Business

లగ్జెంబర్గ్‌లో ఉచిత రవాణా

Free Transportation For Public In Luxemburg

ఐరోపా ఖండంలోని అతిచిన్న దేశమైన లగ్జెంబర్గ్‌.. వాయు కాలుష్యం, ట్రాఫిక్‌ జామ్‌లను అరికట్టేందుకు పెద్ద నిర్ణయం తీసుకుంది. ప్రజలందరికీ ఉచిత రవాణా సౌకర్యం అందించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 29 నుంచి దీన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు ఆ దేశ రవాణా మంత్రి వెల్లడించారు. ప్రపంచంలోనే ఇలాంటి సౌకర్యం కల్పిస్తున్న తొలి దేశం లగ్జెంబర్గే కావడం విశేషం. ఈ నిర్ణయం వల్ల ప్రతి వ్యక్తికి ఏటా దాదాపు 100 యూరోలు ఆదా అవుతుందట. అయితే ఈ ఉచిత ప్రజా రవాణా వ్యవస్థలో కొన్ని సేవలను మినహాయించారు. రైళ్లలో ఫస్ట్‌ క్లాస్‌ ప్రయాణం, రాత్రి వేళల్లో బస్సు సర్వీసులకు ఈ ‘ఉచితం’ వర్తించదు. లగ్జెంబర్గ్‌.. బెల్జియం, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాల మధ్య ఉంటుంది. ఈ మూడు దేశాల నుంచి ప్రతి రోజూ దాదాపు 2 లక్షల మంది ఉద్యోగాలు, ఇతర పనుల నిమిత్తం లగ్జెంబర్గ్‌కు వస్తుంటారు. అంతేగాక.. ఇక్కడ ప్రజా రవాణాను ఉపయోగించేవారు చాలా తక్కువట. 2018లో చేపట్టిన ఓ సర్వే ప్రకారం.. దేశవ్యాప్తంగా 32శాతం మంది బస్సుల్లో, 19శాతం మంది మాత్రమే రైళ్లలో ప్రయాణిస్తున్నట్లు తేలింది. మిగతా వారంతా తమ ప్రయాణాలకు కార్లు, సొంత వాహనాలనే వినియోగిస్తున్నారు. దీంతో కాలుష్య స్థాయిలు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో లగ్జెంబర్గ్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టికెట్‌ ఖర్చు లేకపోతే ప్రజలంతా ప్రజా రవాణాను ఉపయోగిస్తారని అక్కడి అధికారులు భావించి ఈ ఉచిత రవాణాను అందుబాటులోకి తెచ్చారు.