Health

కుప్పంలోకి అక్రమంగా తమిళులు

కుప్పంలోకి అక్రమంగా తమిళులు

తమిళ రైల్వే ప్రయాణికులతో కుప్పం భయపడిపోతోంది.ఆదివారం సుమారు పదిమంది, సోమవారం దాదాపు 10-15 మంది ప్రయాణికులు మూటాముల్లెతో ఆదివారం కుప్పం రైల్వే స్టేషన్‌ చేరుకున్నారు. రైల్వే పోలీసులు విచారించగా చెన్నై, తిరుపూరు, సేలం ప్రాంతాలకు చెందినవారుగా తేలింది. తమిళనాడులోని పలు రైల్వే స్టేషన్లలో కరోనా ప్రభావంతో ఒక్క రైలు కూడా ఆగడంలేదు. దీంతో కుప్పంనుంచి ఇతర రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాలనుంచి కుప్పానికి తమిళ ప్రయాణికులు ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకుని కరోనా పరీక్షలు లేకనే కుప్పం రైల్వే స్టేషన్‌ చేరుకోగలుగుతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో కరోనా ఉధృతి తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న పరిస్థితిలో కుప్పం సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు దాటుకుని తమిళ ప్రయాణికులు రాకపోకలు ఎలా సాగిస్తున్నారో తెలియడంలేదు. కుప్పం రైల్వే స్టేషన్‌లో థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరికరం కూడా లేదు. శానిటైజర్‌ వంటి కనీస జాగ్రత్తలూ తీసుకోవడంలేదు. ఇలా ఎప్పుడంటే అప్పుడు హఠాత్తుగా కుప్పం రైల్వే స్టేషన్‌లో దిగిపోయి హల్‌చల్‌ చేస్తున్న తమిళ ప్రయాణికులతో కుప్పంవాసులు బెంబేలెత్తిపోతున్నారు. దీనిపై కుప్పం రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ నాగరాజు మాట్లాడుతూ వారివద్ద ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్‌ చేసుకున్నట్లు ఆధారాలుంటున్నాయి కాబట్టి, తామేమీ చేయలేమని, బాధ్యత కలిగిన అధికారులు మాత్రమే చర్యలు తీసుకోగలరని చెప్పారు.