Agriculture

ఆటోనగర్‌లో అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయం ప్రారంభం

Amaravati Parirakshana Samiti Office Opened At Autonagar

అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయాన్ని విజయవాడలోని ఆటోనగర్‌లో ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు చేతుల మీదుగా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, సీపీఐ నేత రామకృష్ణ, జనసేన నేత బత్తిన రాము తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ… ‘‘అమరావతి కేవలం రాజధాని గ్రామాల సమస్య కాదు, 5 కోట్ల ఆంధ్రుల సమస్య. రాష్ట్రంలో అభివృద్ధి లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేతగాని నిర్ణయాలు తీసుకుంటోంది. కొన్ని కుటుంబాలు, వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసమే మూడు రాజధానుల ప్రస్తావన. ఇది జాతీయ సమస్యగా పరిణమించబోతోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేయాలి. విజయవాడ ఉద్యమాలకు కేంద్రం. నూటికి నూరుశాతం విజయం సాధించి తీరుతాం’’ అని స్పష్టం చేశారు. ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. పోలీసులపైకి నెపం నెట్టి అమరావతి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారు, కేసుల పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, ఇలాంటి దుర్మార్గ పాలన ఎన్నడూ చూడలేదన్నారు. ‘‘రాజధాని అంశం కేంద్రం పరిధిలో లేదని భాజపా ఎంపీ జీవీఎల్‌ చెబుతున్నారు. ఇందులో రాష్ట్రానికి ఎంత సంబంధం ఉందో… కేంద్రానికి కూడా అంతే బాధ్యత ఉంది. రాజధానిపై జీవీఎల్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలి’’ అని కేశినేని కోరారు. అమరావతి పరిరక్షణ సమితి ఐకాస అధ్యక్షుడు శివారెడ్డి మాట్లాడుతూ…రెండు నెలలుగా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశారని విమర్శించారు. నిరసన తెలిపే వారిని గూండాలుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.