WorldWonders

రెండు ఏనుగుల పేరిట ₹5కోట్ల ఆస్తికి వీలునామా

రెండు ఏనుగుల సంరక్షణార్థం రూ. 5 కోట్ల విలువైన ఆస్తిని ఓ వ్యక్తి వీలునామాగా రాశాడు. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. అక్తర్‌ ఇమాం అనే వ్యక్తి తన ఆస్తిలో సగ భాగం భార్యకు చెందేలా మరో సగ భాగం ఏనుగులకు చెందేలా వీలునామా రాశాడు. ఏసియన్‌ ఎలిఫెంట్‌ రిహాబిలిటేషన్‌ అండ్‌ వైల్డ్‌లైఫ్‌ యానిమల్‌ ట్రస్ట్‌(ఏఈఆర్‌ఏడబ్ల్యూఏటీ) చీఫ్‌ మేనేజర్‌ అక్తర్‌ ఇమాం. 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి మోతీ, రాణీ అనే ఏనుగుల సంరక్షణ చూసుకుంటూ వస్తున్నాడు. రెండు ఏనుగులు కుటుంబ సభ్యులుగా కలిసిపోయినట్లు తెలిపాడు. అవి లేకపోతే జీవించలేనిస్థితి ఏర్పడిందన్నారు. దుండగుల తుపాకి దాడి నుంచి ఏనుగులు తనను ఓసారి కాపాడినట్లు చెప్పాడు. భూమిని ఏనుగుల పేర ట్రాన్స్‌ఫర్‌ చేసినందుకుగాను భార్య, కొడుకు తనను వదలి వెళ్లినట్లు తెలిపారు. కుటుంబ తగాదాల వల్ల వీరు గత పదేళ్ల నుంచి దూరంగానే ఉంటున్నట్లు చెప్పారు. ఓ తప్పుడు కేసు బానాయించి తనను జైలుకు పంపినట్లుగా తెలిపాడు. కేసులు నిలవకపోవడంతో తాను విడుదలైనట్లు చెప్పాడు. తన కొడుకు స్మగ్లర్లతో చేతులు కలిపి ఏనుగును అమ్మేందుకు ప్రయత్నించగా అదృష్టవశాత్తు అది విఫలమైందన్నారు. కాగా తన కుటుంబ సభ్యులనుంచే తనకు ప్రాణాహాని ఉందన్నారు. తనకున్న మొత్తం ఆస్తిలో సగం ఆస్తిని భార్య పేర మిగతా సగం ఆస్తిని ఏనుగుల పేరు వీలునామా చేసినట్లు తెలిపాడు. ఏనుగులు ఒకవేళ మరణిస్తే ఆ ఆస్తి ఎఈఆర్‌ఏడబ్ల్యూఏటీ ట్రస్టుకు చెందేలా వీలునామా రాసినట్లు చెప్పాడు. మనుషుల వలె కాదు జంతువులు ఎంతో విశ్వాసమైనవని అక్తర్‌ అన్నారు. ఏనుగుల సంరక్షణ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేనిచేస్తునట్లు తెలిపారు. తన మరణానంతరం ఏనుగులు అనాథలుగా ఉండొద్దన్న ఉద్దేశ్యంతోనే ఆస్తిని ఏనుగుల పేర వీలునామాగా రాసినట్లు పేర్కొన్నాడు.