DailyDose

ఆరు విమానాశ్రయాలు వేలం-వాణిజ్యం

Telugu Business News Roundup Today-6 Airports To be Auctioned in India

* ‘ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలను స్టాక్‌ మార్కెట్లలో నమోదు చేస్తాం. అందులో సామాన్య ప్రజలు కూడా పెట్టుబడులు పెట్టవచ్చు. భాగస్వాములు ఆర్డినెన్స్‌, ఫ్యాక్టరీ కార్యకలాపాలను తెలుసుకోవచ్చు. ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీల్లో కార్పొరేట్‌ తరహా జవాబుదారీతనం ఉంటుంది. దిగుమతులపై పరిమితులతో రక్షణ ఉత్పత్తి సామర్థ్యాల పెరుగుతాయి. క్రమంగా దేశీయ ఉత్పత్తి సంస్థల బోలోపేతమవుతుంది. రక్షణ సామగ్రి కోసం విదేశాలపై ఆధారపడకుండా చర్యలు తీసుకుంటాం.రక్షణ ఉత్పత్తుల తయారీలో ఉన్న ఎఫ్‌డీఐ పరిమితిని ఆటోమేటిక్‌ రూట్‌లో 49 శాతం నుంచి 74 శాతానికి పెంచుతున్నాం అని నిర్మల తెలిపారు.

* దేశంలో విద్యుత్‌ పంపిణీ సంస్థలు మనుగడ సాగించేలా కేంద్రం చర్యలు చేపడుతున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఉత్పత్తిదారులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా డిస్కంలలో సంస్కరణలు తీసుకొస్తున్నట్టు చెప్పారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో డిస్కమ్‌ల ప్రైవేటీకరిస్తున్నట్టు ప్రకటించారు. నష్టాల ప్రభావం వినియోగదారులపై పడకుండా ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు.

* విమానయాన రంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. భారతీయ ఏరోస్పేస్‌ రూట్ల హేతుబద్ధీకరిస్తున్నట్టు తెలిపింది. శనివారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ దేశంలో రూ.13వేల కోట్లతో 12 కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కేంద్రం నిర్ణయించింది. పీపీపీ భాగస్వామ్యంతో మరో ఆరు ఎయిర్‌పోర్టులకు వేలం వేయనున్నాం. భారతీయ ఏరో స్పేస్‌ రూట్లు హేతుబద్ధీకరణ జరుగుతుంది. విమానాశ్రయాల అభివృద్ధికి ఏఏఐకి రూ.2300 కోట్లు నిధులు కేటాయింపు. విమాన మరమ్మతుల హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం’’ అని వివరించారు.

* బొగ్గు తవ్వకాలు, మౌలిక వసతుల కల్పనకు రూ.50వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పథకంలో నాలుగో విడతలో ఎనిమిది రంగాలపై కేటాయింపులు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు ముఖ్యంగా ఎనిమిది రంగాలపై కేటాయింపులు ప్రకటిస్తున్నాం. అవి ఏమిటంటే.. బొగ్గు, ఖనిజం, రక్షణ ఉత్పత్తులు, విమానాశ్రయాలు, ఏరో స్పేస్‌, స్పేస్‌, యూటీల్లోని డిస్కమ్‌, అణువిద్యుత్‌ శక్తి రంగాలు. సౌర విద్యుత్‌ పలకల తయారీకి ఊతమిచ్చే చర్యలు చేపడుతున్నాం. మార్కెట్‌ ధరకు అనుగుణంగా బొగ్గు సరఫరాకు చర్యలు తీసుకుంటాం. గడువులోగా బొగ్గు సరఫరా చేసిన వారికి ప్రోత్సాహకాలిస్తాం. పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా బొగ్గు సరఫరా చేసేలా చర్యలు. బొగ్గును వాయువుగా మార్చేందుకు నూతన సాంకేతిక సాయం అందిస్తాం. కొత్త బొగ్గు గనులను కనుగునేందుకు నిరంతర ప్రయత్నిస్తాం’’ అని నిర్మల వివరించారు.

* సరళతర వాణిజ్యం, బీఏఎఫ్‌ఆర్‌ అమలులో తమ ప్రభుత్వం ముందుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. పెట్టుబడులకు కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దే ప్రక్రియ నిరంతరం జరుగుతోందన్నారు. బ్యాంకు రుణాల ద్వారా క్రోనీ క్యాపటిలిస్టులు ఏర్పడకుండా జాగ్రత్త పడుతున్నామని చెప్పారు. ‘ఒకే దేశం -ఒకే మార్కెట్‌’ను తీసుకురావడం గొప్ప సంస్కరణగా అభివర్ణించారు. ఉదయ్‌ పథకం ద్వారా విద్యుత్‌ రంగంలో సంస్కరణలు తెచ్చామన్న ఆమె.. ఇవాళ ప్రకటించే సంస్కరణలు వివిధ రంగాల్లో గొప్ప మార్పును తెస్తాయన్నారు.