Politics

నేడు సరికొత్త నిర్ణయాలు చెప్పనున్న కేసీఆర్

KCR To Review Corona Virus And Tenth Exams

పదో తరగతి పరీక్షలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం కీలక సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో విద్యాశాఖ అధికారులు పాల్గొనే ఈ సమావేశంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ అమలు తదితర అంశాలపై కూడా చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలు, లాక్‌డౌన్‌పై తగిన నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశానికి వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు సీనియర్‌ అధికారులు హాజరుకానున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సమగ్ర విద్యావిధానం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనున్నది. విద్యారంగంలో అవలంబించాల్సిన ప్రధాన అంశాలపై సీఎం కేసీఆర్‌ సోమవారం మధ్యాహ్నం విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. టెన్త్‌ పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో వాటిని రద్దుచేయాలా? నిర్వహించాలా? సాధారణ పరిస్థితులు వచ్చేది ఎప్పుడు? దీనికి ప్రత్నామ్నాయ విధానాలు ఏమిటి? వంటి అంశాలపై చర్చించనున్నట్టు తెలిసింది. సాధారణ పరిస్థితులు రావడానికి రెండు మూడు నెలల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో పరీక్షల రద్దు ఉత్తమమని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేటు స్కూల్‌ యాజమాన్యాలు చెప్తున్నాయి. 5.35 లక్షల మంది టెన్త్‌ జీవితాలను రిస్కులో పెట్టి పరీక్షలకు వెళ్లడం కంటే రద్దుచేసి ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించడం ఉత్తమమనే అభిప్రాయాలు వినిపిన్నాయి. ఇంటర్నల్‌ మార్కులు, ఫార్మెటివ్‌, సమ్మెటివ్‌, ప్రీ ఫైనల్‌ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా టెన్త్‌ ఫలితాలు ప్రకటించి గ్రేడింగ్‌ ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీరియస్‌, నాన్‌ సీరియస్‌ విద్యార్థులెవ్వరో తెలుసుకోవడానికి అటెండెన్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.