Devotional

రేపే రథసప్తమి

Ratha Saptami 2020 - What it is all about

సూర్యదేవా… నమామి! – రేపు రథసప్తమి TNI ప్రత్యెకం -ఆద్యాత్మిక వార్హ్తలు – 31/01
‘‘సప్తాశ్వ రథమారూఢం… ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం… తం సూర్యం ప్రణమామ్యహమ్‌!!’’ అంటూ ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడిని రథసప్తమి (ఫిబ్రవరి 1) నాడు మనసారా పూజిస్తాం. కేవలం సూర్యారాధనే కాదు… మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున జరుపుకునే ఈ పర్వదినం నాడు చేసే స్నానం, పూజ వెనుకా ఉన్న కారణాలు, రహస్యాలు చాలానే ఉన్నాయంటున్నాయి శాస్త్రాలు.
సూర్యుడు… సమస్త జగతికీ మూలాధారం. కాలానికి అధిపతి. ప్రత్యక్ష నారాయణుడిగా ప్రాణకోటికి వెలుగుతోపాటూ దర్శనమిచ్చే సూర్యభగవానుడిని పూజించేందుకు మేలైన రోజు రథసప్తమి… అంటే సూర్యుడి పుట్టిన రోజు. ఆదిత్యుడి రథాన్ని గమనిస్తే… దానికి ఒక చక్రం, ఏడు అశ్వాలు ఉంటాయి. ఆ చక్రం కాలచక్రమైతే… సూర్యుడి కిరణాలే ఆ అశ్వరూపాలు. సప్త అనే అశ్వం ఆ రథాన్ని లాగుతుంటుంది. ఆదిత్యుడి నుంచి ఉత్పన్నమయ్యే కిరణాల్లో ఏడో కిరణం సప్త అనే నామంతో ఉంటే… మిగిలిన ఆరు కిరణాలు ఆరు రుతువులుగా ఏర్పడి కాలచక్రాన్ని ముందుకు నడిపిస్తున్నాయంటోంది వేదం. రవి మకర రాశిలో ఉన్నప్పుడు వచ్చే సప్తమి సమయంలో సూర్యకిరణాలు నేలపై పుష్కలంగా పడతాయంటారు. ఆ శక్తి ప్రధానంగా జిల్లేడు, చిక్కుడు, రేగు చెట్లు, పారే నీటిపైన ఎక్కువగా ఉంటుంది. అందుకే రథసప్తమి నాడు చేసే పూజ, స్నానం ఎంతో విశిష్టమని చెబుతారు. ఈ రోజున ఏడు జిల్లేడు లేదా రేగు ఆకుల్నీ రేగుపండ్లనీ తలమీద పెట్టుకుని స్నానం చేయాలంటారు. సూర్యుడికి జిల్లేడు ఆకులు ఎంతో ప్రీతికరమైనవి. ఈ స్నానం ఏడు జన్మల పాప కర్మలను నశింపచేస్తుందని పురాణాలు చెబితే, దీనివెనుక ఆరోగ్య రహస్యమూ ఉందంటున్నాయి శాస్త్రాలు. సూర్యకిరణాలు పడిన జిల్లేడు లేదా రేగుఆకులనూ రేగుపండ్లనూ తలపైన పెట్టుకుని స్నానం చేయడం వల్ల ఆ తరువాత వచ్చే వేడిని- అంటే వేసవిని తట్టుకునే శక్తి శరీరానికి వస్తుందంటారు.
**ఆరోగ్య ప్రదాతగా…
సూర్యుడికి నేరుగా నమస్కరించడం ఒక పద్ధతైతే రకరకాల నామాలతో అర్చించడం మరో పద్ధతి. ఆదిత్యుడిని పూజించే నామాలు రామాయణ, మహాభారత సమయాల్లో ఉద్భవించాయి. పురాణాలను గమనిస్తే… రాముడు రామరావణ యుద్ధం సమయంలో అలసిపోయి, నిస్తేజానికి లోనైనప్పుడు అగస్త్యుడు వచ్చి ఆదిత్యహృదయాన్ని ప్రభోదించాడట. ఆ తరవాతే రాముడు అపారమైన శక్తితో రావణుడిని సంహరించాడని వాల్మీకీ రామాయణం చెబుతోంది. ధర్మరాజు కూడా దౌమ్యుడి ద్వారా సూర్య అష్టోత్తర సహస్రనామాల్ని తెలుసుకుని జపించాడని భారతంలో ఉంది. కృష్ణుడి కుమారుడు సాంబుడు తనకు వచ్చిన కుష్టువ్యాధిని సూర్యారాధన చేసే తగ్గించుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అవి చదివినా, చదవకపోయినా… ఈ రోజున సూర్యారాధన చేయడంలో ఆరోగ్యరహస్యమూ దాగుంది. రథసప్తమి రోజు పొద్దున్నే స్నానం చేశాక… ఆరుబయట ఆవుపిడకల మంట మీద పరమాన్నం వండి… సూర్యుడికి నివేదించాలంటారు. ఆరుబయటే పరమాన్నం చేయడం, భాస్కరుడికి నివేదించే క్రమంలో ఆ పదార్థంపై లేలేత సూర్యకిరణాలు పడతాయి. అలా నివేదించిన పదార్థాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కేవలం రథసప్తమి నాడే కాదు… మిగిలిన ఏడాదంతా రోజూ కాసేపు ఆ కిరణాల ఎదురుగా కాసేపు గడిపినా చాలు.. శరీరానికి అవసరమైన డి విటమిన్‌ అంది అనారోగ్యాలు దూరమవుతాయని సైన్స్‌ చెబుతోంది. ఇంకా కుదిరితే… సూర్యుడి ఎదురుగా సూర్యనమస్కారాలూ చేయొచ్చు. వాటితో శారీరక, మానసిక ఆరోగ్యం సొంతమవుతుంది. ఇవేవీ సాధ్యం కానప్పుడు… సూర్యుడి ఎదురుగా నిల్చుని ఓ నమస్కారం చేసినా చాలంటారు. రథసప్తమికి మరో ప్రత్యేకతా ఉంది. ఇది నోములు ప్రారంభించేందుకు అనువైన రోజు అని శాస్త్రాలు చెబుతున్నాయి. పదహారు ఫలాలు, కైలాసగౌరీ.. ఇలా ఏ నోము అయినా… ఈ రోజున మొదలుపెట్టి, ఏడాదిలోపు ఎప్పుడైనా పూర్తిచేసి, ఉద్యాపన చెప్పుకోవచ్చు. ఒకవేళ రథసప్తమి నాడు నోము మొదలుపెట్టడం సాధ్యం కాకపోతే శివరాత్రి నాడు చేయొచ్చంటారు.
***చైతన్యప్రదాతగా…
సూర్యారాధనను పక్కనపెడితే.. ఆదిత్యుడు ఈ జగతికి అమూల్యమైన సందేశం ఇస్తాడు. సూర్యోదయం, సూర్యాస్తమయం క్రమశిక్షణకు నిదర్శనం. సమస్యలు ఎదురైనప్పుడు వెనకడుగు వేయకూడదనీ దుఃఖం వెంటే కష్టం ఉంటుందనీ చీకటి వెంటే వెలుగూ వస్తుందనీ అంతవరకూ ఎదురుచూడాలనీ తన గమనం ద్వారా తెలియజేస్తున్నాడు. పాపపుణ్యాలతో సంబంధం లేకుండా అందరినీ సమానంగా చూడాలంటూ తననే ఉదాహరణగా చూపించే సూర్యుడు గురువుగానూ గుర్తింపు పొందాడు. హనుమంతుడికి గరిమా, లఘిమా సిద్ధుల్ని నేర్పించింది ఆదిత్యుడే. ఈ సిద్ధులతోనే హనుమంతుడు కావాలనుకున్నప్పుడు అత్యంత పెద్దగా లేదా చిన్న ఆకారంలోకి మారిపోయే శక్తిని సొంతం చేసుకున్నాడు. కర్ణుడూ సూర్యుడి పుత్రుడిగా తండ్రి నుంచి ఎన్నో విద్యలు నేర్చుకున్నాడని భారతం చెబుతోంది.
**భారతీయ ఖగోళ శాస్త్రం నవగ్రహాలలో సూర్య గ్రహం ప్రధానమైనదిగా పేర్కొంది. ప్రపంచ భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్తలు దాన్ని సమర్థించారు. అయితే జనుల దృష్టిలో ఆయన సాక్షాత్తూ భగవంతుడే! సూర్యుడు ‘త్రిమూర్తుల స్వరూపం’ అని మహాఋషులు భావన చేశారు. సృష్ట్యాదికి పూర్వమే… ప్రత్యక్ష దైవంగా, లోకానికి వెలుగును ఇచ్చిన నారాయణుడిగా ఆయనను ఆరాధించారు. సూర్యారాధన యుగయుగాల నుంచీ వస్తోంది. వేదాలు ప్రముఖంగా ప్రస్తావించిన ఆదిదేవుడు సూర్య నారాయణుడు. ఇతిహాసాలూ, పురాణాలూ ఆ దివాకరుణ్ణి అనేక విధాల ప్రశంసించాయి.
*ప్రాణికోటికి ఆలంబన
సూర్యుడిపై ప్రత్యేకంగా రచించిన ఉపనిషత్తు ‘అక్ష్యుపనిషత్తు’. ‘సూర్య ఆత్మా జగత్ సస్తుషస్యః’ అన్నది ఋగ్వేదం. ‘జగత్తులో ప్రాణులు అన్నిటికీ సూర్యుడే ఆత్మ’ అని భావం. ‘ప్రాణోవై అర్కః’ – ప్రాణమే సూర్యుడు. ‘స ఏష వైశ్వానరో, విశ్వరూపః, ప్రాణో అగ్ని రుద్రయతే’ అని ప్రశ్నోపనిషత్తు పేర్కొంది. ‘‘సూర్యోదయంతోనే జగత్తులో ప్రాణాగ్ని సంచారం చేస్తుంది. సూర్యుడి వల్లనే సమస్త ప్రాణికోటికీ ప్రాణం లభిస్తుంది’’ అని ‘శతపథ బ్రాహ్మణం’ వివరించింది.
*ఆరోగ్యకారకుడు
‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’ అని శాస్త్రవచనం. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. శరీరానికి సూర్యకిరణాలు తాకడం వల్ల (సన్ బాత్) ఆరోగ్యం చేకూరుతుందనీ, కొన్ని రకాల రుగ్మతలు నివృత్తి అవుతాయనీ ప్రకృతి వైద్య శాస్త్రం చెబుతోంది.
*కవులకు స్ఫూర్తిప్రదాత
రామాయణంలో అడుగడుగునా సూర్యుడి ప్రస్తావన ఉంది. శ్రీరామ లక్ష్మణులను మేలుకొలుపుతూ ‘పూర్వా సంధ్యా ప్రవర్తతే’ అంటాడు విశ్వామిత్రుడు. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ‘రామాయణ కల్పవృక్షం’లోని సుందరకాండలో హనుమంతుడు సూర్యుణ్ణి కీర్తిస్తూ ‘వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకున్ పరమార్థభూతమై, వెలుగులు తన్ను మించి మరి విశ్వంబున వేరు చోట లేవు’ అంటాడు. అంబుధి దాటలేక హనుమంతుడు అలసిపోయి, తన గురువే (సూర్యుడే) ఆదుకుంటాడని చెబుతూ, ‘అంబుధి శోషణ దాహమూర్తి’ అలా సహాయపడతాడని అంటాడు.
*కవిత్వ సద్గురు మూర్తిగా ప్రసిద్ధి చెందిన కవి మారన తన కవిత్వానికి స్ఫూర్తినిచ్చిన సూర్యుడిపై ఏకంగా భాస్కర శతకం రచించాడు. అన్నమయ్య ఆదిగా ఎందరో కవులు సూర్యుణ్ణి వినుతిస్తూ తెలుగు వాఙ్మయాన్ని దివారుకుడి వెలుగులతో నింపారు. శివుడు తాండవ నృత్యం చేయడానికి సాయంసంధ్య ఇష్టమైన కాలమని శంకర భగవత్పాదులు ‘శివానందలహరి’లో చెప్పారు. ‘భవ చండ తాండవ భ్రమర వేగమున దివి నుంచి పడిన అందియ బోలి అరుణ బింబము పశ్చిమాంబుధి గృంకె’ అంటాడు గౌరన కవి. సముద్రంలోకి అస్తమిస్తున్న సూర్యుడి బింబం శివ తాండవ ఉధృతికి ఆకాశం నుంచి జారి పడిన అందెలా ఉందిట! సూర్యనారాయణుడు ‘జగచ్ఛక్షువు కాదు, జగదక్షుడు’ అన్నారు విశ్వనాథ సత్యనారాయణ. అంటే జగతికే నేత్రమైన సూర్యుడి ప్రకాశం లేకపోతే కంటికి చూపే లేదు.
*కర్తవ్య ప్రేరేపకుడు
‘సూర్యుడు’ అనే పదానికి ‘సువతి ప్రేరయితి జనాన్ కర్మణేతి సూర్యః’ అని వ్యుత్పత్తి. ‘లోకులు వారి కర్తవ్యాలను నిర్వహించుకోవడానికి ప్రేరణ ఇచ్చేవాడు’ అని అర్థం. ఈ విధంగా జగత్తును తన వెలుగుతో నడిపిస్తున్నవాడు సూర్య భగవానుడు. మహాభారతంలో ‘రోదసీ కుహరంబు రుచిరాంశుతతి జేసి, యర్కుండు వెలిగించునట్టు’ అంటూ భీష్ముని నోట పలికిన భావం ఇదే! జగత్తుకు- జగదీశ్వరుడైన సూర్యుడికీ అంతటి అవినాభావ సంబంధం. ఆయనను ‘కర్మసాక్షి’ అని పూర్వులు సంబోధించారు. ‘ఒక్క సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు’నన్నాడు మహాకవి పోతన. అందుకే సూర్యుడు అందరివాడు.
*సప్తాశ్వ రథ మారూఢం…
సూర్యుడి రథానికి ఏడు గుర్రాలు అవి: గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్ఠుప్, అనుష్ఠుప్, పంక్తి. అలాగే ఆ గుర్రాలను ఏడు వారాలుగా, ఇంద్రధనుస్సులోని ఏడు రంగులుగా, సప్త ఛందస్సులుగా కూడా పరిగణిస్తారు.సూర్యుడి రథానికి ఉన్న ఆకులు పన్నెండు. వాటిని నెలలుగా, రాశులుగా భావిస్తారు. రథానికి ఉన్న రెండుఇరుసులు రాత్రి, పగలు.సూర్యుడి రథ సారథి పేరు అనూరుడు. అతను గరుత్మంతుడి సోదరుడు. ఊరువులు (తొడలు) లేకుండా జన్మించాడు కాబట్టి అతణ్ణి ‘అనూరుడు’ అంటారు.సూర్యుని తండ్రి కశ్యపుడు. తల్లి అదితి. అందుకే ఆయనను ‘ఆదిత్యుడు’ అంటారు.సూర్యుడికి చైత్ర మాసం నుంచి ఫాల్గుణ మాసం వరకూ ఉన్న నామాలు- ధాతీ, ఆర్యమా, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పూషా, పర్జన్య, అంశుమాన్, భగ, తష్ట్వా. విష్ణు. ఇవి ద్వాదశాదిత్య నామాలు.ఆరు నెలలు దక్షిణ దిశలో, ఆరు నెలలు ఉత్తర దిశలో సూర్యుడి పయనం సాగుతుంది. అవే ‘దక్షిణాయణం’, ‘ఉత్తరాయణం’. మకర సంక్రాంతి రోజున సూర్యుడి ఉత్తరాయణం, కర్కాటక సంక్రమణం రోజున సూర్యుడి దక్షిణాయణం మొదలవుతాయి. వీటిలో ఉత్తరాయణాన్ని అత్యంత పవిత్రకాలంగా భావిస్తారు. సూర్యుడి జయంతి అయిన మాఘ శుద్ధ సప్తమి ఉత్తరాయణంలోనే వస్తుంది. దీనినే ‘రథసప్తమి’ అని కూడా అంటారు.ప్రతిరోజూ సూర్యాష్టకం చదివితే గ్రహబాధలు తొలగడంతో పాటు ఆరోగ్యం కూడా ఒనగూరుతుంది. ఆదిత్య హృదయం నిత్యం పారాయణ చేస్తే ఆరోగ్యంతో పాటు సర్వత్రా విజయం చేకూరుతుంది అని పురాణాలు చెబుతున్నాయి.
2.వైభవంగా వసంత పంచమి వేడుకలు
నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. అమ్మవారి జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో ఆలయం జనసంద్రమైంది. అమ్మవారి జన్మతిథి శుభ ఘడియల్లో చిన్నారుల అక్షరాభ్యాసాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గురువారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే విఠల్రెడ్డిలు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. గత అనుభవాల నేపథ్యంలో అధికారులు చేపట్టిన చర్యలతో ఈ సారి భక్తులకు పూజలు, దర్శనాలు సులభతరమయ్యాయి. అక్షరాభ్యాస పూజలకు రెండు, మూడు గంటల సమయం పట్టింది. ఈసారి వసంత పంచమి ఘడియలు రెండురోజుల పాటు ఉండటంతో భక్తులు బుధ, గురువారాల్లో ఆలయానికి తరలివచ్చారు. మొదటి రోజున 1,568 మంది, రెండో రోజున 3,731 మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించారు. గురువారం ఒక్క రోజే 50 వేల మంది భక్తులు బాసర అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి ఈ ఒక్కరోజే రూ.35.72 లక్షల ఆదాయం సమకూరింది.
3.రేపు తిరుమలలో రథసప్తమి
సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో ఫిబ్రవరి 1న రథసప్తమి వేడుకలకు తితిదే ఏర్పాట్లు చేసింది. శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున స్వామివారి కైంకర్యాలు పూర్తయ్యాక ఉదయం 4.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభమై.. రాత్రి చంద్రప్రభ వాహనంతో ముగుస్తాయి. ఒక్కరోజు బ్రహ్మోత్సవాలుగా పిలిచే ఈ వేడుకను తిలకించేందుకు ఇప్పటికే భక్తులు భారీగా తిరుమలకు చేరుకున్నారు. ఈ పర్వదినం కారణంగా శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దుచేశారు. రథసప్తమిని పురస్కరించుకుని తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1న రెండు తెలుగు రాష్ట్రాల్లో మనగుడి కార్యక్రమం నిర్వహించనున్నారు.
4. అక్షరాలకు ఆదిదేవత
మానవ జాతి మనుగడకు అక్షర సంపద అవసరం. జ్ఞానప్రదాయని అయన సరస్వతి దేవి కటాక్షం ఉంటే చాలు విజ్ఞాన నిధులు సమకూరినట్లే. విభిన్న రీతుల్లో సాగే ఈ విజ్ఞాన నిధులు సమకూరితే ఆయా రంగాల్లో వారు ప్రావీణ్యం సంపాదించగలుగుతారు. ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాల వల్ల సమకూరే అక్షర సంపదను సొంతం చేసుకునేందుకు పెద్దలు తమ పిల్లలకు ఈ రోజు అక్షరాభ్యాసం చేయస్తారు. మాఘమాసంలోని శుద్ధ పంచమి శ్రీ సరస్వతీదేవి పుట్టినరోజు. దీనే్న శ్రీపంచమి, వసంత పంచమి, మదన పంచమి అని కూడా పిలుస్తారు. విద్యారంభానికి ఇది ఎంతో శుభప్రదమైన రోజుగా పరిగణిస్తారు. సర్వజ్ఞానానికి అధిదేవత సరస్వతీదేవి. బ్రహ్మ వైవర్తపురాణంలో మాఘ శుద్ధ పంచమిని విద్యారంభ దినంగా పాటించాలని, సరస్వతీ పూజ చేయాలని ఉంది. సరస్వతి అంటే వాక్కు, పరిశుద్ధమైన మాట. వేద వేదాంగాలూ, శాస్త్రాలూ, పురాణేతిహాసాలు సరస్వతీదేవి శబ్దమయ రూపాలు. సర్వవిద్యలకూ రూపం సరస్వతి. శ్రీవాణి కృప లేకుంటే, లోకానికి మనుగడే లేదు. వాగ్దేవి ఉపాసనవల్ల వాల్మీకి రామాయణ రచన చేశాడంటారు. ఆదిశేషుడు, బృహస్పతి, ఆదిశంకరులు, యాజ్ఞవల్క్యుడు వంటి ఎందరో శారదానుగ్రహ కారణంగా జ్ఞానసంపన్నులయ్యారు. వ్యాసుడు గోదావరి తీరాన సైకత మూర్తి రూపంలో వాణిని ప్రతిష్ఠించాడని పురాణ కథనం. ఆ క్షేత్రమే వ్యాసపురిగా, బాసరగా ప్రసిద్ధి పొందింది. సరస్వతి శబ్దానికి ‘ప్రవాహ రూపంలో వుండే జ్ఞానం’ అని అర్థం. వేదాలు సరస్వతీమాత నుంచే వెలువడ్డాయని ‘గాయత్రి హృదయం’ గ్రంథం అభివర్ణించింది. సరస్వతీదేవిని పూర్వం అశ్వలాయనుడు ఆరాధించి ఆ తల్లి కటాక్షం పొందాడు. సరస్వతీదేవిని ఆరాధించే విధానం ‘సరస్వతీ రహస్యోపనిషత్’ అనే గ్రంథం తెలియజేస్తోంది. తెల్లని పద్మం సరస్వతికి సింహాసనం.
గుణాల్లో సత్వగుణమే ప్రధానం అంటారు. సరస్వతీదేవి సత్వగుణానికి సంకేతం. సత్వగుణానికి శుక్లవర్ణం సంకేతం. అక్షర జ్ఞాన సంపదలను అనుగ్రహించాలని శుక్ల పంచమి నాడు భక్తిశ్రద్ధలతో కోరితే, అది నెరవేరుతుందన్నది ప్రజల విశ్వాసం. అక్షరభ్యాసం నాడు ‘సరస్వతీ నమస్త్భ్యుం’ అంటూ పురోహితుడు వాగ్దేవిని ఆహ్వానించి, అక్షరాభ్యాసం చేయించడం భారతీయ సంప్రదాయం. ఆమె వీణ పేరు కచ్ఛపి. ఆమె నివాసస్థానం నాలుకపైభాగం. అందుకే ఎవరి నోట మాట, పాట, సాహిత్యం, సంగీతం, శాస్త్ర ప్రవచనం వెలువడితే వారిని సరస్వతీ అనుగ్రహం ఉన్నవాళ్లని అంటారు.వసంత పంచమి ఉదయం పూట స్నానాదికాలు ముగించుకుని శుచి అయి, గణపతిని పూజించి, కలశంలో దేవిని ఆవాహన చేయాలి. విద్యాదాయిని సరస్వతీదేవి ప్రతిమ లేదా చిత్రపటానికి తెల్లని పూలు, అక్షతలు, మంచి గంధం, తెల్లని నగలు అలంకరించి షోడశోపచారాలతో పూజించి, పాయసం నివేదించాలి. పూజానంతరం ఆ పాయసాన్ని ప్రసాదంగా అందరికీ పంచి తాము భుజించాలి. సరస్వతీదేవికి తెలుపు రంగు ప్రీతికరం కాబట్టి ఆమెను తెల్లని పూలు, తెల్లని పట్టువస్త్రంతో అలంకరించి, పెరుగు, వెన్న, వరిపేలాలు, తెల్ల నువ్వులతో చేసిన లడ్డు, పాలకోవా, చక్కెర, కొబ్బరికాయ వంటి వాటిని నివేదిస్తే సరస్వతీదేవి ప్రసన్నురాలై కోరిన కోరికలు తీరుస్తుందని శాస్త్రోక్తి. సర్వసృష్టిని, సర్వమానవ ప్రపంచాన్ని నడిపే అంతఃశ్శక్తి సరస్వతీదేవి అనే రహస్యాన్ని మొదట గ్రహించినవాడు శ్రీ శంకర భగవత్పాదులు. అందుకనే సర్వాద్వైత పీఠాలలో సరస్వతీదేవితో కూడి వున్న శారదా చంద్ర వౌళీశ్వర ఆరాధనను ప్రవేశపెట్టారు.శ్రీపంచమి దక్షిణ భారతదేశంలో అంతగా ప్రచారంలో లేకపోయినప్పటికీ, ఉత్తర భారతదేశంలో ఈ పంచమి నాడు సరస్వతీదేవిని అత్యంత శ్రద్ధతో పూజిస్తారు. శ్రీపంచమి రోజు విద్యాభ్యాసం మొదలుపెడితే వారు ఉన్నత విద్యావంతులు అవుతారనే నమ్మకం కూడా చాలామందికి ఉంది. అందుకే తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. హిందూ సంస్కారాలలో అక్షరాభ్యాసం ఒకటి. ప్రాణశక్తిగా, జ్ఞానశక్తిగా ఉపాసించే దేవతను అంబితమే, నదీతమే, దేవితమే అని శ్రుతి కీర్తించింది. అనగా అమ్మల్లో శ్రేష్ఠురాలు, నదుల్లో గొప్పది, దేవతల్లో ఉన్నతురాలు సరస్వతి. సరస్వతి అనే శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా వుంది. వేదం సరస్వతీదేవిని ‘ప్రణోదేవి సరస్వతి! వాజే భిర్వాజినీ వతీ ధీవా మవిత్య్రవతు’ అని ప్రశంసించింది. విద్యాదానం జ్ఞానదానమేనని, అన్నదానం తర్వాత దీనికే ప్రాముఖ్యత ఉందంటారు. శాంతమూర్తియైన సరస్వతీదవి ఒక చేత వీణ, మరో చేత పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. ఈ రూపం విద్య, జ్ఞాన, బుద్ధులకు ప్రతీక. ఆమె కరుణతోనే విద్యాప్రాప్తి, జ్ఞాన ప్రాప్తి దక్కుతుందనేది శాస్త్రోక్తి. దొంగలు దోచలేనిది, నలుగురికి పంచగల శక్తి విద్యకు మాత్రమే ఉంది. మనిషికి మాటే ప్రాణం కాబట్టి దేవిని ఆరాధించి మనిషి సద్బుద్ధిని పొందుతాడు. గాయత్రీ దేవికి గల ఐదు రూపాలలో సరస్వతీదేవి ఒకటి. యాజ్ఞవల్క్యుడు గురుశాపంవలన విద్యను కోల్పోవడంతో సూర్యుని ఆరాధించగా, అతడు యాజ్ఞవల్క్యునికి సరస్వతీ ఉపాసనను ఉపదేశించాడు. సరస్వతీదేవి కృపవలన స్మృతి శక్తిని తిరిగి సంపాదించుకుని మహావిద్వాంసుడయ్యాడు. తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహం పొందడమేగాక ఆ గ్రంథాన్ని పొట్ట కూటికోసం నరులెవ్వరికీ అంకితమివ్వనని వాగ్దానం చేశాడు. మన రాష్ట్రంలో బాసర సరస్వతీ ఆలయం, వర్గల్ సరస్వతీ ఆలయం, శృంగేరీలోని శారదాదేవి ఆలయం ప్రసిద్ధిగాంచినవి. గుజరాత్లో దండియా ఉత్సవాలు జరుపుకున్నట్లే, ఉత్తరాఖండ్లో వసంత పంచినాడు భూదేవికి వైభవంగా పూజలు చేయడం ఆచారం. శృంగారకేళి వినోదాలకు, దేశ వ్యాప్తంగా వసంతోత్సవాలకు వైతాళికుడి లాంటి శ్రీపంచమి, పర్వదినమే కాదు – అక్షర శుభోదయానికి శ్రీకారం వంటిది. సరస్వతీదేవిని నలువరాగి, పలుకు చెలి, చదువుల వెలది అంటూ అచ్చతెలుగులో ముచ్చటతీరా పిలుచుకుంటారు. ఈ రోజు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి, అందరూ సరస్వతీ అనుగ్రహానికి పాత్రులవుదాం.
సరస్వతీ నమస్త్భ్యుం, వరదే కామరూపిణీ!విద్యారంభం కరిష్యామి, సిదిర్భవతుమే సదా!
5. అమలాపురం – సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణోత్సవంలో భాగంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీగా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని అమలాపురం డిఎస్ పి షేక్ మాసుమ్ భాష తెలిపారు. బందోబస్తుకు 6గురు డీఎస్పీలు,30 సిఐలు 100ఎస్సైలు లతో పాటు పోలీస్ సిబ్బంది తో కలిపి మొత్తం1500 మంది తో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని. ఆలయానికి వచ్చే వారికి వన్ వే ద్వారా అంతర్వేది,అంతర్వేది కర మీదగా ఆలయానికి చేరుకోవాలని. అదేవిధంగా ఆలయం నుంచి తిరిగి వెళ్లేందుకు రెండు మార్గాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్టీసీ బస్సులకు గొంది మిదిగా, మిగిలిన వాహనాలకు మూడుతూములు మీదగా వెళ్లాలని. స్వామివారి ఆలయ ప్రాంగణమంతా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అమలాపురం డి.ఎస్.పి షేక్ భాష తెలిపారు..
6. ఫిబ్రవరి 1 నుంచి అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాలు*
తూ.గో.జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాలు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు జరగనున్నాయి.
4వ – తేదీన రాత్రి 12 గంటల 30 నిమిషాలకు స్వామివారి కళ్యాణం
5వ-తేదీన మధ్యాహ్నం 2-15ని స్వామివారి రథోత్సవం
9వ-తేదీన ఉదయం 8 గంటలకు స్వామివారి చక్రస్నానం
10వ-తేదీన సాయంత్రం 6 స్వామివారి తెప్పోత్సవం
జరుగుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.
7. రథసప్తమి సందర్భంగా..పెన్నహోబిలంలో శ్రీవారికి ఒకేరోజు నాలుగు వాహన సేవలు.*
సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 1న‌ రథసప్తమిని పురస్కరించుకుని ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఒకే రోజున నాలుగు వాహన సేవలు నిర్వహించనున్నారు. సేవల అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.రథసప్తమి ఏర్పాట్లపై ఈవో రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ ప్ర‌తిఏటా మాఘ శుద్ధ స‌ప్త‌మినాడు పెన్నహోబిలంలో ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినాన్ని నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌న్నారు.స్వామివారు ఒకేరోజు నాలుగు ప్ర‌ధాన వాహ‌నాల‌పై విహరిస్తారని పేర్కొన్నారు.సూర్య‌ప్ర‌భ వాహ‌నంతో మొదలై గో వాహణం,హనుమంత వాహనం, గరుడ వాహనోత్సవంతో వాహ‌న‌సేవ‌లు ముగుస్తాయ‌ని తెలిపారు.అనంతరం కల్యాణోత్సవం జరుపుతామని తెలిపారు.మాములుగా బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి రోజుకు రెండు వాహన సేవలు మాత్రమే నిర్వహిస్తామని కానీ రథసప్తమి రోజున ప్రత్యేకంగా నాలుగు వాహన సేవలు జరుగుతాయన్నారు.ఇటువంటి అరుదైన ఘట్టంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.రథసప్తమి నాడు వాహనసేవల వివరాలు :
సూర్యప్రభ వాహనం
ఉదయం 8:00 గం||ల నుంచి 8:30 గం||ల వరకు
గో వాహనోత్సవం
ఉదయం 09.00 గం||ల నుంచి 9:30. గం||ల వరకు
హనుమంత వాహనోత్సవం
ఉదయం 10.00 గం||ల నుంచి 10.30 గం||ల వరకు
గరుడ వహనోత్సవం
మధ్యాహ్నం 11:00 గం||ల నుంచి 11.30 గం||ల వరకు
కల్యాణోత్సవం
11.30 గం||ల నుంచి 1.00 గం||ల వరకు
8. చరిత్రలో ఈ రోజుజనవరి, 31
సంఘటనలు*
1943: రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైన్యాలు రష్యా లోని స్టాలిన్‌గ్రాడ్ వద్ద రష్యా సైన్యానికి లొంగిపోయాయి.
1953: శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువుని వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులు 1953లో తిరిగి ముద్రించదలచారు. ఈ బృహత్తర కార్యం కోసం వీరు ఎస్.నారాయణ అయ్యంగార్ మరియు వేదం లక్ష్మీనారాయణ శాస్త్రి సమున్నత కృషిచేశారు. వీరి ప్రచురణ 1953 జనవరి 31లో ప్రచురించబడింది. ఈ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు మొదటిసారిగా 1900 సంవత్సరంలో మద్రాసు నుండి ప్రచురించబడింది. చూడు : పి.శంకరనారాయణ
1963: నెమలిని జాతీయ పక్షిగా భారత్ ప్రకటించింది.
1972: నేపాల్ రాజుగా బీరేంద్ర అధికారంలోకి వచ్చాడు.
2009: ఆస్ట్రేలియన్ ఓపెన్ బాలుర విభాగంలో భారత్ కు చెందిన యుకీ భాంబ్రీ టైటిల్ నెగ్గి ఆస్ట్రేలియన్ ఓపెన్ జూనియర్ టైటిల్ పొందిన తొలి భారతీయుడిగా అవతరించాడు.
*జననాలు*
1763: జెన్స్ ఎస్మార్క్ డానిష్-నార్వేయిన్ భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు. ప్రపంచవ్యాప్త మంచు యుగాల క్రమాన్ని వివరించాడు. (మ.1839)
1895: రాగ్నర్ ఫ్రిష్, ప్రముఖ ఆర్థికవేత్త
1905: కందుకూరి రామభద్రరావు, ప్రముఖ తెలుగు రచయిత, కవి మరియు అనువాదకుడు. (మ.1976)
1927: రావెళ్ళ వెంకట రామారావు, తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (మ.2013)
1974: రక్ష, భారత సినీ నటి..
1974: వనమాలి, వర్థమాన సినీ గీత రచయిత.
*మరణాలు*
1626: సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, గోల్కొండను పరిపాలించిన కుతుబ్‌షాహీ వంశమునకు చెందిన ఆరవ చక్రవర్తి.
1666: షాజహాన్, మొఘల్ సామ్రాజ్యపు ఐదవ చక్రవర్తి. (జ.1592)
1969: మెహర్ బాబా, అవతార్, (జ.1894)
1972: మహేంద్ర, నేపాల్ రాజు.
1973: రాగ్నర్ ఫ్రిష్, ప్రముఖ ఆర్థికవేత్త .
2003: మేకా రంగయ్య అప్పారావు, నూజివీడు జమిందారీ కుటుంబానికి చెందిన వారు ప్రముఖ విద్యావేత్త, మాజీ మంత్రి
2009: నగేష్, దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ హాస్యనటుడు మరియు రంగస్థల నటుడు (జ.1933).
9. తిరుల సమాచారం* ఓం నమో వేంకటేశాయ*
ఈరోజు శుక్రవారం *31-01-2020* ఉదయం *5* గంటల సమయానికి.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం….
శ్రీవారి సర్వ దర్శనానికి *13* కంపార్ట్ మెంట్ లలో వేచి ఉన్న భక్తులు…….
శ్రీవారి సర్వదర్శనానికి *6* గంటల సమయం పడుతోంది….
ప్రత్యేక ప్రవేశ దర్శనం (300/-), టైమ్ స్లాట్ సర్వదర్శనం, కాలినడక దర్శనాలకు *3* గంటల సమయం పడుతోంది….
నిన్న జనవరి *30* వ తేదిన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు *67,103* మంది…
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు *₹ 2.89* కోట్లు…
10. చరిత్రలో ఈ రోజు
జనవరి, 31
సంఘటనలు
1943: రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైన్యాలు రష్యా లోని స్టాలిన్‌గ్రాడ్ వద్ద రష్యా సైన్యానికి లొంగిపోయాయి.
1953: శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువుని వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులు 1953లో తిరిగి ముద్రించదలచారు. ఈ బృహత్తర కార్యం కోసం వీరు ఎస్.నారాయణ అయ్యంగార్ మరియు వేదం లక్ష్మీనారాయణ శాస్త్రి సమున్నత కృషిచేశారు. వీరి ప్రచురణ 1953 జనవరి 31లో ప్రచురించబడింది. ఈ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు మొదటిసారిగా 1900 సంవత్సరంలో మద్రాసు నుండి ప్రచురించబడింది. చూడు : పి.శంకరనారాయణ
1963: నెమలిని జాతీయ పక్షిగా భారత్ ప్రకటించింది.
1972: నేపాల్ రాజుగా బీరేంద్ర అధికారంలోకి వచ్చాడు.
2009: ఆస్ట్రేలియన్ ఓపెన్ బాలుర విభాగంలో భారత్ కు చెందిన యుకీ భాంబ్రీ టైటిల్ నెగ్గి ఆస్ట్రేలియన్ ఓపెన్ జూనియర్ టైటిల్ పొందిన తొలి భారతీయుడిగా అవతరించాడు.
జననాలు
1763: జెన్స్ ఎస్మార్క్ డానిష్-నార్వేయిన్ భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు. ప్రపంచవ్యాప్త మంచు యుగాల క్రమాన్ని వివరించాడు. (మ.1839)
1895: రాగ్నర్ ఫ్రిష్, ప్రముఖ ఆర్థికవేత్త
1905: కందుకూరి రామభద్రరావు, ప్రముఖ తెలుగు రచయిత, కవి మరియు అనువాదకుడు. (మ.1976)
1927: రావెళ్ళ వెంకట రామారావు, తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (మ.2013)
1974: రక్ష, భారత సినీ నటి..
1974: వనమాలి, వర్థమాన సినీ గీత రచయిత.
మరణాలు
1626: సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, గోల్కొండను పరిపాలించిన కుతుబ్‌షాహీ వంశమునకు చెందిన ఆరవ చక్రవర్తి.
1666: షాజహాన్, మొఘల్ సామ్రాజ్యపు ఐదవ చక్రవర్తి. (జ.1592)
1969: మెహర్ బాబా, అవతార్, (జ.1894)
1972: మహేంద్ర, నేపాల్ రాజు.
1973: రాగ్నర్ ఫ్రిష్, ప్రముఖ ఆర్థికవేత్త .
2003: మేకా రంగయ్య అప్పారావు, నూజివీడు జమిందారీ కుటుంబానికి చెందిన వారు ప్రముఖ విద్యావేత్త, మాజీ మంత్రి
2009: నగేష్, దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ హాస్యనటుడు మరియు రంగస్థల నటుడు (జ.1933).11.
12. పంచాంగము 31.01.2020
సంవత్సరం: వికారి
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: శిశిర
మాసం: మాఘ
పక్షం: శుక్ల
తిథి: షష్టి ప.01:10 వరకు
తదుపరి సప్తమి
వారం: శుక్రవారం (భృగు వాసరే)
నక్షత్రం: రేవతి ప.03:33 వరకు
తదుపరి అశ్విని
యోగం: సద్య, శుభ
కరణం: తైతిల
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: 09:04 – 09:50
మరియు 12:52 – 01:37
రాహు కాలం: 11:04 – 12:29
గుళిక కాలం: 08:13 – 09:38
యమ గండం: 03:20 – 04:45
అభిజిత్ : 12:07 – 12:51
సూర్యోదయం: 06:48
సూర్యాస్తమయం: 06:10
వైదిక సూర్యోదయం: 06:52
వైదిక సూర్యాస్తమయం: 06:06
చంద్రోదయం: ఉ.10:56
చంద్రాస్తమయం: 11:27
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: మీనం
దిశ శూల: పశ్చిమం
చంద్ర నివాసం: ఉత్తరం
వరుణ షష్ఠి
భోగి
స్కంద షష్ఠి
13. రాశిఫలం – 31/01/2020
తిథి:
శుద్ధ షష్టి మ.12.32, కలియుగం-5121 ,శాలివాహన శకం-1941
నక్షత్రం:
రేవతి మ.3.27
వర్జ్యం:
లేదు
దుర్ముహూర్తం:
ఉ.08.24 నుండి 09.12 వరకు, తిరిగి మ.12.24 నుండి 01.12వరకు
రాహు కాలం:
ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందుల అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా వుంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణా తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా వుంటుంది. బంధు, మిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) ఋణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలుంటాయ. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం వుంది. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి వుంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) కుటుంబ విషయాలపై ఆనాసక్తితో వుంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరతాయి. స్ర్తిలతో జాగ్రత్తగా నుండుట మంచిది.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) కుటుంబంలో సుఖ, సంతోషాలుంటాయి. ధనధాన్యాభివృద్ధి వుంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యములు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా వుంటాయి.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గూర్చి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులెదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనవసర వ్యయ ప్రయాసలుంటాయి. ప్రయాణాలెక్కువ చేస్తారు.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) బంధు, మిత్ర విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. మానసికాందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) విందులు, వినోదాలకు దూరంగా నుండుట మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశముంది. మానసికాందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలెదురగును. ఆరోగ్యం గూర్చి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) శుభకార్య ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ధనలాభంతో ఆనందంగా వుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తిప్రతిష్ఠలు అధికమవుతాయి.
14. ధ్యాన ఫలం
‘జీవితంలోని అత్యుత్తమ కళల్లో ధ్యానం ఒకటి’ అనేవారు ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి. అదే అత్యంత ఉన్నతమైంది కూడా. బతుకు పయనంలో జరిగే వ్యావహారిక పనులేకాకుండా కళలూ మనిషి చేపట్టే ప్రక్రియలే. జీవనం కోసం చేసే సాధారణ పనులకన్నా కళలు కొంత ప్రత్యేకతను కలిగి ఉంటాయి. చూపరుల దృష్టిని ఇట్టే ఆకట్టుకుని ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంటాయి. అందుకు ప్రధాన కారణం- రోజువారీ పనుల్ని మొక్కుబడిగా, లాంఛనప్రాయంగా చేసి ముగిస్తారు. కళల్ని శ్రద్ధగా, భక్తితో చేసి పూర్తిగావిస్తారు. శిల్పాన్ని చెక్కడం, సంగీత వాయిద్యాలు వాయించడం, మురళీగానం, చిత్రలేఖనం… ఇవన్నీ ధ్యానంతో చేసేవి. అందువల్లే, కళల్ని ప్రత్యేకంగా ప్రేమించిన వ్యక్తికి పట్టరానంత ఆనందం కలుగుతుంది.భూమి చుట్టూ ప్రాణవాయువు వ్యాపించి జీవరాశిని బతికిస్తున్నట్టుగానే, మనిషిని సాధికారికంగా నడిపించడానికి అతడి జీవితం చుట్టూ ధ్యానం పరచుకుని ఉంటుంది. అది అనాదిగా ఉంటోంది. ఇప్పుడూ ఉంది. ఎప్పటికీ ఉంటుంది. కానీ, మనిషే దాన్ని మరిచిపోయాడు. అందుకనే ‘ఒక్క మనిషి తప్ప ప్రకృతి మొత్తం ధ్యానంతో ఉంటోంది’ అనేవారు సుప్రసిద్ధ తత్వవేత్త ఓషో.అద్భుతమైన పనికి ఆకర్షితులైన చూపరులు దానికి మెచ్చుకోలు పలుకుతూ ‘ఈ పనిలో కళాత్మకత ఉట్టిపడుతోంది’ అనడం తరచూ వింటూ ఉంటాం. ఒక పనిని చాలా ఇష్టంగా, ధ్యానంతో చేస్తే దాన్ని కళతో పోల్చిచెప్పడం లోకంలో పరిపాటి. చేపట్టిన పని పైన లేదా ఒక విషయం మీద మనసును లగ్నం చేసినప్పుడు అది చంచల స్వభావాన్ని కోల్పోతుంది. అప్పుడిక మిగిలేది- ఎరుకతో కూడిన గమనింపు. ధ్యానమంటే అదే. బహుమూల్యమైన ఆ ధ్యానంతో చేసే ఏ పనైనా బాగా పండుతుంది. ప్రతిఫలంగా, రావాల్సిన ఫలాల మూట- పెద్ద మొత్తంలో అందుతుంది.‘ఒక వ్యక్తికి కీడు కలిగించి, తన కుటుంబానికి సమాజానికి హాని తలపెట్టే దుశ్చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు మంచివి కావు. అవి అత్యంత ప్రమాద కారకాలు’ అని పెద్దలు చెప్పడం వెనకాల తాత్విక నేపథ్యం, ఆధ్యాత్మిక కారణాలూ ఉన్నాయి. చెడు పనిని ఎరుకతో చెయ్యలేరు. అది అసాధ్యం. ఎరుకలేని చోట ధ్యానం కుదరదు. ధ్యానం లేని పని ఆధ్యాత్మికంగా నిస్సారమైంది. గడ్డిపోచ విలువ చెయ్యని చిన్నపనైనా, సింహాసనంపై ఉండి రాజ్యమేలే పెద్ద పనైనా- వాటిపై ప్రేమ లేనప్పుడు ఆ పనులు చేయకుండా ఉండటమే మేలు.‘ప్రేమతో పనిచేసినప్పుడు మీతో మీరు, ఒండొరులతో, దేవుడితో బంధాలు ఏర్పరచుకుంటారు’ అంటారు లెబనాన్‌ తత్వవేత్త ఖలీల్‌ జిబ్రాన్‌.ఆకాశాన్ని తాకేంత ఒక పెద్ద భవనం చాలా కాలంపాటు చెక్కుచెదరకుండా నిలబడాలంటే, దాని పునాది బలంగా ఉండాలి. మనిషి జీవితానికీ ఇది వర్తిస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనిషి మనసు బాగుండాలి. మనసు మంచిగా ఉండాలంటే అది ఆనందంతో నిండాలి. దానికి ధ్యానమే అంతిమ సోపానం.గోళ్లను గోళ్లతో రాపిడి చేయడం, ఆహారం సేవిస్తున్నప్పుడు పండ్లతో బాగా నమలడం వల్ల ఆరోగ్య ఫలాలు అందుతాయని యోగా చెబుతుంది. పైగా హింసా ప్రవృత్తి విడనాడి అహింసా మార్గం అలవడుతుంది. అందుకే నెమరువేసే గుణం ఉన్న పశువులు సాధు స్వభావం కలిగి ఉంటాయి. మనిషికి కోపం వచ్చినప్పుడు శక్తి విస్ఫోటం చెంది మనిషిలోని బలం వృథా అవుతుంది. క్రోధం కలిగే క్షణాల్లోనే దాని మూలాన్ని పట్టుకుని గమనించితే, ఆ కోపమంతా ప్రేమగా రూపాంతరం చెందుతుంది. అదే ధ్యానం వల్ల కలిగే రహస్య ప్రయోజనం.రోజూ ఉదయం, సంధ్యా కాలాల్లో ధ్యాన సాధన సాగుతుంటే జీవితం పట్ల ఒక స్పష్టత వస్తుంది. జీవితానికి లక్ష్యమూ ఏర్పడుతుంది. ఎలా జీవించాలో తెలుస్తుంది.
15. దేవాదాయ స్థలాలకు ఇక లైసెన్సులే
దేవాదాయశాఖకు చెందిన స్థలాలు, దుకాణాలను ఇకపై లీజు ప్రాతిపదికన ఇవ్వరు. సంబంధిత స్థలం లేక దుకాణానికి లైసెన్స్ జారీ చేస్తారు. దానిని పొందే వారికి అవసరాన్నిబట్టి 11 ఏళ్ల వరకు అనుమతిస్తారు. ఇప్పటివరకు అమలులో ఉన్న 33ఏళ్లకు లీజు పొందే విధానానికి స్వస్తి పలికారు. ఈ మేరకు కొత్త నిబంధనలను అమలు చేసేలా ఆ శాఖ ఉన్నతాధికారులు సర్క్యులర్ జారీ చేశారు.
* లైసెన్స్ జారీకి 3 విధానాలను అమలు చేస్తారు. తొలుత బహిరంగ వేలం నిర్వహిస్తారు. తర్వాత బాక్స్ టెండరు, చివరగా ఈ-టెండర్ తెరిచి చూస్తారు. వీటిలో ఎందులో ఎక్కువ ధర కోట్ చేస్తారో వారికే ఇస్తారు. స్థల విస్తీర్ణం బట్టి వేలం, టెండరును ఉప కమిషనర్ (డీసీ), ప్రాంతీయ సంయుక్త కమిషనర్ (ఆర్జేసీ) పర్యవేక్షణలో నిర్వహిస్తారు.
* ఏడాది అద్దె ముందే చెల్లించాలి. ఆ స్థలం విలువలో 25 శాతం బ్యాంకు గ్యారంటీని ఇవ్వాలి.
* ఖాళీ స్థలం తీసుకుంటే అందులో ఎటువంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. షెడ్లు వంటివి నిర్మించుకోవచ్చు.
* హిందువు అయి ఉండాలి. దేవాదాయశాఖ నిషేధించిన వస్తువులు, పదార్థాలు ఏవీ విక్రయించకూడదు.
* సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లైసెన్స్ను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీని నమూనాలను అన్ని జిల్లాలకు పంపారు.
* వ్యవసాయ భూములకు మాత్రం పాత లీజు విధానం కొనసాగుతుంది.
***నిబంధనలపై భిన్నవాదనలు..
కొత్త నిబంధనల వల్ల దేవాదాయశాఖ స్థలాలు, దుకాణాలు ఎక్కువ కాలం ఇతరుల చేతుల్లో ఉండే అవకాశం ఉండదని, ఆదాయం కూడా ఎక్కువగా వస్తుందని అధికారులు చెబుతున్నారు. నాలుగేళ్ల కిందట ఇచ్చిన ఉత్తర్వుల్లో ఉన్న నిబంధనలనే ఇప్పుడు అమలు చేసేలా ఆదేశాలిచ్చామని పేర్కొంటున్నారు. స్థలం, దుకాణం విలువలో 25శాతం బ్యాంకు గ్యారంటీ చూపడం, ఏడాది అద్దె చెల్లించమనడం వంటివి సాధారణ, చిన్న వ్యాపారులకు కష్టమేనని కొందరు వాదిస్తున్నారు. పెద్ద సంస్థలు, వ్యాపారులకు మేలు చేసేందుకే ఈ నిబంధనలు తెచ్చారని పేర్కొంటున్నారు.
1. 100 రోజుల్లో రూ.40 కోట్లు-శ్రీవాణి ట్రస్టుకు విరాళాల వెల్లువ
తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ ఇతర వెనుకబడిన ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి, పురాతన ఆలయాల పరిరక్షణకు ఏర్పాటు చేసిన శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ (శ్రీవాణి) ట్రస్టుకు దేశ, విదేశాల్లోని భక్తుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నట్లు తితిదే తెలిపింది. 100 రోజుల్లో ట్రస్టుకు రూ.40 కోట్ల విరాళాలు వచ్చాయి. రూ.10వేల విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. అక్టోబరు 21 నుంచి ప్రారంభమైన ట్రస్టుకు ఆన్లైన్లో 18,216, ఆఫ్లైన్లో 13,380మంది దాతలు విరాళాలను అందించారు.
15. శ్రీవారి సేవకుల స‌హ‌కారంతో భ‌క్తుల‌కు విశేష సేవ‌లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌
తిరుమ‌ల శ్రీ వారి ద‌ర్శ‌నానికి ప్ర‌తి రోజు విచ్చేసే ల‌క్ష‌లాది భ‌క్తుల‌కు విశేష‌ సేవ‌లందిస్తున్న‌ శ్రీ‌వారి సేవ‌కుల స‌హ‌కారంతో టిటిడి మ‌రిన్నిసేవ‌లందిస్తున్న‌ద‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఉద్ఘాటించారు. ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని టిటిడి ఈవో, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి శుక్ర‌వారం ఉదయం తిరుమలలోని ఆస్థానమండపంలో శ్రీవారి సేవకులకు ఆలయ నాలుగు మాడ వీధులలో భక్తులకు అందించవలసిన సేవలను వివరించారు.ఈ సందర్భంగా టిటిడి ఈవో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రథసప్తమి పర్వదినాన శ్రీవారు సప్తవాహనాలపై దర్శనమిస్తారు కావున అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు విచ్చేస్తారని తెలిపారు. శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌లో గ‌రుడ‌సేవ‌నాడు విచ్చేసే ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు, వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినాన దాదాపు 30 గంట‌ల పాటు నిరంత‌రాయంగా శ్రీ‌వారి సేవ‌కులు సేవ‌లందించార‌ని అభినందించారు. ఇదే స్ఫూర్తితో ర‌థ‌స‌ప్త‌మినాడు గ్యాలరీల్లోని ప్ర‌తి భ‌క్తునికి సమయానుకూలంగా టి, కాఫి, అల్పాహారం, మ‌జ్జిగ‌, అన్నప్రసాదాలు అందేలా చూడాలన్నారు. గ్యాల‌రీల్లో భక్తుల సౌక‌ర్యాల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు టిటిడి అధికారులకు, సిబ్బందికి నాలుగు మాడ వీధులలో విధులు కేటాయించినట్లు తెలిపారు. ప్ర‌తి గ్యాల‌రీలో టిటిడి సిబ్బందితోపాటు పారిశుద్ధ్య‌ సిబ్బంది, శ్రీ‌వారి సేవ‌కులు ఉండేలా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు. స్వామివారు క‌ల్పించిన ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని శ్రీవారి సేవకులు భక్తి భావంతో, సేవాదృక్పధంతో, శ్రద్ధ‌తో సేవలందిలని కొరారు. వాహనసేవల సమయంలో గ్యాలరీల్లోని భక్తులు సంతృప్తికరంగా స్వామివారిని దర్శించుకునేలా, భక్తులతో గౌరవప్రదంగా నడుచుకోవాలన్నారు.నేడు శ్రీ‌వారి సేవ‌కులు తిరుమ‌ల‌లోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, అన్న‌ప్ర‌సాదం, ల‌డ్డూ కౌట‌ర్లు, గో సంర‌క్ష‌ణ‌శాల త‌దిత‌ర టిటిడిలోని అన్ని విభాగాల‌లో సేవ‌లందిస్తున్నార‌న్నారు. నూత‌న శ్రీ‌వారి సేవా స‌ద‌నాలు రూ .98 కోట్ల‌తో నిర్మించి అన్ని సౌక‌ర్యాలు ఏర్పాటు చేసిన‌న‌ట్లు తెలిపారు. శ్రీ‌వారి సేవ‌కులు తిరుమ‌ల‌లోనే కాకుండా త‌మ‌త‌మ ప్రాంతాల‌లో హిందూ ధ‌ర్మ ప్ర‌చారానికి కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారి డా. టి.ర‌వి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ కార్యక్రమంలో ఏపిఆర్వో కుమారి పి.నీలిమ‌, ఏఇ శ్రీ వ‌ర‌ప్ర‌సాద్‌, ఓఎస్‌డిలు శ్రీ ఫ‌ణిరంగ‌సాయి, శ్రీ శ్రీ‌ధ‌ర్‌ ఇత‌ర అధికారులు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, ఓడిశా రాష్ట్రాల నుండి విచ్చేసిన 3500 మంది శ్రీ‌వారి సేవ‌కులు పాల్గొన్నారు.
16. టిటిడి స్థానికాల‌యాల్లో రథసప్తమికి స‌ర్వం సిద్ధం
టిటిడికి అనుబంధంగా ఉన్న ఆల‌యాల్లో ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ శ‌నివారం రథసప్తమి పర్వదినానికి అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఆయా ఆల‌యాల్లో చ‌లువ‌పందిళ్లు వేసి విద్యుద్దీపాలంక‌ర‌ణ‌లు, పుష్పాలంక‌ర‌ణ‌లు చేప‌ట్టారు. ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమినాడు సూర్యజయంతిని పురస్కరించుకొని టిటిడి స్థానిక ఆలయాల్లో రథసప్తమి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఆరోజు ఉదయం భానుని తొలిరేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన స్వామివారి నుదుట‌న‌, నాభి, పాదకమలాలపై ప్రసరించే అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు ఎదురుచూస్తుంటారు.
*తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శ‌నివారం రథసప్తమి సందర్భంగా ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహనసేవలు ప్రారంభమవుతాయి. అప్పటినుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అమ్మవారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై ఊరేగనున్నారు. సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 9.30 గంటల వరకు చంద్రప్రభ, గజ వాహనాలను అధిష్టించి అమ్మవారు దర్శనమిస్తారు.ర‌థ‌స‌ప్త‌మి కార‌ణంగా ఆల‌యంలో క‌ల్యాణోత్స‌వం, సామ‌వేద పుష్పాంజ‌లి, స‌హ‌స్ర‌దీపాలంక‌ర‌ణ సేవ‌ల‌తోపాటు సాయంత్రం బ్రేక్ ద‌ర్శ‌నాన్ని ర‌ద్దు చేయ‌డ‌మైన‌ది.
*శ్రీ సూర్య‌నారాయ‌ణ‌స్వామివారి ఆల‌యంలో
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న‌ శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వ‌ర‌కు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనభాగ్యం క‌ల్పిస్తారు.
*తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లు సప్తవాహనాలపై ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు శ్రీచక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలోని ఆళ్వారు తీర్థానికి వేంచేపు చేసి చక్రస్నానం నిర్వహిస్తారు. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో శ్రీ గోవిందరాజస్వామివారి వాహన సేవలు ప్రారంభమవుతాయి. రాత్రి 8 గంటల వరకు హంస, హనుమంత, పెద్దశేష, ముత్యపుపందిరి, సర్వభూపాల, గరుడవాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
*తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఉదయం 7.30 నుండి 9.30 గంటల వ‌ర‌కు సూర్యప్రభవాహనం, రాత్రి 7 నుండి 9 గంటల వ‌ర‌కు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
*శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు సూర్య‌ప్ర‌భ వాహ‌నం, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వ‌ర‌కు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్ర‌హిస్తారు.
*నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ….
నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు సూర్యప్రభ, హంస, చిన్నశేష, కల్పవృక్ష, పెద్దశేష వాహన సేవలు, తిరుచ్చి ఉత్సవం నిర్వ‌హిస్తారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8 గంటల వరకు చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
*నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో ….
నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సూర్యప్రభ, హంస, కల్పవృక్షవాహనాలు, తిరుచ్చిపై స్వామివారు ఊరేగి భక్తులను అనుగ్ర‌హిస్తారు. సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు శేషవాహనం, చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు, సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు తిరువీధి ఉత్సవం జ‌రుగ‌నుంది.కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో 6.30 నుండి 8 గంటల వరకు స్వామివారికి తిరుచ్చి ఉత్సవం నిర్వహించ‌నున్నారు.న‌గ‌రిలోని శ్రీ క‌రియ‌మాణిక్య‌స్వామివారి ఆల‌యంలో ఉద‌యం 9 నుండి 10.30 గంటల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌రియ మాణిక్య‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌కు స్న‌ప‌న‌తిరుమంజ‌నం, సాయంత్రం 6 నుండి 8 గంట‌ల వ‌ర‌కు ఆర్జిత క‌ల్యాణోత్స‌వం నిర్వ‌హిస్తారు.స‌త్ర‌వాడ‌లోని శ్రీ క‌రివ‌ర‌ద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో ఉద‌యం 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు సూర్య‌ప్ర‌భ వాహ‌నం, సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు చంద్ర‌ప్ర‌భ వాహ‌నం గ్రామోత్స‌వం చేప‌డ‌తారు.
17. సమ్మక్క-సారలమ్మ వద్దకు సైకిల్‌యాత్ర పోస్టర్‌ ఆవిష్కరణ
తెలంగాణ సంక్షేమంతో పాటు సమ్మక్క-సారలమ్మ పై తనకున్న అఖండ భక్తి శ్రద్దల కారణంగా అమ్మవార్లజాతర జరిగే మేడారం వద్దకు సైకియల్‌ యాత్ర చేస్తున్నట్టు సీనియర్‌జర్నలిస్టు, సంత్‌స్వామి మహరాజ్‌ పొన్నాల గౌరీశంకర్‌ తెలిపారు. ఈమేరకు తన యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను తెలంగాణ ప్రభుత్వ పత్రిక సంపాదకులు అష్టకాల రామ్మోహన్‌, సమాచార పౌరసంబంధాల శాఖ డైరెక్టర్‌ నాగయ్యకాంబ్లీ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ హష్మీ వేర్వేరుగా ఆవిష్కరించారు. హైదరాబాద్‌కు సుమారు 300 కి.మీ. దూరం మేడారంలో కొలువైన సమ్మక్క- సారలమ్మజాతరకు సైకిల్‌ యాత్రచేస్తున్నట్టు ఆయన తెలిపారు. తెలంగాణ సాకారమైతే సైకిల్‌పై వచ్చి దర్శనం చేసుకుంటానని వన దేవతలకు మొక్కుకున్నట్టుఆయన తెలిపారు. మొక్కు తీర్చుకోవడంలో భాగంగానే ఈ సైకిల్‌యాత్ర చేపట్టినట్టు తెలిపారు. తాను ఇప్పటి వరకూ దేశంలోని 710 జిల్లాల్లో ప్రాచీన దేవాలయాలను సందర్శించినట్టు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన పలు సంక్షేమ పధకాలను ఆయా ప్రాంతాల్లో ప్రచారంచేసినట్టు పేర్కొన్నారు. తెలంగాణకు హరితహారం పై ప్రచారం కోసం కూడా సైకిల్‌యాత్ర చేసినట్టు గౌరీశంకర్‌ స్వామి వెల్లడించారు. ప్రతి గ్రామంలో వంద మొక్కలు నాటించి పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషి చేసినట్టు వెల్లడించారు.