Kids

లాక్‌డౌన్ కారణంగా 18లక్షల అబార్షన్లు

లాక్‌డౌన్ కారణంగా 18లక్షల అబార్షన్లు

కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఆస్పత్రులన్ని కరోనా రోగుల చికిత్సకే అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ కాలంలో దేశవ్యాప్తంగా 18.5 లక్షల అబార్షన్‌లు గైనకాలజిస్ట్‌ సలహా లేకుండానే జరిగాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. మహిళలల్లో సురక్షిత, చట్టబద్ధమైన అబార్షన్ల గురించి అవగాహన కల్పించే ఐపాస్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌(ఐడీఎఫ్‌) ఈ సర్వేను నిర్వహించింది. లాక్‌డౌన్‌ మొదటి మూడు దశల్లో మహిళలకు అందిన వైద్య సౌకర్యాలపై ఈ సర్వే దృష్టి పెట్టింది. లాక్‌డౌన్‌1, 2 దశల్లో(మార్చి 25 నుంచి మే 3 వరకు) 59 శాతం మహిళలకు అబార్షన్‌ అంశంలో ఆస్పత్రికి వెళ్లడం, వైద్యులను కలవడం వంటి సదుపాయాలు లభించలేదని తెలిపింది. అన్‌లాక్‌ దశలో ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందని.. ఈ సంఖ్య 33 శాతానికి పడిపోయిందని సర్వే తెలిపింది. ఈ క్రమంలో ఐడీఎఫ్‌ సీఈఓ వినోజ్ మానింగ్ మాట్లాడుతూ.. ‘18.5 లక్షల మంది మహిళలకు అబార్షన్‌ విషయంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో.. కెమిస్ట్‌ అవుట్‌లెట్లలో అవసరమైన సౌకర్యాలు, సదుపాయాలు లభించలేదు. కరోనా మహమ్మారిగా మారినందున వైద్య సిబ్బంది పూర్తి శ్రద్ధ, కృషి వైరస్ నియంత్రణ మీదనే ఉంది. ఫలితంగా మిగతా వైద్య సేవలు, ముఖ్యంగా సురక్షితమైన గర్భస్రావం వంటి సేవలకు అంతరాయం కలిగింది. మెజారిటీ ప్రజారోగ్య సౌకర్యాలు, వైద్య సిబ్బంది కోవిడ్‌-19 చికిత్సలపై దృష్టి సారించారు.మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులు మూసివేశారు. దాంతో సురక్షితమైన గర్భస్రావం పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి’ అని తెలిపారు. అంతేకాక ‘ఇది చాలా సున్నితమైన అంశం. సురక్షితమైన గర్భస్రావ సేవలను కోరుకునే మహిళలను లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎలా ప్రభావితం చేశాయో తెలపడమే గాక.. రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఈ విషయంలో దృష్టి కేంద్రీకరించేందుకు వీలుగా ఈ అధ్యయనం జరిగింది అని వినోజ్‌ మానింగ్‌ తెలిపారు.