NRI-NRT

లాక్‌డౌన్ కావాలని కోరుకుంటున్న 74శాతం

లాక్‌డౌన్ కావాలని కోరుకుంటున్న 74శాతం

కరోనా వైరస్‌ భారత్‌లో రోజురోజుకీ ఉద్ధృతం రూపం దాలుస్తోంది. ఇప్పటికే పాజిటివ్‌ కేసులు 3.3లక్షలు దాటేశాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 18 నుంచి దేశవ్యాప్తంగా మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో గత కొంతకాలంగా పెద్ద ఎత్తున చెలరేగిన ఊహాగానాలను కేంద్ర ప్రభుత్వం కొట్టివేసిన విషయం తెలిసిందే. మరోవైపు, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీలు కూడా తమ రాష్ట్రాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించే ఆలోచనలో లేమంటూ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తమిళనాడు ప్రభుత్వం కరోనా వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న చెన్నై సహా నాలుగు జిల్లాల్లో ఈ నెల 19 నుంచి 30 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారా? లేదా? అనే గందరగోళం ప్రజల్లో నెలకొంది. రేపు, ఎల్లుండి రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనాధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కరోనా కట్టడిపై కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే అంశంపై దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ‘లోకల్‌ సర్కిల్స్‌’ అనే ఓ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వేలో మాత్రం జనం మళ్లీ లాక్‌డౌన్‌కే జైకొట్టారు. దేశంలోని 221 జిల్లాల నుంచి మొత్తం 46వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. దేశంలో రోజుకు సుమారు 11 వేల కేసులు వస్తున్న నేపథ్యంలో అధిక వైరస్‌ ప్రభావం ఉన్న 15 జిల్లాల్లో నెల పాటు మళ్లీ లాక్‌డౌన్‌ విధించడం అవసరమని భావిస్తున్నారా? అని ఈ సర్వేలో అడిగిన ప్రశ్నకు 74శాతం మంది లాక్‌డౌన్‌ పెట్టాల్సిందేనని అభిప్రాయం వ్యక్తంచేయగా.. 22శాతం మంది అవసరం లేదని.. మిగతా 4శాతం మంది చెప్పలేం అని పేర్కొన్నారు.

మే 3న ఇదేరకమైన ప్రశ్న అడగ్గా 74శాతం మంది లాక్‌డౌన్‌ విధించాలని అనగా.. మే 12 నాటికి ఈ అభిప్రాయం 45శాతానికి తగ్గిపోయింది. అలాగే, మళ్లీ మే 28నాటికి 72శాతానికి పెరగ్గా.. జూన్‌ 12 అడిగిన ఈ ప్రశ్నకు 74శాతం మంది అత్యధిక కేసులు నమోదవుతున్న జిల్లాల్లో ఈ వైరస్‌ కట్టడికి లాక్‌డౌన్‌ విధించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే దేశంలో ముంబయి, దిల్లీ, చెన్నై, అహ్మదాబాద్‌, ఠానే, పుణె, ఇండోర్‌, కోల్‌కతా, జైపూర్‌, సూరత్‌, హైదరాబాద్‌, ఔరంగాబాద్‌, జోధ్‌పూర్‌, గురుగ్రామ్‌, చెంగల్‌పట్టు నగరాల్లో ఈ వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు నీతి ఆయోగ్‌ గుర్తించింది.

వారంలో 100కు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న జిల్లాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అంటూ అడిగిన ప్రశ్నకు ఈ సర్వేలో 59శాతం పాక్షిక లాక్‌డౌన్‌ పెట్టాలని అభిప్రాయపడ్డారు. అలాగే, 23శాతం పూర్తి లాక్‌డౌన్‌ పెట్టాలని అభిప్రాయపడగా.. 14శాతం మంది లాక్‌డౌన్‌ అవసరం లేదనీ.. మిగతా 4శాతం మంది ఏమీ చెప్పలేం అని పేర్కొన్నారు. అయితే, ఈ సర్వేలో వచ్చిన అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు పలు రాష్ట్రాల సీఎస్‌లకు కూడా పంపినట్టు సర్వే సంస్థ తెలిపింది.