పాక్కు కర్మసిద్ధాంతం అంటే ఏమిటో తెలిసొస్తోంది. తాను చేసిన పాపాలు కొన్నింతలై ఆ దేశాన్నే మింగేస్తున్నాయి. ఇప్పుడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దివాళా అంచుల్లో ఊగిసలాడుతోంది. పాక్లో ఒక్కో వ్యక్తిపై ఉన్న తలసరి అప్పు 1,53,689 పాకిస్థానీ రూపాయలకు చేరినట్లు కొన్నాళ్ల కిందట పాక్ ఫైనాన్షియల్ పాలసీ స్టేట్మెంట్లో ఈ విషయాలు బయటకు వచ్చాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 28 శాతం పెరిగింది. ఇమ్రాన్ఖాన్ చేతికందిన చోటల్లా అప్పులు చేయడంతో ఈ పరిస్థితి దాపురించింది. అసలు అప్పులు చేయడంలో ఇమ్రాన్ ఏకంగా రికార్డు సృష్టించారు. ఏడాది వ్యవధిలో ఏడున్నర లక్షల కోట్లు అప్పులు తెచ్చి చరిత్ర సృష్టించారు. దేశ రుణభారం మొత్తం రూ.32.7లక్షల కోట్లకు చేరింది. ఇది అంతకు ముందు ఏడాది కేవలం రూ.24.9లక్షల కోట్లు మాత్రమే. వీటిల్లో అత్యధిక రుణాలు చైనా నుంచి తెచ్చినవే ఉన్నాయి. మరోపక్క చైనా అప్పుతో నిర్మించిన చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ అనుకున్నంత ఆదాయం సృష్టించలేకపోతోంది. ఈ మార్గంలో వచ్చే వాహనాలను చివరి వరకు భద్రత కల్పించాల్సి రావడం చైనాకు తలనొప్పిగా మారింది. ఇలాంటి దశలో పాక్పై ఎఫ్ఏటీఎఫ్ ఆంక్షలు మూలిగేనక్కపై తాటిపండు చందంగా మారాయి. ఇప్పటికే గ్రేలిస్ట్లో ఉన్న పాక్ బ్లాక్ లిస్ట్లో పడకుండా.. అవకాశం ఉంటే గ్రే లిస్ట్ నుంచి కూడా బయటపడేలా విశ్వప్రయత్నాలు చేస్తోంది. నిన్నటి నుంచి పారిస్లో మొదలైన ఎఫ్ఏటీఎఫ్ సమావేశాలు పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.
ఈ సారి ఎఫ్ఏటీఎఫ్ ఛైర్మన్గిరీ చైనాకు దక్కింది. చైనాలో పీపుల్స్ బ్యాంక్ ప్రెసిడెంట్ షియంగ్ మిన్లూ దీనికి అధ్యక్షత వహిన్నారు. దీంతో పాక్ను బయటపడేసేందుకు చైనా పూర్తిస్థాయిలో కృషి చేస్తుందనడంలో సందేహం లేదు. దీంతోపాటు పశ్చిమ దేశాల మద్దతు కూడా పాక్కు లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మలేషియాలో నిర్వహించిన ఓఐసీ భేటీకి పాక్ హాజరు కాకుండా సౌదీ ఒత్తిడి చేసింది. దీంతో పాక్ వెళ్లలేదు. దానికి ప్రతిఫలంగా సౌదీ ఎఫ్ఏటీఎఫ్లో పాక్కు అనుకూలంగా ఓటింగ్ చేసే అవకాశం ఉంది. ఇక అమెరికా ఓటు ఎటు పడుతుందనే అంశం ఆధారంగానే పాక్ భవిత ఆధారపడి ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అఫ్గానిస్థాన్లో దళాల ఉపసంహరణ కోసం డొనాల్డ్ ట్రంప్పై ఒత్తిడి పెరుగుతోంది. ఇక్కడ అమెరికా పరవు దక్కించుకొని బయటపడాలంటే పాక్ మద్దతు ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో క్విడ్ప్రోకో కింద పాక్కు అమెరికా మద్దతు లభించే అవకాశం ఉంది. ఒక వేళ ఇది సాధ్యం కాకపోయినా.. బ్లాక్ లిస్ట్లో పడకుండా సాయం చేయవచ్చు. ఇటీవల భాజపా నాయకుడు సుబ్రమణ్యస్వామి కూడా ఇదే విషయంపై మన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ట్వీట్ కూడా చేశారు. ‘చైనా, అమెరికాలు ఎఫ్ఏటీఎఫ్ గ్రేలిస్ట్ నుంచి బయటపడేస్తామని పాక్కు హామీ ఇచ్చాయి. బ్లాక్లిస్ట్లో అప్గ్రేడ్ చేయడానికి బదులు ఇటువంటి హామీ ఇచ్చాయి. ఇది నిజమైతే భారత్కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లే. అంతర్జాతీయంగా భారత్కు దౌత్యశక్తి తగ్గడంపై ప్రధాని సమీక్షించుకోవాలి’’ అని స్వామి ట్వట్ చేశారు. మరోపక్క ఎఫ్ఏటీఎఫ్ వ్యవహరాలు చూసే భారత అధికారులు కూడా అమెరికా, ఐరోపాలోని కొన్ని దేశాల మద్దతుతో పాక్ గ్రేలిస్ట్ నుంచి బయటపడే అవకాశం ఉందని ఒక ఆంగ్ల పత్రికకు వెల్లడించారు.