Sports

ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీస్‌కు భారత్

Indian Team Gets Into Semi-Finals Of Asia Badminton Tournament

ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ ఛాంపియన్స్‌షిప్‌లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్‌ఫైనల్లో థాయ్‌లాండ్‌పై భారత్‌ 3-2తో విజయం సాధించి కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. తొలి సింగిల్స్‌లో సాయి ప్రణీత్‌ (14-21, 21-14, 12-21), రెండో సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ (20-22, 14-21) వరుసగా పరాజయం పాలవ్వడంతో తొలుత భారత్‌ 0-2తో వెనుకబడింది. అయితే భారత్‌ తర్వాత పుంజుకొని వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించి సెమీస్‌కు చేరింది. మూడో మ్యాచ్‌గా జరిగిన డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల-ఎంఆర్‌ అర్జున్‌ జోడీ (21-18, 22-20), నాలుగో మ్యాచ్‌గా జరిగిన సింగిల్స్‌లో లక్ష్య సేన్‌ (21-19, 21-18) చెలరేగి స్కోరును 2-2తో సమం చేశారు. ఇక నిర్ణయాత్మక అయిదో మ్యాచ్‌లో చిరాగ్‌ శెట్టి – కిదాంబి శ్రీకాంత్‌ ద్వయం 21-15, 16-21, 21-15 తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించి భారత్‌కు విజయాన్ని అందించింది. నేడు జరిగే సెమీస్‌లో ఇండోనేషియాతో భారత్‌ ఆడనుంది. 2016 ఆసియా ఛాంపియన్‌షిప్‌ ఇరు జట్లు సెమీస్‌లోనే తలపడగా భారత్‌పై ఇండోనేషియా పైచేయి సాధించింది.