Movies

తొలితరపు హీరోచితుడు నాగయ్య-TNI కథనం

Special Birthday Story On Chittoor Nagayya Life

నాగయ్య లేదా చిత్తూరు వి నాగయ్య అంటే తెలుగు సినిమా పసితనంలో 
(అంటే  1940 ఆ ప్రాంతాలు) ఉండగా అయినా ‘హీరో’చిత నటుడు. నాగయ్య అంటే హెచ్.ఏం.రెడ్డి, కే.వి.రెడ్డి, బి.ఎన్.రెడ్డి ల త్రివేణీ సంగమం. నాగయ్య అంటే ‘వీళ్ళంతా ఇలాగే ఉండే వారేమో’ అని అనిపించే పోతన, వేమన, త్యాగయ్య, రామదాసులు ఒక్కొక్కరు. అప్పటికింకా తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు అంతగా బయట పడలేదు. లేదంటే తప్పకుండా నాగయ్యే అన్నమయ్య అయ్యే వారు. పోతనగా గుమ్మడి గారు నటించినా నాగయ్య గారితో పోలిస్తే తను శూన్యం అనుకున్న రోజులూ ఉండేవి. 
?????
నాగయ్యకి తెలుగు వారే కాదు సోదర తమిళులూ అభిమానులే. ఆయన పాట అందరినీ ఆకర్షించేది.
☘☘☘☘
1970 ల నాటికి నాగయ్య గారంటే ‘వణుకు’ వారిగా అపహాస్యం చేస్తూ ఆయన నటనని ఎందరో పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని నిజాలు తెలిసాకనే కొందరి పట్ల అభిమానం హెచ్చవుతుంది. నాగయ్య గారే దక్షిణాదికి తొలి ‘పద్మశ్రీ’ గ్రహీత అని, నాగయ్య సత్యాగ్రహ ఆందోళనలో ప్రధాన పాత్రధారి అనీ, నాగయ్య గొప్ప దాత అనీ తెలిసాక వెనక్కి వెళ్లగా వెళ్లగా పాత సినిమాలు చూడగా చూడగా అప్పుడనిపించేది- మసి బొగ్గులు చూస్తూ మణిపూసలనెందుకు చేజార్చుకుంటామో అనీ.  భక్త రామదాసు విడుదలకి పూర్వం ఆయన పడ్డ ఆర్ధిక ఇబ్బందీ ఇంతా అంతా కాదట. అయినా దైవం మీద భారం మోపేవారట. ఆయన మీద ఉన్న అభిమానం వల్ల ఆ చిత్రానికి అయిదారుగురు స్వర కర్తలు తలా ఒక్కొక్క పాటకి పనిచేశారట.
?????
నాగయ్య గారి భార్య చనిపోతే కూతురు పోయినంతగా బాధపడిపోయారట ఆయన తండ్రి. ఆమె ఎప్పుడూ రామాయణం చదివి వినిపించేదట. సరిగ్గా ఇటువంటి సనివేశాన్ని హాస్య నటుడు పద్మనాభం స్వంత సంస్థ పెట్టి తీసిన ‘దేవత’ చిత్రంలో చూపించేరు. అందులో సావిత్రి రామాయణం చదువుతుంటే మామగారు నాగయ్య వింటూ ఆనందించేవారు. 
?????
అందరికీ ఆయనంటే గౌరవం ఉండేది. ఆయన వెనకేసుకున్నవి మణులూ, మేడలూ కాదు- సంస్కారి, ఉత్తముడు అనే రెండు మంచి మాటలు.
?????
గాయకుడిగా నాగయ్య ఎన్నో పాటలు, పద్యాలు పాడారు. త్యాగరాజ స్వామీ వారి పంచ రత్నం ‘ఎందరో మహానుభావులు’, పోతన కోసం రాసిన ‘పావన గుణ రామా హరే’ ‘కనులు మూసినా పాటే’ లో వినండి.
?????
ఘంటసాల గాయకుడిగా వేసిన తొలి అడుగు ‘స్వర్గ సీమ’లోనే అయితే ఆ ఇంద్ర భవనం నాగయ్య గారి సంగీత పర్యవేక్షణే. అటువంటిది తొలిసారిగా ‘శాంతి నివాసం’ (1960) చిత్రంలో ఘంటసాల నాగయ్య గారికి ‘ప్లే బ్యాక్’ పాడవలసి వస్తే తటపటాయించి పి.బి. శ్రీనివాస్ చేత పాడించారు. మళ్ళీ ‘లవకుశ'(1963) అదే ఇబ్బందిని తెచ్చి పెట్టింది. నాగయ్య గారిని అడిగి ఆయన ఒప్పుకున్నాక ఆయనకి తొలిసారిగా తన కంఠం ఇచ్చారు.’పూల రంగడు'(1967) లో మాత్రం ఏ ఎన్ ఆర్, నాగయ్యలు ఇద్దరూ కొడుకూ, తండ్రిగా వేయడం, వారిద్దరూ ఒకరినొకరు ఎరుగని  జైలు సన్నివేశానికి  తగ్గ పాట కూర్చడం వల్ల ఎంతో మేలు జరిగింది. ఘంటసాల, నాగయ్య ల ద్విగళ గీతం ‘చిల్లర రాళ్ళకు మొక్కుతువుంటే’ మనకి దక్కింది. ‘రాము’ (1968) చిత్రంలో సముద్రంలో కలిసిపోయేందుకు వెళుతున్న ఎన్టీఆర్ ని దూరంలో ఉన్న గుడినుంచి వస్తున్న  పాట వెనక్కి రప్పిస్తుంది. ఆ గుడిలోని పాట పాడుతున్నది నాగయ్య, వారికి గొంతు కలిపింది ఘంటసాల.  నాగయ్యకు నివాళిగా ఈ పాటలు నాలుగయ్య, వీడియోలు ‘కనులు చూసినా పాటే’ లో చూడండి. ఇల్లు,ఆశ్రమం,జైలు,గుడి – ఒక్కొక్క పాటలో మనం చూస్తాం. తండ్రిగా, తాతగా, దివాణం లోని మధ్యవర్తిగా, మంచి వ్యక్తిగా, వాల్మీకిగా ఇన్ని రూపాలు చూపించినా వీసమెత్తు గర్వం లేని నట గాయకుడు నాగయ్య.
????
‘మూగ నోము'( 1969) చిత్రంలో నాగయ్య, జమున బండిలో వెళుతూ ఉన్నప్పుడు వచ్చే నేపధ్య గీతం కూడా విశేషంగా చెప్పాలి. సినిమాలో ఘంటసాల పాడిన వరస, రికార్డుల్లో పి.బి.శ్రీనివాస్, ఘంటసాల విడి విడిగా పాడగా వచ్చాయి. ఆ పాటే ‘ఊరు మారినా ఉనికి మారునా’. 
???????????
గుంటూరు, చిత్తూరు, చెన్నపట్నం- ఇలా ఎన్ని ఊర్లు మారినా నాగయ్య ఉనికి మారలేదు.అలా ఉనికి మారని ఆ దేవునికిపాదాభివందనం.???