Politics

జగన్‌కు టాలీవుడ్ ఆహ్వానం

YS Jagan Gets Invited By Tollywood Producers

తుపాను బాధితుల కోసం నిర్మించిన ఇళ్లను ప్రారంభించాలని కోరుతూ పలువురు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ను బుధవారం కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. హుద్‌హుద్‌ తుపానులో ఇల్లు కోల్పోయిన వారికోసం సినీ తెలుగు సినీ పరిశ్రమ రెండు రోజుల పాటు అన్ని కార్యకలాపాలు నిలిపివేసి విరాళాలు సేకరించిందన్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు టెలీథాన్‌ పేరుతో నిర్వహించిన కార్యక్రమం ద్వారా వచ్చిన రూ.15 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టామన్నారు. విశాఖపట్నంలోని బక్కన్నపాలెంలోని మధురవాడ దగ్గర 320 సింగిల్‌ బెడ్‌రూం ఇళ్లు సకల సౌకర్యాలతో నిర్మించామని తెలిపారు. ఆ ఇళ్లను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించాలని జగన్‌ను కోరామన్నారు. సానుకూలంగా స్పందించిన సీఎం త్వరలోనే ఇళ్లను ప్రారంభించి బాధితులకు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, సురేశ్‌ ప్రొడక్షన్స్‌ అధినేత సురేశ్‌బాబు, శ్యాంప్రసాద్‌ రెడ్డి, జెమిని కిరణ్ తదితరులు ఉన్నారు.