Movies

అందుకే చెల్లెలికి దగ్గరయ్యాను

Arjun Kapoor Speaks About His Sisters And Jahnvi Kapoor

అలనాటి నటి శ్రీదేవి మరణం తర్వాత ఆమె ఇద్దరు కుమార్తెలు జాన్వి కపూర్‌, ఖుషి కపూర్‌లకు అండగా నిలిచారు అర్జున్‌ కపూర్‌. సోదరుడి స్థానంలో వారి బాధను పంచుకుని ఓదార్చారు. అప్పటి నుంచి జాన్వి, ఖుషి.. బోనీ, ఆయన మొదటి భార్య మోనా పిల్లలు అర్జున్‌, అన్షులాకు దగ్గరయ్యారు. అయితే శ్రీదేవి కన్నుమూసిన తర్వాత ఇలా చెల్లెళ్లకు మద్దతుగా నిలవడం గురించి ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో అర్జున్‌ స్పందించారు. తన మనసుకు ఏది సరైందనిపిస్తే అదే చేశానని అన్నారు. ‘పరిస్థితుల్ని బట్టి నేను ప్రవర్తిస్తుంటా. ఓ మంచి మనిషిగా ఉండాలని మా అమ్మ నాకు చెప్పింది. వీలైనంత వరకు ఇతరులతో సౌమ్యంగా ఉండేలా విలువలు నేర్పింది. అందుకే నా తండ్రి బోనీకి ఎలాంటి సహాయం చేయగలనో.. అదే చేస్తున్నా. జాన్వి, ఖుషిని కలిసి, వారి గురించి తెలుసుకునే అవకాశం అప్పుడు దక్కింది. నేను జీవితంలో బాధల్ని అనుభవించా, వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నా. మా అమ్మ చనిపోయినప్పుడు నన్ను ఓదార్చే వారు ఎవరైనా ఉంటే బాగుండేది అనిపించింది. నా కోసం నలుగురు ఉంటే బాగుండేది అనుకున్నా. అందుకే జాన్వికి అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు సాయం చేయాలి అనుకున్నా’ అని అర్జున్‌ చెప్పారు.