DailyDose

Yes బ్యాంకు ATMల వద్ద భారీ రద్దీ-వాణిజ్యం

Huge rush at Yes bank ATMs-Telugu Business News Roundup Today

* ఫేస్ మాస్కులు, హ్యండ్ సానిటైజర్లు బ్లాక్ మార్కెట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రసాయన, ఔషధాల శాఖ మంత్రి  డి.వి.సదానంద గౌడ అన్నారు.శనివారం మీడియాతో మాట్లాడుతూ ‘‘ప్రస్తుతానికి దేశంలో ఫేస్ మాస్కులు, హ్యండ్ సానిటైజర్ల కొరత లేదు.కానీ వీటి లభ్యతపై మా అధికారులు నిరంతర నిఘా చేస్తున్నారు.అలాగే ధరల పెంచి విక్రయించే వారిపై కూడా కఠిన చర్యలు ఉంటాయి.కరోనా వైరస్ పేరుతో కొందరు కృత్రిమ సృష్టించి, ఉన్న స్టాకు అధిక ధరలకు విక్రయించే అవకాశం ఉంది. అలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరిస్తున్నాం.మరో మూడు నెలలకు సరిపడా మందులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి’’ అని అన్నారు.

* టీవీ వీక్షకులకు శుభవార్త.మార్చి 1 నుంచే ట్రాయ్ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.ఈ నిబంధనల ప్రకారం..రూ.130 కే 200 ఉచిత ఛానళ్లు అందుబాటులో వచ్చాయి.రూ.160 కే అపరిమిత ఉచిత ఛానళ్లు వీక్షించవచ్చు. 26 డీడీ ఛానళ్లు వీటికి అదనం.వీక్షకులకు నచ్చిన ఛానల్‌ను అడిగి మరీ పెట్టించుకోవచ్చు, నచ్చిన ఛానళ్లను మాత్రమే చూడవచ్చు.ఈ నిబంధనల ప్రకారం..వినియోగదారుడు ఎంచుకున్న ఛానళ్లన్నింటినీ ఎంఎస్‌వోలు, లోకల్ కేబుల్ ఆపరేటర్లు ఇవ్వాల్సిందే. సవరించిన ధరలను డీపీవో వెబ్‌సైట్లో ఉంచాల్సిందే.వీక్షకులు అడిగిన ఛానళ్లను ఇవ్వకపోతే ట్రాయ్‌కు నేరుగా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించారు.ట్రాయ్ కంప్లైంట్ నంబర్లు 011-23664381, 011-23664545, 011-23220018

* యెస్‌ బ్యాంకు ఖాతాదారుల సొమ్ముకు ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ డిపాజిటర్లలో ఆందోళన తగ్గడంలేదు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న యెస్‌ బ్యాంకుపై ఆర్బీఐ(రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా) మారటోరియం ప్రకటించింది. అప్పటి నుంచి తమ నగదు ఉపసంహరించుకునేందుకు ఏటీఎం కేంద్రాల ముందు ఖాతాదారులు భారీగా క్యూ కడుతున్నారు. దీంతో ఏటీఎం కేంద్రాలన్నీ నిండుకున్నాయి. చాలా మంది ఖాతాదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు కూడా నిలిచిపోయాయి. కాగా.. బ్యాంకు శాఖల్లో మాత్రం చాలా మంది ఖాతాదారులు ఆర్బీఐ విధించిన పరిమితి మేరకు రూ.50వేలు ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ఏటీఎం కేంద్రాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. బ్యాంకుల్లో ఇబ్బందుల్లేకుండా నగదు ఉపసంహరించుకుంటున్నట్లు తెలుస్తోంది.

* తెలంగాణ జలమండలిలో మేనేజర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇంజినీరింగ్‌ విభాగాల్లో మొత్తం 93 మేనేజర్‌ ఉద్యోగాలకు శనివారం టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఈసీఈ, ఐటీ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నట్టు టీఎస్‌పీఎస్సీ ప్రకటనలో స్పష్టంచేసింది. ఈ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 16 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.