NRI-NRT

ఉక్రెయిన్‌లో ఇరుక్కున్న తెలుగువారు

Telugu People Stuck In Ukraine Due To COVID19

చైనాలో ఉత్పన్నమైన కరోనా వైరస్‌ (కొవిడ్‌ 19) ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 7.8లక్షల మందికి పైగా ఈ వైరస్‌ బారిన పడగా.. వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. భారత్‌లోనూ కొవిడ్‌ రోజురోజుకూ విజృంభిస్తోంది. కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు. దీంతో అన్ని దేశాలు, రాష్ట్రాల నుంచి రవాణా నిలిచిపోయింది. వైరస్‌ విజృంభిస్తున్న కారణంగా ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు చిక్కుకుపోయారు. ఎంబీబీఎస్‌ చదివేందుకు వెళ్లిన సుమారు 1500మంది భారతీయులు భయం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారు. వీరిలో 300 మంది తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. ఉక్రెయిన్‌లో కేసుల సంఖ్య పెరుగుతుండటం.. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు లాక్‌డౌన్‌ కారణంగా సరైన ఆహారం లభించక తీవ్ర అవస్థలు పడుతున్నారు. తామంతా ప్రత్యేకంగా స్వీయ రక్షణలో ఉండేందుకు అనువైన రీతిలో చర్యలు తీసుకోవాలని భారత రాయబార కార్యాలయాన్ని కోరుతున్నారు.