Movies

ఎలాంటి గొడవలు లేవు

Manchu Lakshmi Speaks Of Feud Between Chiranjeevi And Mohanbabu

టాలీవుడ్‌ అగ్రకథానాయకులు చిరంజీవి, మోహన్‌బాబుకి మధ్య ఎలాంటి గొడవల్లేవని ప్రముఖ నటి, మోహన్‌బాబు కుమార్తె మంచులక్ష్మి తెలిపారు. కొత్త దశాబ్దం.. కొత్త సంవత్సరంలో మొదటి నెల నిన్నటితో పూర్తి కావడంతో ఆమె ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. జనవరి నెలలో తాను సంతోషానికి గురైన అన్ని సంగతులనూ అందులో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ‘మా’ డైరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోహన్‌బాబు-చిరంజీవి ఆలింగనం చేసుకున్న ఓ ఫొటోను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు.‘ఈ ఏడాదిలోని మొదటి నెల నేటితో పూర్తి కావొచ్చింది. కొత్త దశాబ్దం.. కొత్త ఏడాది.. నాన్న, చిరు అంకుల్‌ ఆలింగనం చేసుకున్న ఫొటోలతో చాలా అద్భుతంగా ప్రారంభమైంది. ఇంటర్నెట్‌లో ఆ ఫొటోలు ఒక్కసారిగా విపరీతంగా చక్కర్లు కొట్టాయి. అసలు అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఆ ఫొటోలు చూడగానే నాకెంతో సంతోషంగా అనిపించింది. వీరిద్దరి మధ్య గొడవలున్నాయంటూ చాలామంది అనుకుంటున్న తరుణంలో ఈ ఏడాది ప్రేమాభిమానుల మధ్య ప్రారంభం కావడం బాగుంది.
వారాంతాల్లో వాళ్లు మా ఇంటికి, మేము వాళ్లింటికి వెళ్తుండేవాళ్లం. నాన్న, చిరు అంకుల్‌ ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించడం.. అలాగే ఆ షూటింగ్‌లో ఎక్కువగా ఊటీలో చిత్రీకరించడం వల్ల మా రెండు కుటుంబాలు వేసవి సెలవులను అక్కడే ఎంజాయ్‌ చేసేవాళ్లం. ఒకవేళ వాళ్ల మధ్య తగాదాలు, గొడవలు ఉండి ఉంటే కలిసి అన్ని సినిమాల్లో నటించేవాళ్లు కాదు. నాకు తెలిసి వాళ్లిద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉండేది. కాబట్టి సినీ ప్రియులు కూడా ప్రతి ఒక్కరినీ అభిమానించండి. గొడవలు పడకండి’ అని మంచులక్ష్మి పేర్కొన్నారు.