Health

యోగా…ఆరోగ్య యాగం

TNILIVE Yoga Day Specials || The Power of Yoga In Daily Life

మన భారతీయ ప్రాచీన ఆరోగ్య విద్య యోగా ద్వారా కరోనాను అల్లంత దూరంలో ఉంచడం సాధ్యమే అంటున్నారు సాధకులు! అంతర్జాతీయ యోగా దినోత్సవమైన ఈ రోజు (జూన్‌ 21, ఆదివారం)న ఒక్కసారి.. ఆధునిక సైన్స్‌ కూడా నిర్ధారించిన యోగాసన ప్రయోజనాలు ఏమిటో?.. కరోనాను అడ్డుకునేందుకు, రోగ నిరోధకశక్తిని పెంచుకునేందుకు ఏం చేయాలో చూద్దామా?
***జూన్‌ 21.. అంతర్జాతీయంగా భారత ఖ్యాతి ఇనుమడించే రోజిది. దేశదేశాల్లో చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా కొన్ని కోట్లమంది యోగాసనాలు ఆచరించే రోజు. ప్రాచీన భారతీయ సంస్కృతిని కొనియాడే రోజు. ఆరేళ్ల క్రితం ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్ణయించింది మొదలు ఏటికేడాది దీని ప్రాభవం, ప్రాముఖ్యత పెరుగుతూనే ఉన్నాయి. భారత ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ యోగా దినోత్సవాలకు పిలుపునివ్వడం ఒక విశేషమైతే.. ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం దీన్ని గుర్తించి అందరూ యోగా ద్వారా స్వస్థత పొందాలని కోరడం ఇంకో విశేషం. అయితే ప్రస్తుత కరోనా కష్టకాలంలో మునుపటిలా బహిరంగంగా యోగాసనాలు వేయడం సాధ్యం కాకపోవచ్చుగానీ.. వర్చువల్‌ యోగా దినోత్సవాలకు మాత్రం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
***‘‘ఆరోగ్యం కోసం యోగా.. ఇంట్లోనే యోగా’’ అనే ఇతివృత్తంతో ఈ రోజు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ కల్చరల్‌ రీసెర్చ్‌తో కలిసి ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఓ వీడియో బ్లాగింగ్‌ పోటీని కూడా ఏర్పాటుచేసింది. ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ‘‘ఇంట్లోనే యోగా.. కుటుంబంతో కలిసి యోగా’ పేరుతో ఇప్పటికే ప్రచారం చేపట్టింది. ఆదివారం ఉదయం 6.30 నిమిషాలకు దూరదర్శన్‌ చానల్‌లో ఓ యోగ సాధన కార్యక్రమాలు ప్రసారం కానున్నాయి. అలాగే మైసూరు జిల్లా యంత్రాంగం, ఇంటర్నేషనల్‌ నేచురోపతి ఆర్గనైజేషన్లు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాయి. కర్ణాటకలోని పుణ్యక్షేత్రం ధర్మస్థలలో ఉదయం ఏడు గంటలకు యోగాభ్యాసం మొదలుకానుంది. అంతర్జాతీయ స్థాయిలో చూస్తే అమెరికాలోని టెక్సాస్‌తోపాటు అనేక ఇతర రాష్ట్రాల వారికి యోగా పాఠాలను బాబా రామ్‌దేవ్‌ ఆన్‌లైన్‌ ద్వారా అందించనున్నారు. హ్యూస్టన్‌లోని భారతీయ కౌన్సిల్‌ జనరల్‌ ఉదయం పది గంటలకు రెండు గంటల లైవ్‌ యోగా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. టెక్సాస్‌లోని సాన్‌ఆంటోనియోలో రోజంతా యోగథాన్‌ జరగనుంది. నెదర్లాండ్స్‌ పోలీస్‌ విభాగం కూడా ఆన్‌లైన్‌ మాధ్యమంలో యోగాసనాలను ప్రదర్శించనున్నట్లు సమాచారం.
***సైన్స్‌ చెప్పే యోగా లాభాలు…
మానసిక ఒత్తిడికి కారణమైన హార్మోన్‌ కార్టిసోల్‌ మోతాదులను తగ్గించేందుకు యోగా ఉపయోగపడుతుందని శాస్త్రీయంగా నిర్వహించిన అధ్యయనాలు చెబుతున్నాయి. ధ్యానం వంటివాటిని కలిపి యోగా ఆచరిస్తే మరిన్ని మెరుగైన ఫలితాలుంటాయని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. మెదడును శాంతపరిచేందుకు ఉపయోగపడే సెరటోనిన్‌ ఉత్పత్తిని పెంచుతుంది కాబట్టి మనో వ్యాకులతకూ యోగా మంచి మందని అధ్యయనాలు చెబుతున్నాయి. తాగుడు వ్యసనాన్ని మాన్పించేందుకు జరిపిన ఒక కార్యక్రమంలో సుదర్శన క్రియ యోగాను అభ్యాసం చేయించినప్పుడు వారిలో మనో వ్యాకులతకు సంబంధించిన లక్షణాలు బాగా తగ్గిపోయాయి.వారానికి కనీసం రెండు రోజుల చొప్పున రెండు నెలలపాటు యోగా కొనసాగిస్తే మానసిక ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇదంతా ఎలా జరుగుతుందో మాత్రం శాస్త్రవేత్తలకూ అంతుపట్టకపోవడం గమనార్హం.
***వారానికి కనీసం రెండు రోజుల చొప్పున రెండు నెలలపాటు యోగా కొనసాగిస్తే మానసిక ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇదంతా ఎలా జరుగుతుందో మాత్రం శాస్త్రవేత్తలకూ అంతుపట్టకపోవడం గమనార్హం. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా కూడా తోడైతే గుండె జబ్బులు సోకే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. యోగాభ్యాసం చేసే వారి రక్తపోటు, పల్స్‌ రేట్‌ ఇతరుల కంటే తక్కువగా ఉన్నట్లు ఒక అధ్యయనం స్పష్టం చేయగా గుండెజబ్బులు ముదరకుండా కూడా యోగా రక్షణ కల్పిస్తుందని ఇంకో పరిశోధన ద్వారా తెలుస్తోంది.
*నిస్సత్తువ, భావోద్వేగాలను మెరుగుపరిచేందుకు యోగా మేలైన మార్గమని పరిశోధనలు చెబుతున్నాయి. 135 మంది వయోవృద్ధులపై జరిగిన ఒక పరిశోధనలో యోగాభ్యాసం చేసే వారి జీవన నాణ్యత ఇతరుల కంటే మెరుగ్గా ఉన్నట్లు స్పష్టమైంది. అంతేకాకుండా కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించేందుకూ యోగా పనికొస్తుంది. కీమోథెరపీ చేయించుకున్న వారు యోగా సాధన చేస్తే వాంతులు, తలతిరుగుడు వంటి దుష్ఫలితాలు తగ్గుతాయని, నొప్పి తగ్గడమే కాకుండా చురుకుదనమూ పెరుగుతుందని తేలింది. అలాగే హాయిగా నిద్రపోవాలన్నా యోగా ప్రాక్టీస్‌ చేయడం మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఊబకాయం, అధిక రక్తపోటు, మనో వ్యాకులత వంటి లక్షణాల కారణంగా నిద్రలేమి సమస్య ఎదుర్కొన్న వారు యోగాభ్యాసం మొదలుపెట్టిన తరువాత ఎంతో ఉపశమనం పొందారని 2005 నాటి అధ్యయనం ఒకటి చెబుతోంది. సుఖనిద్రకు కారణమైన మెలటొనిన్‌ హార్మోన్‌ అధికోత్పత్తికి యోగా కారణమవుతుందని అంచనా.
***రోగ నిరోధక శక్తికి ఆరు ‘యోగాలు’
ఈ కరోనా కాలంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు యోగ సాధన ద్వారా కూడా రోగ నిరోధకశక్తిని కాపాడుకోవచ్చు. సలంబ భుజంగాసనం, పరివృత్త ఉత్కటాసనం, అనువిత్తాసన, గరుడాసన, త్రికోణాసనం, ఆనంద బాలాసనం వంటి ఆరు యోగాసనాలు రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.
*సలంబ భుజంగాసనం
సలంబ భుజంగాసనం నేరుగా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. బొక్కబోర్లా పడుకుని నడుము పైభాగాన్ని నిటారుగా ఉంచడం ఈ ఆసనంలోని ముఖ్యాంశం. ఈ క్రమంలో ముంజేతుల వరకు నేలపై ఆనించి ఉంచాలి. ముక్కు ద్వారా ఊపిరిపీల్చాలి. నోటి ద్వారా వదలాలి.
*పరివృత్త ఉత్కటాసనం
సాధారణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మూత్రపిండాలు, జీర్ణావయవాలను మెలితిప్పడం ద్వారా శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోయేలా చేస్తుంది. కాళ్లను కొద్దిగా వంచి చేతులు జోడించి నడుము భాగాన్ని ఒకవైపునకు తిప్పి పైకి చూడటం ఈ యోగాసనంలో కనిపిస్తుంది. మోచేతులను తొడలకు తాకుతూ ఉండాలి. సాధారణ స్థితికి వచ్చే సమయంలో ఊపిరి వదలాలి.
*అనువిత్తాసనం
అనువిత్తాసనం.. ఇది శరీరంలోని కొన్ని గ్రంథులను శుద్ధి చేస్తుంది. శ్వాసవ్యవస్థను చైతన్యపరిచేందుకూ ఈ యోగాసనం పనికొస్తుంది. నడుము కింది భాగంలో రెండు చేతులు ఉంచుకుని వీలైనంత వరకూ వెనక్కి వంగడమే ఈ అనువిత్తాససనం. ఊపిరి తీసుకుంటూ వెనక్కి వంగడం.. అదే స్థితిలో కొంత సమయం ఉండటం ఆ తరువాత ఊపిరి వదులుతూ నెమ్మదిగా సాధారణ స్థితికి రావడం ఈ ఆసన క్రమం.

###############

ప్రపంచానికి భారతదేశం అందించిన అపూర్వమైన కానుక యోగా. దైనందిన జీవితంలో మనం ఉపయోగించే ‘యోగా’ అనే మాటకు ప్రాచీనమైన ఆధ్యాత్మిక నేపథ్యం ఉంది. చిత్తవృత్తుల్ని నిరోధించడం యోగమని పతంజలి యోగసూత్రం చెబుతోంది. మనోనాశనానికి, వాసనాక్షయానికి చేసే పురుష ప్రయత్నం యోగమని, జీవాత్మ పరమాత్మల ఐక్యం యోగమని భగవద్గీత పేర్కొంటున్నది. మనిషి బంధానికి గాని, మోక్షానికి గాని కారణం మనసే. ఆ మనసును అదుపులో పెట్టుకోవడానికి మన రుషులు నిర్దేశించిన అనేక మార్గాల్లో ప్రధానమైనది యోగదర్శనం.
శరీరం పరిశుభ్రంగా, రోగరహితంగా, దృఢంగా ఉండేటట్లు చూసుకోవాలి. మనసుకు పట్టిన మాలిన్యాన్ని తొలగించుకోవాలి. మన దేహం, మనసు రెండూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్య చక్కని సమన్వయం నెలకొని మనిషి సంపూర్ణ వ్యక్తిత్వం గలవాడిగా రూపొందుతాడు. యోగదర్శనంలోని అష్టాంగ యోగమార్గం అతి సామాన్యుడికి కూడా కైవల్య సాధనకు అనువైన మార్గంగా యోగశాస్త్ర పండితులు చెబుతున్నారు.

శరీరంలోని వివిధ అంగాలు ఎలా కలిసి పని చేస్తున్నాయో, అదే విధంగా అష్టాంగయోగం అంటే ఎనిమిది అంగాలు విడివిడిగా, సమైక్యంగా పనిచేస్తున్నాయి. ఆ అంగాలు యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి. యమ నియమాలు సమాజ శ్రేయస్సుకు; ఆసనాలు దేహ దారుఢ్యానికి; ప్రాణాయామ ప్రత్యాహారాలు మానసిక వికాసానికి; ధారణ, ధ్యాన, సమాధులు ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదం చేస్తాయి. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం అనే విధులు ఆచరిస్తే మనోవాక్కర్మల్లో పరిశుద్ధత కలుగుతుంది. ఇతరుల పట్ల ద్వేషభావం నశించి, నిర్మలదృష్టితో చూడగలుగుతాం. ఇంద్రియ నిగ్రహం అలవడుతుంది.

శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అనే అయిదింటినీ నియమాలంటారు. ఇవి కూడా వ్యక్తుల నిత్య కృత్యాలకు సంబంధించినవే. సద్గుణాలు మనసులో చోటు చేసుకుని అంతఃశౌచం, శరీరాన్ని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంవల్ల బాహ్యశౌచం నెలకొంటాయి. దుఃఖానికి తావివ్వకుండా సంతృప్తితో జీవించడమే సంతోషం. శరీరం యథేచ్ఛగా సంచరించకుండా నిరోధిస్తూ నిశ్చలమైన మనసును దైవం మీద కేంద్రీకరించి చేసేది తపస్సు.

వేదాధ్యయనం, సద్గ్రంథ పఠనాలను స్వాధ్యాయం అంటారు. సర్వ కర్మల్నీ ఈశ్వరార్పణ గావించడం, స్వస్థ చిత్తంతో ఉండగలగడం ఈశ్వర ప్రణిధానం.

యోగం అనగానే మనకు గుర్తుకు వచ్చేవి ఆసనాలు. స్థిరంగా, సుఖంగా ఉండేది ఆసనం. రోగ నివారణకు, నిరోధానికి, ఆరోగ్యప్రాప్తికి ఆసనాలు ఉపకరిస్తాయి. యోగంలో ప్రాణాయామం కీలకమైన అంగం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మన అధీనంలో ఉంచుకోవడం ప్రాణాయామం. ప్రాణమంటే జీవం, శక్తి. ఆయామమంటే వాయువులో విరామం కలగజేయడం ద్వారా ప్రాణ విస్తరణ. శరీరంలోని నాడుల్ని శుద్ధి చేయడానికి, శరీర భాగాలు ఉత్తేజితం కావడానికి, మానసిక ఒత్తిడి దూరం కావడానికి ప్రాణాయామం అవసరం.

శరీరం, ప్రాణం, మనసుల ఏకీకరణ- తద్వారా భగవంతుణ్ని ప్రార్థించడం నిజమైన ధ్యానం. జీవాత్మ పరమాత్మల ఐక్య సంబంధం వల్ల ఇతర సమస్త సంకల్పాలు నశించి ఏర్పడే నిర్వికార స్థితి సమాధి. యోగానికి సంబంధించిన శారీరక, మానసిక ప్రక్రియలు రెండూ వ్యక్తి సమగ్ర వికాసానికి తోడ్పడతాయి. మితమైన, హితమైన ఆహార సేవనంతో పాటు యోగ సాధన చేస్తే మనిషి ఆలోచనల్లో మార్పు వస్తుంది. సమాజోపయోగకర గుణాలు పెంపొందుతాయి. నిత్య జీవితంలో యోగాభ్యాసాన్ని ఒక వ్యాసంగంగా అలవాటు చేసుకోవడం మేలైన జీవన విధానం.