Health

40ఏళ్ల కిందటి నవలలో కొరోనా ప్రస్తావన

Coronavirus Cited In 40Years Old Novel Under The Name Wuhan-400

చైనాలో కొవిడ్‌-19 (కరోనా వైరస్‌) కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 1700 మంది మరణించారు. వుహాన్‌లో వెలుగు చూసిన వైరస్‌ ఇప్పుడు దాదాపు 25 దేశాల్లో విస్తరించింది. అయితే, ఈ వైరస్‌ను 40 ఏళ్ల ముందే ఊహించారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అమెరికాకు చెందిన రచయిత డీన్‌ కూంట్జ్‌ రచించిన ఐస్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌ నవలలో ఈ వైరస్‌ ప్రస్తావన ఉంది. అయితే, కరోనా అని కాకుండా వుహాన్‌-400 అని అందులో పేర్కొన్నారు. ఓ లేబోరేటరీలో తయారైన ఓ జీవరసాయన ఆయుధంగా రచయిత తన కాల్పనిక (ఫిక్షన్‌) నవల్లో పేర్కొన్నారు. ఓ నెటిజన్‌ దీన్ని ట్విటర్‌లో పెట్టడంతో వైరల్‌గా మారింది. అయితే, ఈ నవలలోని వైరస్‌ అత్యంత తీవ్రమైనదిగా అభివర్ణించారు. దీని కారణంగా వంద శాతం మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. కరోనా ఆ స్థాయి ప్రమాదకారి కాదు. అంతేకాదు ఈ పుస్తకం తొలి విడత ఎడిషన్లలో వుహాన్‌-400 స్థానంలో, గోర్ఖి-400 అని ఉంది. వుహాన్‌ ప్రస్తావన ఉండడంపై కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. మరికొందరు కాకతాళీయమని కొట్టిపారేస్తున్నారు.