DailyDose

మళ్లీ ఇండియా మొత్తం లాక్‌డౌన్ ఉంటుందా-తాజావార్తలు

మళ్లీ ఇండియా మొత్తం లాక్‌డౌన్ ఉంటుందా-తాజావార్తలు

* మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తారా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!!★ భారత్‌లో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది.★ రోజుకు 9వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.★ లాక్‌డౌన్ ఆంక్షలను సడలించిన తర్వాత రికార్డు స్థాయిలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు.★ కరోనా పంజా విసురుతున్నందున.. మళ్లీ లాక్‌డౌన్ విధించాలని పలు వర్గాల నుంచి డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.★ ఈ క్రమంలో జూన్ 15 నుంచి మళ్లీ దేశవ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.★ దీనిపై ఇప్పటికే కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుందని.. రేపోమాపో అధికారిక ప్రకటన వస్తోందని పుకార్లు షికారు చేస్తున్నాయి.★ విమానాలు, రైలు ప్రయాణాలపైనా నిషేధం విధిస్తారని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.ఈ ప్రచారంపై పిఐబీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ఇది ఫేక్ న్యూస్ అని.. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మకూడదని ప్రజలకు సూచించింది.★ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వమే స్వయంగా వెల్లడిస్తుందని తెలిపింది.★ కాగా, కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వాటిపై పిఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టత ఇస్తుందన్న విషయం తెలిసిందే.★ కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 9985 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.★ తాజా కేసులతో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 276583కి చేరింది.★ మరో 279 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 7745కి చేరింది.★ ప్రస్తుతం ఇండియాలో కరోనా సోకిన ప్రతి 1000 మందిలో 28 మంది చనిపోతున్నారు.★ తాజా లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో 5991 మంది కోలుకున్నారు.★ అందువల్ల కోలుకున్న వారి సంఖ్య 135205కి చేరింది.★ ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కేసులు ఉన్న దేశాల్లో ఇండియా ఆరో స్థానంలో ఉంది.

* ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 16వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్‌ చేయూత పథకానికి కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 12న పథకాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని రైతులకు పగటిపూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు.

* ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోన్న కరోనా మహమ్మారికి అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతోంది. తాజాగా దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 20లక్షలు దాటినట్లు జాన్స్ హాప్కిన్స్‌ యూనివర్సిటీ నివేదించింది. ఇప్పటివరకు దేశంలో 20,00,464 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా వీరిలో 1,12,924 మంది మృత్యువాతపడినట్లు పేర్కొంది. ప్రపంచంలోనే అత్యధికంగా కొవిడ్‌-19 వైరస్‌ తీవ్రత అమెరికాలో కొనసాగుతోన్న విషయం తెలిసిందే.

* ఏపీలో ఇంటర్‌ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను రేపు (శుక్రవారం) విడుదల చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్‌ రేపు మధ్యాహ్నం 12.30గంటల తర్వాత విడుదల చేయనున్నట్టు సమాచారం.

* కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న దృష్ట్యా శబరిమలలో భక్తులను అనుమతి లేదని తాజాగా కేరళ ప్రభుత్వం ప్రకటించింది. వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా భక్తులను శబరిమలకు అనుమతించమని మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ ప్రకటించారు. శబరిమల దేవాలయ ప్రధానార్చకులు, ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు సభ్యులతో మంత్రి సమావేశం అయ్యారు. అనంతరం, ఆలయంలో జరిపే నెలవారీ పూజలతోపాటు ఆలయ ఉత్సవాలను కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

* దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు రెక్కలొచ్చాయ్‌. వరుసగా ఐదో రోజూ ధరలు పెరిగాయి. గురువారం లీటర్‌ పెట్రోల్‌పై 60 పైసలు, డీజిల్‌పై 60 పైసలు చొప్పున పెంచుతున్నట్టు చమురు మార్కెటింగ్ సంస్థలు వెల్లడించాయి. తాజా పెరుగుదలతో దేశ రాజధాని నగరం దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.73.40 నుంచి రూ.74కి పెరగ్గా.. లీటరు డీజిల్‌ ధర రూ.71.62 నుంచి రూ.72.22కి పెరిగింది. దేశంలో ఆదివారం నుంచి వరుసగా పెట్రోల్‌ ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే.

* భారత్ అన్నిమతాల పట్ల సహనంతో, మర్యాదపూర్వకంగా వ్యవహరించేది.. కానీ, కొంతకాలంగా మతస్వేచ్ఛ విషయంలో జరుగుతున్న ఘటనలపై యూఎస్‌ ఆందోళన చెందుతోందని యూఎస్ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ‘2019 అంతర్జాతీయ మత స్వేచ్ఛ నివేదిక’ విడులైన నేపథ్యంలో ఆ దేశం నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా మత స్వేచ్ఛ ఉల్లంఘన ఘటనలను నమోదు కాగా, ఆ నివేదికను సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో విడుదల చేశారు.

* కాంగ్రెస్‌ పార్టీ చలో సచివాలయం పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు ఉదయం నుంచే కాంగ్రెస్‌ నేతలను ఇళ్లకే పరిమితం చేస్తూ గృహనిర్బంధంలో ఉంచారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క సచివాలయానికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు రావడంతో అదుపులోకి తీసుకుని ఇంట్లోకి పంపించారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడారు. తాము ప్రజల పక్షాన ఏం మాట్లాడినా పాలకులు నిర్బంధం కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.

* భారత్‌లో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక పూరీ జగన్నాథ రథయాత్ర. అయితే ఈ నెల 23న జరగాల్సిన పూరీ జగన్నాథ రథయాత్ర నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో లక్షలమంది తరలివచ్చే జగన్నాథ యాత్ర ఈ ఏడాది యథావిధిగా ఉంటుందా? ఒక వేళ ఉంటే ఎలా నిర్వహిస్తారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, యాత్రను యథావిధిగా నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు చెబుతున్నా.. లక్షల మంది రాక నేపథ్యంలో కరోనా ప్రబలే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది.

* పుణెలోని ఎరవాడసంజయ్‌ పార్క్‌ వద్ద అంతర్జాతీయ నకిలీనోట్ల రాకెట్‌ గుట్టును పుణె పోలీసులు, ఆర్మీ ఇంటెలిజెన్స్‌ అధికారులు రట్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో స్వాధీనం చేసుకున్న నకిలీనోట్ల మొత్తం విలువ రూ.87కోట్లుగా తేలింది. పుణె విమానాశ్రయానికి సమీపంలోని ఓ బంగ్లాలో పెద్ద సంఖ్యలో నకిలీనోట్లు ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు.

* దేశీయ స్టాక్‌మార్కెట్లు మరోసారి భారీ నష్టాలను చవి చూశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఏకంగా 708 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 214 పాయింట్లు నష్టపోయింది. అంతర్జాతీయ స్టాక్‌మార్కెట్ల ప్రభావం, యూఎస్‌ జీడీపీ 6.5శాతం క్షీణిస్తుందన్న ఫెడ్‌ అంచనాలకు తోడు సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) బకాయిలకు సంబంధించి స్వీయ మదింపు చేసుకోవడంపై విచారణను సుప్రీంకోర్టు జూన్‌ 18కి వాయిదా వేయడం మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది.