Business

మధ్యప్రదేశ్ మహిళల కోసం ప్రత్యేక మద్యశాలలు

Madhyapradesh Govt To Open Special Liquor Stores For Women

*కొత్తగా తీసుకొస్తున్న మధ్యప్రదేశ్‌ సర్కారు ఫస్ట్‌ భోపాల్‌, ఇండోర్‌, జబల్ పూర్‌, గ్వాలియర్‌లో..
మధ్య ప్రదేశ్‌లో ఆడోళ్ల కోసం ప్రత్యేకంగా వైన్స్‌ షాపులు రానున్నాయి. లేడీస్‌‌కు ఇబ్బంది లేకుండా మందు కొనుక్కోవడానికి అక్కడి కమల్ నాథ్‌ సర్కారు ఈ కొత్త ఆలోచన చేసింది. తొలుత మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌, ఇండోర్‌లలో రెండేసి చొప్పున షాపులు.. జబల్ పూర్‌, గ్వాలియర్‌లలో ఒక్కో షాపును స్టార్ట్‌ చేయనున్నారు. మహిళలు ఎక్కువగా ఇష్టపడే విస్కీ, వైన్‌ బ్రాండ్లనే అక్కడ అమ్మనున్నారు. అందులోనూ ఫారిన్ బ్రాండ్లనే అమ్మకానికి పెట్టనున్నారు. అంటే రాష్ట్రంలో రిజిస్టర్‌ కాని బ్రాండ్లను కూడా ఈ షాపుల్లో కొనొచ్చన్నమాట. ట్యాక్స్‌ కట్టాకే ఈ ఫారిన్‌ లిక్కర్‌ను అనుమతిస్తారు కాబట్టి మళ్లీ అదనపు పన్ను వసూలేం చేయబోమని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో ఎక్కడా దొరకని ఫారిన్‌ బ్రాండ్లను ఇక్కడ అమ్ముతారని కమర్షియల్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీ ఐసీపీ కేశ్రీ చెప్పారు. ఆడవాళ్లు ఈజీగా లిక్కర్‌ కొనుక్కునేలా మాల్స్‌, మార్కెట్ ప్లేస్‌లో షాప్‌లను తెరుస్తామన్నారు.
*త్వరలో వైన్‌ ఫెస్టివల్‌
రాష్ట్రంలో తయారుచేసే లోకల్‌ బ్రాండ్స్‌ను ప్రమోట్ చేసేందుకు భోపాల్, ఇండోర్, జబల్ పూర్, గ్వాలియర్‌లో వైన్ ఫెస్టివల్స్‌ నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. పండుగను ఎప్పుడు, ఎన్ని రోజులు జరుపుతారో ఏప్రిల్‌లో నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో రత్మాల్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో తయారు చేసే ద్రాక్షపళ్ల మద్యాన్ని ప్రమోట్ చేసేందుకు 15 టూరిస్ట్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా దుకాణాలు తెరవనున్నట్టు కూడా అధికారులు వెల్లడించారు.
*ఏప్రిల్‌ 1 నుంచి కొత్త మందు పాలసీ
మధ్యప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో ధరలు సుమారు 15% మేర పెరగనున్నాయి. ఎక్సైజ్‌ ద్వారా ఈ ఏడాది 2 వేల కోట్ల అదనపు ఆదాయం రాబట్టాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. దేశంలో కర్నాటక తర్వాత మద్యం ధరలు ఎక్కువున్న రాష్ట్రం మధ్యప్రదేశ్‌.