Movies

ప్లీజ్…ఆ పని చేయకండి

Malaika Arora Requests Not To Do That

బాలీవుడ్‌ చిత్రం దిల్‌సే లో హీరో షారుక్‌ఖాన్‌తో కలిసి మలైకా అరోరా ఛైయ.. ఛైయ.. అంటూ రైల్లో వేసిన స్టెప్పులు గుర్తున్నాయా..? అప్పట్లో యువతను ఉర్రూతలూగించిన పాట అది. అయితే, ఆ పాటను రీమిక్స్‌ చేయనున్నట్లు వస్తున్న వార్తలపై మలైకా అరోరా స్పందించింది. పాట చిత్రీకరించినప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ఆమె.. అలాంటి మంచి పాటలను రీమిక్స్‌ చేసి వాటి ఒరిజినాలిటీని దెబ్బతీయవద్దంటోంది.‘బాలీవుడ్‌లో దాదాపు ఒక పది ఉత్తమ పాటలు ఉన్నాయి. అలాంటి పాటలను రీమిక్స్‌ చేయకుండా ఉంటే మంచిది. అందులో ఛైయ.. ఛైయ.. పాట కూడా ఒకటి. నీలగిరి పర్వతాల్లోని ఊటిలోని మధ్య నడుస్తున్న రైలు మీద ఆ పాట చిత్రీకరణ జరిగింది. ఆ సమయంలో డ్యాన్స్‌ విషయంలో గీతా కపూర్‌ నాకు ఎంతో సహాయపడ్డారు. షూటింగ్‌ను బాగా ఎంజాయ్‌ చేశాం. రీమిక్స్‌ చేసిన పాటలు కూడా బాగా వస్తాయి. కానీ, గాడ్‌ ఫాదర్‌, మదర్‌ ఇండియా వంటి సినిమాల్లోని పాటలు రీమిక్స్‌ చేయకపోవడం మంచిది. ’ అని ఆమె పేర్కొంది.షారుక్‌ఖాన్‌, ప్రీతి జింటా, మనీషా కొయిరాల కలిసి నటించిన దిల్‌సే చిత్రానికి మణిరత్నం డైరెక్టర్‌. మణిరత్నం, రామ్‌గోపాల్‌ వర్మ, శేఖర్‌కపూర్‌ సంయుక్తంగా నిర్మించారు. ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం అందించారు. 1998లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో మంచి హిట్‌ సాధించింది. మలైకా అరోరాను ఈ పాట కోసం ప్రత్యేకంగా తీసుకున్నారు.