Politics

హైదరాబాద్ నుండి చంద్రబాబు సందేశం

Chandrababu Sends COVID19 Message From Hyderabad

కరోనా వైరస్‌ భయంకరంగా వ్యాపిస్తోందని, ఏపీలో ఇవాళ ఒక్కరోజే 17 కేసులు నమోదయ్యాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కరోనా నివారణకు ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని, కరోనా విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదని చెప్పారు. కరోనా గురించి అనేకమంది నిపుణులతో చర్చించానని, కరోనా పాజిటివ్‌ వ్యక్తి తాకిన వస్తువును మరొకరు తాకితే వ్యాధి వస్తుందని చెప్పారు. దీనిపై ప్రజల్లో మరింత అవగాహన, చైతన్యం కల్పించాలని కోరారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటే కొంతవరకు కరోనా నుంచి కాపాడుకోవచ్చని చెప్పారు. ప్రతిరోజూ వేడినీటితో ఆవిరిపడితే ఆరోగ్యానికి చాలా మంచిదని సూచించారు. తరచూ వేడి నీరు పుక్కిలించాలన్నారు. నిల్వ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని, ప్రాణాయామం, యోగా, వ్యాయామం, ఎండలో ఉండటం లాంటివి చేయాలని కోరారు. బయటకి వెళ్లి ఇంటికి వచ్చినప్పుడు చేతులు శానిటైజ్‌ చేసుకోవాలన్నారు. సీ-విటమిన్‌ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలన్నారు.

ఇటలీలో వైద్యులు సైతం చనిపోయే పరిస్థితి వచ్చిందని, అందువల్ల రాష్ట్రంలో వైద్యులు, సిబ్బందిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చంద్రబాబు సూచించారు. నిత్యావసరాల కోసం ఒకేసారి అందరూ రోడ్డుపైకి వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయని చెబుతూ.. బియ్యం, పప్పులను వాలంటీర్ల ద్వారా ఇంటికే పంపించాలని కోరారు. పింఛన్లు కూడా ఇళ్ల వద్దకే తీసుకెళ్లి ఇవ్వాలన్నారు. ‘‘ పరిశ్రమలు మూతపడ్డాయి. సేవారంగం దెబ్బతింది. కరోనా భయంతో పౌల్ట్రీ రంగం బాగా దెబ్బతింది. వైద్యపడకల విషయంలో అమెరికా, ఇటలీ లాంటి దేశాలే చేతులెత్తేశాయి. ఒక స్థాయి దాటితే మనదేశంలోనూ వైద్యం అందించలేం. అందువల్ల ముందుగానే నివారణ చర్యలు చేపట్టడం ఉత్తమం’’ అని చంద్రబాబు వివరించారు.

ప్రతి ఇంటి నుంచి డిజిటల్‌ సోషలైజేషన్‌ జరగాలని లేదంటే.. మన దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. చైనాలోని వూహాన్‌లో 62 రోజుల లాక్‌డౌన్‌ పాటించారని, కనీసం 49 రోజుల లాక్‌డౌన్‌ పాటించాలని నిపుణులు చెబుతున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. వైరస్‌ వ్యాప్తిని, నివారణ చర్యలను స్లైడ్స్‌ ద్వారా వివరించారు. ఇప్పటికే పలు వ్యాధులు ఉన్నవారు కరోనా పట్ల మరింత జాగ్రత్త పడాలని సూచించారు. మరోవైపు పంటలన్నీ పొలాల్లో ఉన్నాయని, రైతులకు నష్టం వాటిల్లకుండా మద్దతు ధరతో ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేయాలని కోరారు. చేపలు, రొయ్యల రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యానపంటలు, అరటి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, మామిడి రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని చంద్రబాబు అన్నారు.