Food

లీచీ పండ్లతో మెదడువాపు రావచ్చు

లీచీ పండ్లతో మెదడువాపు రావచ్చు

లిచీ పండ్లు తింటున్నారా? జాగ్రత్త.. ప్రాణాలు పోతాయ్!

లిచీ పండ్లు భలే అందంగా.. రుచిగా ఉంటాయి. అలాగని అదే పనిగా వాటిని తినడం మొదలుపెడితే.. ప్రాణాలకే ప్రమాదకరం కావచ్చు. ఎందుకో చూడండి.

స్ట్రాబెరీ రూపంలో అందంగా మెరిసిపోయే లిచీ పండ్లు భలే రుచిగా ఉంటాయి. కానీ, ఈ పండ్లతో ప్రమాదం కూడా పొంచి ఉంది. దీన్ని ఎంతో ఇష్టంగా తినేవారికి ఇది దుర్వార్తే. కొద్ది నెలల కిందట బీహార్‌లో చిన్నారులు లిచీ పండ్లు తిని ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు కారణం ఆ పండ్లలో ఉండే ప్రమాదకర రసాయనాలే అని తేలింది. అవి ప్రత్యేకంగా కలిపే రసాయనాలు కాదు. ఆ పండ్లలో సహజ సిద్ధంగా ఉండే రసాయనాలు. అయితే, లిచీ పండ్లు తినేవారంతా ఎందుకు చనిపోవడం లేదనే సందేహం మీకు కలగవచ్చు. ఈ అనుమానం తీరాలంటే.. లిచీ పండ్ల గుర్తించి పూర్తిగా తెలుసుకోవల్సిందే.

ఖాళీ కడుపున తింటే ప్రమాదం

సాధారణ పండ్లతో పోల్చితే లిచీలు చాలా భిన్నమైనవి. వీటిని ఖాళీ కడుపున (పరగడుపున) అస్సలు తినొద్దు. పచ్చిగా ఉండే లిచీ పండ్ల జోలికి అస్సలు వెళ్లొద్దు. ఇటీవల కొంతమంది వ్యాపారులు పచ్చి లిచీ పండ్లకు ఎర్ర రంగు వేసి అమ్మేస్తున్నారు. వాటిని తింటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. రాత్రులు నిద్రపోయే ముందు, ఉదయం ఖాళీ కడుపున లిచీ పండ్లను తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు వీటిని దూరంగా ఉంచడం చాలా మంచిదని చెబుతున్నారు.

మెదడు వాపుకు దారి తీయొచ్చు

లిచీ పండ్లలో ఉండే ఎక్యూట్‌ ఎన్‌సెఫలైటిస్‌ సిండ్రోమ్‌ (AES) వల్ల మెదడువాపు వ్యాధి కలిగిస్తాయని తేలింది. మెదడు వాపును శాస్త్రీయంగా ‘ఎన్‌సెఫలైటిస్’ అని అంటారు. లిచీ పండ్లలో ఉండే విషతుల్య పదార్థం వల్ల ఈ వ్యాధి సోకుతున్నట్లు వైద్యులు కనుగొన్నారు. అలాగే, ఉష్ణోగ్రతలు కూడా లిచీ పండ్లను విషతుల్యం చేస్తాయని ముజాఫర్‌పూర్‌లోని శ్రీకృష్ణ మెడికల్ కాలేజ్‌లోని సీనియర్ డాక్టర్ గోపాల్ శంకర్ సహానీ పేర్కొన్నారు. ఆయన 1995లో దీనిపై పరిశోధనలు చేశారు. గాలిలో తేమ శాతం తగిన స్థాయిలో ఉంటే మెదడు వాపు రావచ్చని తెలిపారు. ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు ఉండి తేమ 65 నుంచి 80 శాతం ఉన్నట్లయితే లిచీలు ఆరోగ్యానికి హాని చేస్తాయన్నారు.

ఆ ప్రమాదకర రసాయనంతో మరింత ముప్పు

లిచీ పండ్లలో ఉండే ‘హైపో‌గ్లైసెమిక్ ఎన్‌సెఫాలోపతీ’ వల్ల రక్తంలో చక్కెర శాతం ప్రమాద స్థాయికి పడిపోతుంది. ఇందులోని మిథిలెన్ సైక్లోప్రోపిల్-గ్లైసిన్ (MCPG) రసాయనం వల్లే ఈ ముప్పు ఏర్పడుతుంది. ఖాళీ కడుపుతో ఉన్నా లేదా పౌష్టికాహార లోపం ఉన్నా శరీరంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఆ సమయంలో లిచీ పండ్లను తిన్నట్లయితే అందులో ఉండే MCPG మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. గతేడాది ముజాఫర్‌పూర్‌లో చనిపోయిన చిన్నారుల్లో కూడా వైద్యులు ఇదే సమస్యను గుర్తించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఏడుగురు సభ్యుల బృందం దీన్ని ధృవీకరించారు.

సుగర్ స్థాయిలు పడిపోడిపోతాయి

వెల్లూరుకు చెందిన పిల్లల వైద్య నిపుణుడు, ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ టి.జాకబ్ జాన్ బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పత్రిక ‘కరంట్ సైన్స్’లో లిచీ పండ్లు శరీరంపై చూపే దుష్పరిణామాల గురించి చెప్పారు. 2013లో జరిపిన పరిశోధనల్లో లిచీ పండ్ల గింజలు విషతుల్యమైనవని తేలిందని, వాటిని తినడం వల్ల శరీరంలో హైపో‌గ్లైసెమిక్ ఏర్పడి సుగర్ స్థాయిలు పడిపోతాయని తెలిపారు. పండినవైనా, పచ్చివైనా ప్రమాదకరమేనని, వీటిని అతిగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదన్నారు. అలాగే, గర్భంతో ఉండే మహిళలు ఈ పండ్లను తినకపోవడమే శ్రేయస్కరం.

లీచీ పండ్ల ఆరోగ్య ప్రయోజనాలు

ఏదైనా సరే మితంగా తినడమే మంచిది. లిచీ పండ్లను అతిగా కాకుండా కొద్ది కొద్దిగా తీసుకుంటేనే శరీరం కూడా అందులోని పోషకాలను చక్కగా గ్రహిస్తుంది. అప్పుడే ఈ కింది ఆరోగ్య ప్రయోజనాలు మీకు లభిస్తాయి. ❂ రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా లిచీలో ఉన్నాయి. ❂ జీర్ణ సమస్యలను తీర్చడంలోనూ లిచీ బాగా పనిచేస్తుంది. ❂ ఆస్తమా, ఉబ్బసం వంటి దీర్ఘకాలిక వ్యాధుల నివారణకూ లిచీ మంచిదే. ❂ లిచి పండ్లను తింటే బరువు కూడా తగ్గుతారు. ❂ గుండెను ఆరోగ్యం ఉంచేందుకు అవసరమైన పాలిపినాల్స్ లిచీలో అధికంగా ఉన్నాయి. ❂ పాలిపినాల్స్ క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా అరికడతాయి. ❂ లిచీ పండ్లు తినడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్‌ సమస్య ఉండదు. ❂ లిచి పండ్లలోని విటమిన్-C ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తుంది. ❂ తెల్ల రక్త కణాల పనితీరును మెరుగు పరిచేందుకు లిచీ సహకరిస్తుంది. ❂ శరీరంలోని బాక్టీరియాలు, వైరస్‌లను నానశనం చేస్తుంది. 

గమనిక: వైద్య నిపుణుల సూచనలు, పరిశోధనలు ఆధారంగా ఈ సమాచారాన్ని మీకు అందించాం. మీకు పండ్ల వల్ల అలర్జీలు, మరే ఇతర సమస్యలు ఉన్నా.. తప్పకుండా వైద్యుల సూచనలు తీసుకోవాలి. ఈ వివరాలను కేవలం మీ అవగాహన కోసమే అందిస్తున్నామనే విషయాన్ని గమనించగలరు