలు

KCR Reviews On Muncipal Elections 2020 In Telangana

రాష్ట్రమంతా తెరాసకే సానుకూలంగా ఉందని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అభివృద్ధి చేసుకుంటామన్నారు. తెలంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమయ్యారు. కౌన్సిలర్‌, కార్పొరేటర్‌ అభ్యర్థులకు ఇవ్వాల్సిన ఏ, బీ ఫారాలను ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో అన్ని చోట్లా ఆశావహుల నుంచి తీవ్రపోటీ ఉందన్నారు. టికెట్లు దక్కనివారు నిరాశ పడకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని చెప్పారు. టికెట్లు రానివారికి భవిష్యత్‌లో నామినేటెడ్‌ పదవులు, ఇతర అవకాశాలు కల్పిస్తామన్నారు. గ్రామాల్లో ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఎమ్మెల్యేలంతా కృషి చేయాలని కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.