ScienceAndTech

అమెరికా నుండి శుభవార్త

FDA Approves Abbott Labs Corona Test

కరోనా వైరస్‌ మహమ్మారి మెడలు వంచేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనా సంస్థలు నిమగ్నమయ్యాయి. ఇందులో కొన్ని టీకా, ఔషధాల కోసం పనిచేస్తుంటే.. మరికొన్ని వైరస్ ఆనవాళ్లను వేగంగా గుర్తించే ప్రక్రియ ఆవిష్కరణపై దృష్టి సారించాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే ఆయా అంశాల్లో పురోగతి సాధించాయి. తాజాగా అమెరికాకు చెందిన ఓ కంపెనీ కేవలం ఐదు నిమిషాల్లో కరోనా ఉందో.. లేదో.. నిర్ధారించే ప్రక్రియను అభివృద్ధి చేసింది.

అమెరికాకు చెందిన అబోట్ ల్యాబొరేటరీస్ అభివృద్ధి చేసిన ఈ ప్రక్రియకు ఇప్పటికే అత్యవసర ప్రక్రియ కింద అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతించింది. అయితే ఈ ప్రక్రియకు పూర్తి స్థాయి అమోదం మాత్రం లభించలేదని సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి గుర్తింపు పొందిన ల్యాబ్‌లలో అత్యవసర ప్రాతిపదిక కింద ఉపయోగిచండానికి అనుమతి లభించినట్లు పేర్కొంది. వచ్చే వారం నుంచి వీటిని ఉపయోగంలోకి తెచ్చే దిశగా సన్నాహాలు చేస్తున్నారు. ‘మాలిక్యులాల్‌ పాయింట్‌-ఆఫ్‌-కేర్‌ టెస్ట్‌’గా పిలిచే ఈ ప్రక్రియలో కరోనా వైరస్‌ ఉన్న వ్యక్తి ఫలితం కేవలం ఐదు నిమిషాల్లోనే వచ్చేస్తుందని సంస్థ పేర్కొంది. ఇక నెగిటివ్‌ ఉన్నవారి ఫలితం రావడానికి 13 నిమిషాలు పడుతున్నట్లు వెల్లడించింది.

కరోనా వైరస్‌ను జయించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఆ దిశగా అబోట్‌ లేబోరేటరీస్‌ సైతం కృషి చేస్తోందని సంస్థ ఛైర్మన్‌ రాబర్ట్‌ ఫోర్డ్‌ తెలిపారు. అతి తక్కువ సమయంలో ఈ వైరస్‌ను గుర్తించడానికి ఇది గొప్ప అవకాశం అని అభిప్రాయపడ్డారు. ఈ పరీక్షలో ఉపయోగించే పరికరం చిన్న పరిమాణంలో ఉండడం వల్ల దీన్ని ఎక్కడైనా వినియోగించొచ్చని తెలిపారు. ఆస్పత్రులు, క్లినిక్‌లు, లేబోరేటరీలలోనే కాకుండా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకూ వీటిని తీసుకెళ్లొచ్చని పేర్కొన్నారు.