Agriculture

తెలంగాణా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం

తెలంగాణా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం

సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు బిల్లు రూ.1000 దాటితే అమ్మో అంత బిల్లు వచ్చిందా..! అని ఆశ్చర్యపోతారు. అలాంటిది రూ.500 బిల్లు రావాల్సిన ఇంటికి ఏకంగా రూ.లక్షల్లో వస్తే ఇంకేమైనా ఉందా. ‘కరెంట్‌ షాక్‌’ కొట్టినట్లే అవుతుంది. తాజాగా కామారెడ్డి జిల్లాలోని ఓ సామాన్య రైతు కుటుంబానికి ఇలాంటి ఘటనే ఎదురైంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి మండలంలోని ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన గాండ్ల శ్రీనివాస్‌ది వ్యవసాయ కుటుంబం. ఆయన ఇంట్లో 3 విద్యుత్‌ బల్బులు, 2 ఫ్యాన్లు మాత్రమే ఉన్నాయి. వీటికి ప్రతి నెలా రూ.500 వరకు కరెంటు బిల్లు వస్తుంది. ఫిబ్రవరి నెలలో రూ.415 విద్యుత్‌ బిల్లును చెల్లించారు. అయితే, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో విద్యుత్‌ బిల్లులు తీయలేదు. ఈ మూడు నెలలకు కలిపి తాజాగా విద్యుత్‌ శాఖ ఇచ్చిన బిల్లును చూసి విస్మయానికి గురవడం రైతు వంతు అయింది. 3 నెలలకు కలిపి ఏకంగా రూ.7,29,417 విద్యుత్‌ బిల్లు వచ్చింది. ఇంత భారీ మొత్తంలో వచ్చిన కరెంటు బిల్లు చెల్లించేదెలా అని బాధిత రైతు వాపోతున్నాడు.