Politics

దేశ భద్రతపై రాజీ వీలుకాదు

దేశ భద్రతపై రాజీ వీలుకాదు

దేశ రక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడొద్దని, దేశమంతా ఒక్కతాటిపై నిలవాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, రాష్ట్ర ప్రజల మద్దతు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని కేసీఆర్‌ స్పష్టంచేశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో భారత్‌- చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణ అంశాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. చైనా గానీ, మరే ఇతర దేశంగానీ భారత సార్వభౌమత్వం విషయంలో వేలు పెడితే తప్పక ప్రతిఘటించాలన్నారు. వారికి తగిన సమాధానం చెప్పాలని చెప్పారు. దేశ రక్షణ విషయంలో ఎవరూ రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు. దేశమంతా ఒక్కతాటిపై నిలవాల్సిన సమయమని అభిప్రాయపడ్డారు. సమీక్ష ప్రారంభంలో ప్రధాన మంత్రితో పాటు, అందరు ముఖ్యమంత్రులు గాల్వన్‌ ఘర్షణలో చనిపోయిన సైనికులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు.