ఐదేళ్లలో 30 లక్షల ప్రభుత్వ గృహాలు నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.
30 లక్షల ప్లాట్లు ఇస్తుంటే ప్రతిపక్షానికి కంటగింపుగా ఉందన్నారు.
తెదేపా ప్రభుత్వం గత ఐదేళ్లలో 7 లక్షల ఇళ్లు కూడా ఇవ్వలేదని బుగ్గన విమర్శించారు.
కేంద్ర నిధులతోనే తప్ప.. రాష్ట్ర నిధులతో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని ఎద్దేవా చేశారు.
మే నెల వరకు ప్రజల నుంచి 30 లక్షల దరఖాస్తులు వచ్చాయని…4 విడతలుగా గ్రామసభలు పెట్టి ప్రజల నుంచి వినతులు స్వీకరించామని మంత్రి బుగ్గన తెలిపారు.
ఎన్నికలకు ముందు చివరి ఏడాది తెదేపా నేతలు ఆడంబరంగా శంకుస్థాపనలు చేశారని…గృహనిర్మాణ రంగంలో రూ.4 వేల కోట్లు బిల్లులు పెండింగ్ పెట్టారని విమర్శించారు.
గ్రాఫిక్స్ ఇళ్లల్లోనే చంద్రబాబు ప్రజలను గృహప్రవేశం చేయించారని మంత్రి బుగ్గన విమర్శించారు.
పేదల ఇళ్ల స్థలాల కోసం బూరుగుపూడి వద్ద 586 ఎకరాలు సేకరించినట్లు మంత్రి తెలిపారు.
రాజమండ్రి చుట్టూ కాలనీలు నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచన అని ఎకరాకు రూ.40 లక్షలు చెల్లిస్తామన్నా భూమి ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నారు.
రాజమండ్రి వద్ద రూ.7 లక్షలకు ఎకరం భూమి చంద్రబాబు ఇప్పిస్తారా అని బుగ్గన ప్రశ్నించారు.