Movies

ప్రయోగాలపై మనస్సు మళ్లింది

Rashmika Aiming For New Risks-Telugu Movie News

ప్రస్తుతం దక్షిణాది చిత్రసీమలో కన్నడ కస్తూరి రష్మిక మందన్న హవా నడుస్తోంది. వరుసగా భారీ సినిమాల్లో అవకాశాల్ని సొంతం చేసుకొని అగ్ర నాయికల రేసులో దూసుకుపోతున్నది. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులముందుకొచ్చిందీ సుందరి. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌ వైపు కూడా దృష్టిసారిస్తోంది రష్మిక మందన్న. ‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో తొలుత ఈ భామను కథానాయికగా అనుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ సినిమా నుంచి తప్పుకుంది రష్మిక మందన్న. బాలీవుడ్‌లో నటించాలని అభిమానులు కోరుతున్నారని, తప్పకుండా వారి అభిలాష నెరవేర్చుతానని చెప్పింది ఈ సొగసరి.ఆమె మాట్లాడుతూ ‘బాలీవుడ్‌ అరంగేట్రం గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అక్కడ ప్రయోగాత్మక పాత్రలు చేయాలని ఉంది. భాషాపరమైన హద్దుల్ని ఎప్పుడూ పట్టించుకోను. కెరీర్‌ తొలినాళ్లలో తెలుగు, తమిళం వచ్చేది కాదు. ఇప్పుడు అనర్గళంగా మాట్లాడుతున్నా. నటన విషయంలో కూడా నేను నిత్యవిద్యార్థినే. ప్రతి సినిమాకు ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నా’ అని చెప్పింది. కథానాయికగా కన్నడ ‘కిరిక్‌పార్టీ’ చిత్రం ద్వారా చిత్రసీమకు పరిచయమైంది రష్మిక మందన్న. ఆ ఒక్క చిత్రంలో నటించి సినిమాల నుంచి తప్పుకుందామ నుకున్నానని, అయితే అభిమానులు చూపించిన ప్రేమానురాగాలు సినీరంగాన్ని పూర్తిస్థాయి కెరీర్‌గా ఎంపిక చేసుకునేందుకు ప్రేరణనిచ్చాయని చెప్పింది.