DailyDose

ఏపీలో కొత్తగా 68 పాజిటివ్ కేసులు-TNI కరోనా బులెటిన్

TNILIVE Corona Bulletin - 68 New Positive Cases In Andhra

* ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య క్రమేపి పెరుగుతూనే ఉన్నాయి. 24 గంటల్లో 68 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం ఏపీలో ఇప్పటివరకు 2787 కరోనా కేసులు నమోదయ్యాయి.

* తెలంగాణ నుంచి ప్రత్యేక బస్సుల్లో కొద్దిసేపటి క్రితం మంగళగిరి బైపాస్ రోడ్డు సీకె కన్వెన్షనల్ కు చేరుకున్న 400 ఆంధ్ర సచివాలయం ఉద్యోగులు. వారందరికీ కరోనా టెస్ట్ లు చేస్తున్న రెవెన్యూ అధికారులు.

* ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి తొలి దశలోనే ఉందని డబ్ల్యూహెచ్​ఓ స్పష్టం చేసింది. దక్షిణ అమెరికా, దక్షిణాసియాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసింది.

* కరోనా కారణంగా పశ్చిమ బంగ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్‌ 30 వరకు రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలను తెరవకూడదని నిర్ణయించామని పశ్చిమ బంగ విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ తెలిపారు.

* తమిళనాడులో నేడు రికార్డు స్థాయిలో 817 కొవిడ్‌ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్టంలో కరోనా కేసుల సంఖ్య 18,545కు చేరింది. ఈ రోజు మృతి చెందిన ఆరుగురితో కలిపి మొత్తం మృతుల సంఖ్య 133గా ఉంది. నేడు 567 డిశ్చార్జికాగా, ఇప్పటివరకు 9,909 మంది డిశ్చార్జయ్యారు. వివిధ ఆస్పత్రుల్లో 8,500 మంది చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఒక్క చెన్నైలోనే 558 కేసులు నమోదయ్యాయి. వీటితో చెన్నై కేసుల సంఖ్య 12,203కి పెరిగింది.

* భారత్‌లో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు విధించిన లాక్‌డౌన్‌తో అనేక రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా పెళ్లిళ్లపై ఈ మహమ్మారి తీవ్రస్థాయిలో ప్రభావం చూపించింది. దీంతో దేశంలో అనేక చోట్ల పెళ్లి భాజాలు మోగలేదు. కొన్ని పెళ్లిళ్లు వాయిదా పడగా.. మరికొన్ని వివాహాలు రద్దు చేసుకున్నారు. లాక్‌డౌన్‌ కొనసాగుతున్న ఈ రెండు నెలల కాలంలో ఒక్క గుజరాత్‌లోనే దాదాపు 30వేల పెళ్లిళ్లు వాయిదా పడగా, మరికొన్ని కొన్ని రద్దయినట్టు హోటల్‌, రెస్టారెంట్‌ అసోసియేషన్‌ అధికార ప్రతినిధి అభిజిత్‌ దేశ్‌ముఖ్‌ వెల్లడించారు.

* కేరళలో ఈ రోజు 40 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. అందులో తొమ్మిది కేసులు విదేశాల నుంచి వచ్చినవారు కాగా 16 మహారాష్ట్ర నుంచి వచ్చినవారు. తమిళనాడు నుంచి వచ్చిన ఐదుగురు, తమిళనాడు నుంచి వచ్చిన ముగ్గురు కూడా ఈ రోజు నమోదైన కేసుల్లో ఉన్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. ఇందులో 445 యాక్టివ్‌ కేసులు. ఇప్పటివరకు వివిధ దేశాల్లో 173 మంది కేరళవాసులు కరోనాతో చనిపోయారని సీఎం పినరయి విజయన్‌ చెప్పారు.

* దేశంలో కరోనా కేసుల రికవరీ రేటు 42.4గా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ రోజు ఉదయం 8 వరకు దేశంలో 1,51,767 కేసులు నమోదు కాగా, 64,426 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల శాతం 6.36 ఉండగా, మన దేశంలో 2.86 శాతం మాత్రమే ఉందని కేంద్రం వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 624 కొవిడ్‌ ల్యాబ్‌లు ఉన్నాయి. అందులో 435 ప్రభుత్వ ల్యాబ్‌లు కాగా, 189 ప్రైవేటు ల్యాబులు. వీటిలో ఇప్పటివరకు 32,42,160 శాంపిల్స్‌ టెస్ట్‌ చేశారు. నిన్న ఒక్క రోజే 1,16,041 టెస్టులు జరిగాయి.

* రాష్ట్రంలో గత 24 గంటల్లో 277 కరోనా కేసులు నమోదైనట్లు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కొవిడ్‌ బాధితుల సంఖ్య 3,855కి చేరింది. ఇందులో 2,790 యాక్టివ్‌ కేసులు కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 178 మంది చనిపోయారు.