Politics

గిరిజన రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ధర్నా

TPCC Protests For Tribal Reservations

ఎన్నికలు ఉన్నా లేకున్నా సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఓట్లు, రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్‌ పార్టీ పోరాడటం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్ల అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సముచిత న్యాయం జరగాలన్నారు. గిరిజనులు, ముస్లిం రిజర్వేషన్లపై తెరాస ఎంపీలు ఒక్కసారి కూడా పార్లమెంట్‌లో మాట్లాడిన దాఖలాలు లేవని ఉత్తమ్‌ ఆరోపించారు. ఎన్టీఆర్‌ హయాంలో గిరిజనుల రిజర్వేషన్లు 5శాతం నుంచి 6 శాతానికి పెంచినపుడు ఎలాంటి కమిషన్‌ వేయలేదని.. కేవలం జీవో ద్వారా జనాభా ప్రాతిపదికన దాన్ని అమలు చేశారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో జనాభా ప్రాతిపదికన గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. దళితుడైన దామోదరం సంజీవయ్యను సీఎంను చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదని చెప్పారు. తెలంగాణలో అతిపెద్దదైన మాదిగ సామాజికవర్గం నుంచి ఒక్కరికి కూడా కేసీఆర్‌ మంత్రి పదవి ఇవ్వలేదని ఉత్తమ్‌ విమర్శించారు. దీన్ని యావత్‌ తెలంగాణ సమాజం ఖండించాలన్నారు.