Business

కేరళలో లీటర్ నీరు ధర ₹13

Kerala Bars Liter Water Price At 13 Rupees

కార్పొరేట్ కంపెనీలు అడ్డగోలుగా సాగిస్తున్న నీటి వ్యాపారానికి అడ్డుకట్ట వేస్తూ కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లీటర్ వాటర్ బాటిల్‌ గరిష్ఠ ధరను రూ.13గా నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బాటిల్స్‌లో నీటిని విక్రయిస్తున్న ప్రముఖ కార్పొరేట్ సంస్థలకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టంచేసింది. బాటిల్స్ విక్రయించే నీటిని ‘నిత్యవసర వస్తువుల’ జాబితాలో చేర్చుతూ…ఈ ఆదేశాలు జారీ చేసింది. లీటర్ వాటిల్ బాటిల్‌ను రూ.13లకు మించి విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పి.తిలోత్తమన్ ప్రైవేటు ఉత్పత్తిదారులను హెచ్చరించారు. వాటర్ బాటిల్ లీటరు గరిష్ఠ ధరను రూ.13లుగా నిర్ణయించే ఆదేశాలపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతకం చేసిన తర్వాత మంత్రి ప్రకటన చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఈ గరిష్ఠ ధర వర్తిస్తుందని, ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టంచేశారు. ఇప్పటి వరకు లీటర్ వాటర్ బాటిల్స్ ధర రూ.20గా ఉండగా…ఇక రూ.7లు తక్కువగా రూ .13కే విక్రయించాల్సి ఉంటుంది.

అదే సమయంలో బాటిల్స్‌లో విక్రయించే నీటి నాణ్యతా ప్రమాణాల విషయంలోనే కఠినంగా వ్యవహరించబోతున్నట్లు కేరళ ప్రభుత్వం స్పష్టంచేసింది. చట్టవిరుద్ధంగా నీటి విక్రయం చేపట్టేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బాటిల్స్‌లో తాగునీరు ఉత్పత్తి చేసే వారు బీఐఎస్ నీటి నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.

ప్రైవేటు కంపెనీలు లీటరు వాటర్ బాటిల్ గరిష్ఠ ధరను రూ.15గా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని కోరాయి. ప్రస్తుతం లీటరు వాటర్ బాటిల్ ఉత్పత్తికి ప్రైవేటు కంపెనీలు రూ.6లు ఖర్చు చేస్తుండగా…వాటి రవాణా కోసం అదనంగా రూ.2లు వెచ్చిస్తున్నాయి. ఈ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని లీటర్ వాటర్ బాటిల్ గరిష్ఠ ధరను రూ.13గా నిర్ణయిస్తూ ఆదేశాలిచ్చామని మంత్రి వివరించారు. కేరళ వాటర్ అథారిటీ ఇప్పటికే లీటరు వాటర్ బాటిల్‌ను రూ.10కే విక్రయిస్తోందని గుర్తుచేశారు.

కేరళలో దాదాపు 300 బ్రాండ్స్ బాటిల్స్‌లో తాగునీటిని విక్రయిస్తున్నాయి. కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కొన్ని ప్రైవేటు కంపెనీలు అసంతృప్తితో ఉన్నాయి. రూ.13లకు లీటర్ వాటర్ బాటిల్ ధరను విక్రయిస్తే తమకు నష్టాలు వస్తాయని వాపోతున్నాయి. కేరళ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కేరళ ప్రభుత్వ నిర్ణయంపై అక్కడి ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఆదేశాలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మరి తెలుగు రాష్ట్రాలు కూడా ఈ విషయంలో కేరళను ఆదర్శంగా తీసుకుని ప్రైవేటు కంపెనీల అడ్డగోలు నీటి వ్యాపారానికి అడ్డుకట్ట వేస్తాయేమో వేచి చూడాల్సిందే.