* ఆంధ్రప్రదేశ్లో కరోనా వాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 9,831 నమూనాలు పరీక్షించగా 138 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 88 ఉండగా.. రాష్ట్రంలో 50 పాజిటివ్ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 4,250 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా గడచిన 24 గంటల్లో కృష్ణాలో ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య73కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,294కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 1,060 మంది చికిత్స పొందుతున్నారు.
* పొరుగు దేశం పాకిస్థాన్లో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. కేసుల సంఖ్యలో ఇప్పటికే చైనాను దాటేసింది. అయితే గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలో ఈ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. చైనాకు సరిహద్దులో ఉన్న ఆ ప్రాంతంలో 800 మంది కరోనా బారినపడ్డారు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో ఆ ప్రాంత ప్రజలు తిండి గింజలు, కనీస వైద్య సదుపాయాలు లేక అల్లాడుతున్నారు.
* దేశంలో గత 24 గంటల్లో 5,355 మంది కొవిడ్ బాధితులు నయమై డిశ్చార్జి అయ్యారని ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి సంఖ్య 1,09,462గా ఉంది. దీంతో రికవరీ రేటు 48.27 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 1,10,960 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
* భారత్లో కరోనా వైరస్ విస్తృత వేగంతో వ్యాపిస్తోంది. దేశంలో రోజురోజుకూ రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే అత్యధికంగా దాదాపు 10వేల పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. భారత్లో కరోనా వైరస్ బయటపడిన తర్వాత మొట్టమొదటిసారిగా 24గంటల్లో 9851 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో శుక్రవారం నాటికి దేశంలో కొవిడ్-19 బారినపడ్డ వారిసంఖ్య 2,26,770కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది.