Agriculture

₹3500 లంచం తీసుకుని పని చేయని తహశీల్దార్. రైతు ఆత్మహత్య.

Peddapalli Farmer Commits Suicide Due To Bribery

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో కలకలం రేపింది. తన భూమికి తన పేరుతో పట్టా ఇవ్వడం లేదని ఆరోపిస్తూ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరామ్‌పూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మందల రాజిరెడ్డి అనే రైతు శనివారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాజిరెడ్డి(65) గత కొద్ది నెలలుగా కాల్వశ్రీరామ్‌పూర్‌లో ఉన్న వ్యవసాయ భూమికి తన పేరిట పట్టా ఇవ్వాలని తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. తన తండ్రిపేరుతో ఉన్న 1.20 ఎకరాల భూమిని తన పేరుమీద మార్పిడి చేయాలని రెవెన్యూ అధికారులకు రూ.3500 ఇచ్చానని, అయినా పట్టా చేయకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖ రాశాడు. తన చావుకు తహసీల్దార్‌ వేణుగోపాల్‌, వీఆర్వో గురుమూర్తి, వీఆర్‌ఏ స్వామి కారణమంటూ సుసైడ్‌ లేఖ రాసి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.