Sports

వలస కార్మికులకు వీరేంద్రుడి విరాళం

Sehwag foundation shipping lakhs of meals to migrant labors

టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌, విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ వలస కార్మికుల పట్ల తన ఔదార్యాన్ని చూపాడు. కరోనా వైరస్‌ నేపథ్యంలో మార్చిలో లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత లక్షలాది మంది వలస కార్మికులు బతుకు జీవుడా అంటూ స్వగ్రామాల బాట పట్టిన సంగతి తెలిసిందే. ఉపాధి కోల్పోవడంతో పాటు చేతిలో డబ్బులు లేక.. తినడానికి తిండి లేక.. దాతల కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి చాలా మంది తమకు తోచిన విధంగా ఆహారం అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెహ్వాగ్‌ సైతం కష్టాల్లో ఉన్న వలస కార్మికుల కోసం స్వయంగా రంగంలోకి దిగాడు. స్వయంగా వండి ఆహార ప్యాకెట్లను సిద్ధం చేసి ఆకలితో ఉన్నవారికి చేరవేశాడు. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి ఎవరైనా దాతలు ఇలా చేయాలనుకుంటే సెహ్వాగ్‌ ఫౌండేషన్‌కు ట్విటర్‌లో మెసేజ్‌ చేయాలని కోరాడు.