Politics

తెదేపా 2020 మహానాడుపై TNI కథనాలు

తెదేపా 2020 మహానాడుపై TNI కథనాలు - Digital TDP 2020 Mahanadu Special Stories

* ఈరోజు మహానాడు మొదటి రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ హైదరాబాద్ నందు పార్టీ జండా ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి అర్పించిన టీడీపీ తెలంగాణా అధ్యక్షులు ఎల్. రమణ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర ముఖ్య నాయకులు మాజీ ఎమ్మెల్యేలు అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు కార్యకర్తలు ఈ మహానాడు జూమ్ అప్ ద్వారా బిగ్ స్క్రీన్ లో ఇక్కడే వీక్షించారు

* కార్యకర్తల త్యాగాలు జీవితంలో మరిచిపోలేనని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. మహానాడులో భాగంగా పార్టీ శ్రేణులనుద్దేశించి చంద్రబాబు జూమ్‌ వెబినార్‌ ద్వారా ప్రసంగించారు. గడిచిన ఏడాది దురదృష్టకర సంవత్సరమన్న ఆయన.. శారీరకంగా మానసికంగా, ఆర్థికంగా కార్యర్తలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. చేయని తప్పుకు తెదేపా కార్యకర్తలు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. పార్టీ శ్రేణులను బెదిరించి లొంగదీసుకునే కుట్రలు చేశారని చంద్రబాబు ఆరోపించారు.

* సాంకేతిక పరిజ్ఞానం ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం చూపుతుందనే తన నమ్మకం ఎప్పటికప్పుడు బలపడుతూనే ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. లాక్‌డౌన్‌ కాలంలో భౌతికదూరం పాటిస్తూ డిజిటల్‌ సోషలైజేషన్‌ దిశగా వెళ్తున్నామంటే దానికి సాంకేతికతే కారణమని స్పష్టం చేశారు. ఈసారి జరుగుతున్న డిజిటల్‌ మహానాడు 2020 కూడా అలాంటిదేనని వివరించారు. ఏటా అసంఖ్యాక జన సందోహం మధ్య వేడుకగా నిర్వహించే మహానాడుకు ఈ సారి లాక్‌డౌన్‌ నిబంధనలు అడ్డొచ్చాయన్నారు.

* తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద పండుగలా భావించే ‘మహానాడు’ ప్రారంభమైంది. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్ర కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, చిన రాజప్ప, నారా లోకేశ్‌, అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బోండా ఉమా తదితరులు పాల్గొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు, విదేశాల్లోని పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగానికి చెందిన నాయకులు, కార్యకర్తలు సుమారు 14 వేల మంది జూమ్‌ యాప్‌ ద్వారా భాగస్వాములయ్యారు. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా మరో 10 వేల మంది కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఒక రాజకీయ పార్టీ… ఇన్ని వేల మంది నాయకుల్ని, కార్యకర్తల్ని భాగస్వాముల్ని చేస్తూ ఆన్‌లైన్‌లో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి. ఏటా జరిగే ఈ వేడుకను కరోనా కారణంగా ఈసారి డిజిటల్‌ మాధ్యమం ద్వారా నిర్వహిస్తున్నారు.

* మహానాడుకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిలిచారు. గతంలో కాస్త లావుగా కనిపించిన ఆయన.. ప్రస్తుతం స్లిమ్‌గా ప్రత్యక్షమయ్యారు.