Politics

కేటీఆర్ జోస్యం ముచ్చట

KTR Predictions On COVID19 In Telangana

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా మే 8 నాటికి తెలంగాణ కరోనారహిత రాష్ట్రంగా మారగలదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు ఆశాభావం వ్యక్తంచేశారు. మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో సింగిల్‌ డిజిట్‌లో మాత్రమే కేసులు నమోదవుతున్నాయని ఆయన తెలిపారు. బుధవారం ఎన్డీటీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ బుధవారం నాటికి రాష్ట్రంలో కరోనా ఫ్రీ జిల్లాలు 11 ఉన్నాయన్నారు. రాష్ట్రంలో మే 7 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారందరూ అప్పటికి డిశ్చార్జి అవుతారని అంచనా వేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా లక్షణాలు ఉన్నవారికి, వారి ప్రైమరీ కాంటాక్టులకు పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. కంటైన్మెంట్‌, క్వారంటైన్‌, రెడ్‌ జోన్లను సమర్ధంగా అమలుపరుస్తున్నామని చెప్పారు. ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీట్‌మెంట్‌ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ధాన్యం కొనుగోలుకు ఏడువేల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. జీవితంతోపాటు జీతం ముఖ్యమని, ప్రజలకు అత్యవసరమైన సేవలు అందించడానికి అవసరమైన పరిశ్రమలను నడిపిస్తున్నామని, దీనిద్వారా కొందరికి ఉపాధి కూడా దొరుకుతున్నదని చెప్పారు.