Devotional

తలుపులమ్మవారి ప్రాముఖ్యత తెలుసుకుందాం

తలుపులమ్మవారి ప్రాముఖ్యత తెలుసుకుందాం

శ్రీ శ్రీ శ్రీ తలుపులమ్మ అమ్మవారు- తలుపులమ్మ లొవ, తుని మండలం, తూర్పు గోదావరి జిల్లా,ఆంధ్రప్రదేశ్

అమ్మవారు ‘తలుపులమ్మ’ గా ఆవిర్భవించిన క్షేత్రమే ‘లోవ’. అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఈ ప్రదేశం తలుపులమ్మ లోవగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు దట్టమైన అరణ్యంగా చెప్పబడుతోన్న ఈ ప్రాంతంలో ఎటుచూసినా కొండలు దర్శనమిస్తుంటాయి. ఈ కొండలలో ఒకదానిని ‘ధారకొండ’ గానూ మరొక దానిని ‘తీగకొండ’ గా స్థానికులు పిలుస్తుంటారు. ఈ రెండు కొండల మధ్య ‘తలుపులమ్మ’ అమ్మవారు దర్శనమిస్తూ వుంటుంది. తలపులను నెరవేర్చు అమ్మవారు కనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్టు స్థల పురాణం చెబుతోంది.

పురాణ గాథ::

కృతయుగంలో ఈ ప్రాంతానికి చేరుకున్న అగస్త్య మహర్షి, సంధ్యావందనం చేసుకోవాలనుకోగా ఎక్కడా నీటిజాడ కనిపించలేదు. దాంతో ఆయన జగన్మాతను ప్రార్థించగా, కొండపైన పాతాళ గంగ పొంగింది. సంధ్యా వందనం పూర్తి చేసుకున్న అగస్త్యుడు, ఈ ప్రాంతంలోనే కొలువై ఉండమని అమ్మవారిని కోరడంతో, ఆయన అభ్యర్ధనమేరకు అమ్మవారు ఇక్కడి కొండగుహలో కొలువుదీరింది.

కాలక్రమంలో అమ్మవారు భక్తుల కోరికలను నెరవేరుస్తూ తలుపులమ్మగా పూజాభిషేకాలు అందుకుంటోంది. ఇక్కడి అమ్మవారు సకల శుభాలను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువైన ఇక్కడి అమ్మవారిని దర్శించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. వెలమకొత్తూరు గ్రామం దగ్గరలో ఉంటుంది.

పూజ మరియు పండగలు
ప్రతి ఏటా చైత్ర మాసం (ఏప్రియల్/ మార్చ్), ఆషాఢ మాసం (జూన్/జులై) లో దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. బహుళ విదియ, తదియ రోజులలో ప్రత్యేక పూజలు జరుపుతారు. ఇక్కడ వేడుకలు సుమారు 15 రోజులపాటు వైభవంగా జరుగుతాయి. సందర్శించు సమయం : సాయంత్రం ఆరు గంటల వరకే గుడి తెరుస్తారు.