Politics

టీపీసీసీ అధ్యక్ష పీఠం కోసం కోమటిరెడ్డిvsరేవంత్‌రెడ్డి

Komatireddy meets sonia gandhi for tpcc president post

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) చీఫ్ నియామకంపై కదలిక వచ్చింది. వారం పది రోజుల్లో కొత్త ప్రెసిడెంట్ ను నియమించే అవకాశం కనిపిస్తోంది. మధ్యప్రదేశ్లో తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కర్నాటక, ఢిల్లీ పీసీసీలకు కొత్త చీఫ్ లను ఏఐసీసీ బుధవారం నియమించింది. ఇటీవలే ఏపీసీసీ అధ్యక్షుడిగా శైలజానాథ్‌‌‌‌ను నియమించింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ నియామకం కూడా త్వరలోనే ఉంటుందని ప్రచారం సాగుతోంది. ప్రస్తుత ప్రెసిడెంట్ ఉత్తమ్కుమార్ రెడ్డి బాధ్యతల నుంచి తనను తప్పించాలని గతంలోనే హైకమాండ్ ను కోరారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ పోస్టు భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. రాష్ట్ర ముఖ్యనేతల అభిప్రాయం మేరకు కొత్త చీఫ్ను ఎంపిక చేసేలా ఏఐసీసీ కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్ర నేతల అభిప్రాయాలు సేకరిస్తూ.. పీసీసీ పోస్టు ఆశిస్తున్న వారిని పిలిచి మాట్లాడుతోంది. ఈ ప్రక్రియలో భాగంగానే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గురువారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్సోనియాగాంధీని కలిశారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఈ సందర్భంగా చర్చించారు. పీసీసీ చీఫ్గా చాన్స్ ఇవ్వాలని సోనియాను వెంకట్ రెడ్డి కోరినట్లు తెలిసింది.
**రేస్లో ముందున్న కోమటిరెడ్డి
ప్రస్తుతం ఏఐసీసీ.. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రేవంత్రెడ్డి పేర్లను పరిశీలిస్తోంది. ప్రపోజల్స్ లో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ముందున్నారు. కాంగ్రెస్లో మొదటి నుంచి కీలకంగా ఉండడం ఆయనకు అనుకూలంగా ఉంది. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలవడంతోపాటు మంత్రిగా పని చేయడం అనుకూలిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన నేతగానూ గుర్తింపు ఉంది. అయితే వెంకట్రెడ్డికి చాన్స్ విషయంలో సీనియర్ నేతల అభిప్రాయాలు కీలకం అవుతున్నాయని.. ఇది అడ్డంకిగా మారుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ వర్కింగ్ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి చీఫ్ పోస్టు రేసులో ఉన్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ను ఎదుర్కొనే విషయంలో గట్టి నేతగా రేవంత్కు ఏఐసీసీలో, పార్టీ కేడర్లో గుర్తింపు ఉంది. అయితే ఏకపక్షంగా కార్యక్రమాలు నిర్వహించడం, మిగిలిన వారితో సమన్వయం లేకపోవడం ప్రతికూలంగా మారుతున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కొత్త చీఫ్పై వారం పదిరోజుల్లో ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
**మొదటి నుంచి ఉన్న వారికే ఇవ్వాలి
మున్సిపోల్స్ తర్వాత టీపీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకుంటానని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వచ్ఛందంగా చెప్పారని, ఇకనైనా ఆ పదవి నుంచి ఆయనను తొలగించాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. సోనియాతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి.. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికే పీసీసీ ఇవ్వాలని సోనియాను కోరానని చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులను ఆమెకు వివరించినట్లు చెప్పారు. ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్, ఇతర అంశాలు చర్చకు రాలేదన్నారు.