నాజూకు నడుము… చూడగానే కట్టిపడేసే కళ్లు. ప్రత్యేకమైన అందం… అందుకు దీటైన అభినయం. కమర్షియల్ కథానాయిక అనే మాటకి నిలువెత్తు నిదర్శనంగా కనిపించే అందాల తార సిమ్రన్. 1990, 2000 దశకంలో దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు స్టార్ కథానాయికగా ఓ ఊపు ఊపేసిన కథానాయిక ఈమె. తెలుగులో శరత్ దర్శకత్వం వహించిన ‘అబ్బాయిగారి పెళ్లి’ చిత్రంతో పరిచయమైంది. ఆ తరువాత జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్ని కొనసాగించింది. ‘ప్రియా ఓ ప్రియా’, ‘మా నాన్నకి పెళ్లి’, ‘ఆటోడ్రైవర్’, ‘సమర సింహారెడ్డి’, ‘అన్నయ్య’, ‘కలిసుందాంరా’, ‘నువ్వు వస్తావని’, ‘యువరాజు’, ‘మృగరాజు’, ‘నరసింహనాయుడు’, ‘ప్రేమతోరా’… ఇలా విజయవంతమైన పలు చిత్రాల్లో సిమ్రన్ నటించింది. ‘సీతయ్య’, ‘ఒక్క మగాడు’ చిత్రాల్లో సీనియర్ నటుడు హరికృష్ణ సరసన నటించి అందాలు ఒలికించారామె. 2004 వరకు అగ్ర కథానాయికగా కొనసాగిన ఈమె ఆ తరువాత ప్రత్యేక గీతాల్లోనూ సందడి చేసింది. ఏప్రిల్ 4, 1976లో ముంబైలో జన్మించిన సిమ్రన్ అసలు పేరు రిషిభామా. తండ్రి శోక్ నవల్, తల్లి శారద. పంజాబీ కుటుంబానికి చెందిన వీళ్లు ముంబైలో స్థిరపడ్డారు. అక్కడే సిమ్రన్ విద్యాభ్యాసం సాగింది. డిగ్రీ తరువాత మోడలింగ్లోకి ప్రవేశించిన సిమ్రన్ ఆ తరువాత సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఈమె మొదట హిందీలో ‘సన్ హార్జాయె’ అనే చిత్రంలో నటించింది. ‘తేరే మేరే సప్నె’ సినిమాతో హిందీ ప్రేక్షకులకు మరింత చేరువైంది. దక్షిణాదిలో మలయాళ చిత్రం ‘ఇంద్రప్రస్థం’తో ప్రయాణం ప్రారంభించింది. తరువాత తమిళం, తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించింది. తమిళంలో లేడీ సూపర్స్టార్గా ఈమెకి పేరుంది. అక్కడ నటించిన పలు చిత్రాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. తెలుగులో నేరుగా కూడా సినిమాలు చేసి విజయాలు అందుకోవడంతో సిమ్రన్ రెండు భాషల్లోనూ విశేషంగా పేరు సంపాదించింది. 2003లో చిన్ననాటి స్నేహితుడైన దీపక్ని వివాహం చేసుకొంది సిమ్రన్. ఈ జంటకి అదీప్, ఆదిత్ అనే ఇద్దరబ్బాయిలు ఉన్నారు. పెళ్లి తరువాత సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన సిమ్రన్ పలు కీలక అవకాశాల్ని చేజిక్కించుకొంది. 2019లో రజనీకాంత్తో కలిసి ‘పేట’లో నటించి మెప్పించింది. సిమ్రన్కి సోదరుడు సుమిత్తో పాటు, చెల్లెళ్లు జ్యోతి నావల్, మోనాల్ ఉన్నారు. భరతనాట్యం, సల్సాల్లో ప్రావీణ్యం సంపాదించిన సిమ్రన్ పంజాబీ, హిందీ, ఇంగ్లిష్, తమిళం అనర్గళంగా మాట్లాడుతుంది. ఈరోజు సిమ్రన్ పుట్టినరోజు.
హుషారైన పోరి…సిమ్రాన్-TNI కథనం
Related tags :