DailyDose

1200 మంది విస్తారా ఉద్యోగులకు సెలవులు-వాణిజ్యం

Telugu Business News Roundup Today-Vistara Puts 1200 Employees On Vacation

* కరోనా సంక్షోభ సమయంలో విమానయాన సంస్థల ఆదాయాలు భారీగా పడిపోయాయి. ఈ ప్రభావం ఆయా విమానయాన సంస్థల ఉద్యోగులపై భారీగా పడుతోంది. తాజాగా విస్తారా ఉద్యోగులకు మరోసారి షాకిచ్చింది. సీనియర్ గ్రేడ్ ఉద్యోగులను 3 రోజులపాటు నిర్బంధ సెలవుపై వెళ్లాలని ఆదేశించింది. జీతంలేని తప్పనిసరి సెలవు తీసుకోవాల్సిందిగా దాదాపు 1200 మంది సీనియర్లను కోరింది. నగదు కష్టాలను ఎదుర్కొంటున్న సంస్థ జీతం లేకుండా సెలవుపై వెళ్ళమని విస్తారా ఉద్యోగులను కోరడం ఇది రెండోసారి. లాక్ డౌన్ పొడిగింపుతో కార్యకలాపాలన్నింటినీ నిలిపివేశామనీ, ఇది తమ నగదు లభ్యతపై గణనీయంగా ప్రభావం చూపిందని ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌ సమాచారంలో విస్తారా సీఈవో లెస్లీ థంగ్ చెప్పారు.

* లాక్‌డౌన్‌ నేపథ్యంలో సూపర్‌మార్కెట్లకు, షాపులకు వెళ్లి సరుకులు, కూరగాయలు, పండ్లు, ప్యాకింగ్‌ వస్తువులు కొని తెచ్చుకొని నిల్వ చేసుకుంటున్నాం. కానీ వాటిని ఇంటికి తెచ్చిన వెంటనే సరైన పద్ధతిలో శుభ్రం చేయడం మాత్రం మర్చిపోతున్నాం. సరుకులు కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటంటే…కొన్ని రకాల వస్తువుల ఉపరితలంపై కరోనా వైరస్‌ 72 గంటల పాటు జీవిస్తుంది. సరుకులు కొనడానికి వెళ్లే మందు తప్పనిసరిగా మాస్క్‌ ధరించి వెళ్లండి. సామాజిక దూరం పాటించండి. ఫోను, ముఖం, కళ్లు, చెవులు, ముక్కు, నోటిని తాకకండి. దూరం వెళ్లకుండా దగ్గరలోని షాపులో సరుకులు తీసుకోండి. సూపర్‌ మార్కెట్‌లో చాలా వస్తువులను చేతులతో పట్టుకునే జరుపుతారు. కాబట్టి అవి వైరస్‌ వాహకాలుగా మారే ప్రమాదం ఉంది.సూపర్‌ మార్కెట్లోని వస్తువులు అన్నింటినీ ఎవరో ఒకరు చేతులతో తాకి ఉంటారు. వారిలో ఎవరైనా అనారోగ్యంతో ఉండి ఉండొచ్చు. కాబట్టి సరుకులు వేసుకునే ట్రాలీ, బాస్కెట్‌ల హ్యాండిల్స్‌ను ముందుగా శానిటైజ్‌ చేయండి. సరుకులు కొన్నాక చేతులను నీటితో కడిగి హ్యాండ్‌ శానిటైజర్‌తో శుభ్రం చేసుకోండి. సూపర్‌ మార్కెట్లో అనారోగ్యంతో బాధపడే వ్యక్తులకు దగ్గరగా మసలే అవకాశాలు ఎక్కువ. సామాజిక దూరం పాటించడం చాలా కష్టం. వరుసలో ఉన్నప్పుడు ఎవరైనా మీకు దగ్గరగా వస్తే ‘‘దయచేసి ఆరు అడుగుల ఎడం పాటించండి’’ అని చెప్పండి. మీరు తీసుకోవాలనుకునే వస్తువులను మరెవరైనా తీసుకుంటుంటే…సమీపానికి వెళ్లకుండా వేచి ఉండండి. మీరు కొనాలనుకున్న వస్తువులను మాత్రమే తాకండి. సూపర్‌ మార్కెట్లకు వెళ్లడానికి బదులు అవకాశం ఉంటే వీధి వ్యాపారుల దగ్గర కొన్నా, హోమ్‌ డెలివరీ తీసుకున్నా రిస్క్‌ తగ్గుతుంది. దానివల్ల ఎక్కువమంది ఆ వస్తువులను తాకే అవకాశం తగ్గుతుంది. సరుకుల కోసం ఇంటి నుంచి సొంత సంచీని తీసుకెళ్లండి. తిరిగొచ్చాక సంచీని ఇంటి బయట ఉంచి శుభ్రం చేయండి. సరుకులను ప్యాకింగ్‌ చేసిన మెటీరియల్‌పైన కొన్ని రోజుల పాటు కరోనా వైరస్‌ జీవిస్తుంది. కాబట్టి శుభ్రమైన వస్త్రంతో సరుకుల పైన ఉండే దుమ్మును తొలగించండి. తరువాత ఆ వస్ర్తాన్ని పడేయండి. అప్పుడు మీ మాస్క్‌ను తొలగించండి. సంచీలో నుంచి సరుకులు బయటకు తీసి వంటగదిలో శుభ్రమైన ప్రదేశంలో ఉంచండి. తరువాత కనీసం 20 సెకన్ల పాటు నీటితో చేతులను శుభ్రంగా కడగండి. పండ్లు, కూరగాయలను కనీసం 30 సెకన్ల పాటు చల్లటి నీటిలో కడగండి. బంగాళదుంపలు, క్యారెట్‌ లాంటి దుంపజాతి కూరగాయలను బాగా కడగండి. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచే ఆహార పదార్థాలను ఒక్కసారే తెచ్చుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. కాబట్టి పలుమార్లు మార్కెట్‌కు వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. క్యాన్‌లు, బాక్స్‌ల లాంటివాటిని శుభ్రంగా తుడవడం, కడగడం వల్ల వైరస్‌ ప్రభావం తగ్గుతుంది.వంట చేసే ముందు, చేశాక తప్పనిసరిగా చేతులు సబ్బుతో కడగాలి. కూరగాయ వ్యర్థాలను మూత ఉన్న డస్ట్‌బిన్‌లో వేసి ఇంటి బయట ఉంచాలి. సరుకులు టేబుళ్ల ఉపరితలాలను శుభ్రంగా కడగాలి. ఒకవేళ మీరు క్లాత్‌బ్యాగ్‌లు వాడితే సబ్బుతో శుభ్రంగా ఉతికి ఎండలో ఆరేసి, పూర్తిగా ఆరాక వాటిని తిరిగి వాడుకోవాలి.

* కరోనా విజృంభిస్తున్న వేళ నిబంధనలు పాటించని ఎల్‌బీ నగర్‌ డీమార్ట్‌కు జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు షాకిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన భౌతిక దూరం నిబంధనలను యాజమాన్యం పాటించకపోవడంతో.. అధికారులు సూపర్‌ మార్కెట్‌ను సీజ్‌ చేశారు. మంగళవారం ఎల్‌బీ నగర్‌ ప్రాంతంలోని డీమార్ట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీ చేయగా.. పెద్ద ఎత్తున వినియోగదారులు కనిపించారు. అయితే వినియోగదారలు సూపర్‌ మార్కెట్‌లో భౌతిక దూరం పాటించేలా యాజమాన్యం కనీస చర్యలు తీసుకోకపోవడంతో అదికారులు సదరు డీమార్ట్‌ను సీజ్‌ చేసి నోటీసులు అంటించారు. డీమార్ట్‌లో కనీసం కస్టమర్ల కోసం శానిటైజర్స్‌ కూడా యాజమాన్యం ఏర్పాటు చేయనట్టుగా తెలుస్తోంది.

* 19 రోజులూ…పక్కాగా…రెండవ దశ లాక్ డౌన్ అమలుకు అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు పట్టణాల్లో మాత్రమే లాక్ డౌన్ అమలుకు కృషి చేసిన అధికారులు గ్రామాలలో వ్యవసాయేతర కార్యకలాపాలు నిలిపి వేయాలని నిర్ణయించారు. గ్రామ వాలంటీర్లను పోలీసు శాఖకు అనుసంధానం చేసి గ్రామాలలో లాక్ డౌన్ కచ్చితంగా అమలు చేసేందుకు వాలంటీర్ల సేవలు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే గ్రామాలలో దుకాణదారులకు లాక్ డౌన్ పై నోటీసులు జారీ చేసిన వాలంటీర్లు నిరంతరం పర్యవేక్షించనున్నారు.

* కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్న కరెన్సీ నోట్లు.. గుర్తించిన ఏపీ అధికారులు…గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో రెండు కేసుల నమోదు…అప్రమత్తమైన యంత్రాంగం…డిజిటల్‌ చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన.

* కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్య రాకపోకలను పూర్తిగా నిషేధించిన ప్రభుత్వం. రెండు జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్ట్లు ఏర్పాటు. సరిహద్దు ప్రాంతాలలో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసిన రెండు జిల్లాల పోలీసులు.