Health

కరోనా కేసుల్లో అగ్రపథానికి దూసుకెళ్తున్న భారత్

India Corona Cases On Huge Rise - Reaches 8th Spot

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 8 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో ప్రపంచంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 9వ స్థానం నుంచి 8వ స్థానానికి ఎగబాకింది. 1.85 లక్షల పైచిలుకు కేసులతో జర్మనీని వెనక్కి నెట్టి 8వ స్థానంలో నిలిచింది. 1.83 లక్షల కేసులతో జర్మనీ 9వ స్థానానికి పడిపోయింది. ఆదివారం (మే 31) సాయంత్రం నాటికి ఇండియాలో 1,85,398 కేసులు నమోదయ్యాయి. 18 లక్షలకు పైచిలుకు కరోనా కేసులతో జాబితాలో అమెరికా అగ్ర స్థానంలో ఉంది. ఆ తర్వాత 5 లక్షల కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉండగా.. 4 లక్షలకు పైచిలుకు కేసులతో రష్యా మూడో స్థానంలో ఉంది. భారత్‌లో కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ పూర్తిగా సడలిస్తూ అన్‌లాక్ సడలింపులు ఇస్తున్న దశలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఆదివారం (మే 31) ఉదయం వరకు అందిన వివరాల ప్రకారం.. దేశంలో గడిచిన 24 గంటల్లో 8,380 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదవడం ఇదే అత్యధికం. మరోవైపు దేశంలో కరోనా మరణాల సంఖ్య 5 వేల మార్క్‌ను దాటింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 193 మంది మరణించారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 65 వేలు దాటాయి. తమిళనాడులో కేసులు 20 వేలు దాటాయి. దేశంలో క‌రోనా కేసులు ఓ వైపు పెరుగుతున్నా.. మరోవైపు రిక‌వ‌రీ రేటు మెరుగుప‌డుతుండటం ఊరట కల్పించే అంశం. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 4,614 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో క‌రోనా రోగుల రిక‌వ‌రీ రేటు 47.76 శాతానికి పెరిగింద‌ని తెలిపింది. ఆదివారం డిశ్చార్జి అయిన వారితో క‌లిపి ఇప్పటి వ‌ర‌కు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 86,983కు చేరింది. దేశంలో ప్రస్తుతం 89,995 యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు.