Devotional

ఆషాఢ మాసం విశిష్టత ఇది

ఆషాఢ మాసం విశిష్టత ఇది

ఆషాఢ మాసము..విశిష్టత

పూర్వాషాడ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలయే ఆషాడ మాసం. ఇది సంవత్సరములో 4 వ మాసం. దీనిని శూన్య మాసమని కూడా అంటారు. వర్షఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. పౌర్ణమినాడు చంద్రుడు ఉత్తరాషాఢ/పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటకరాశి లోనికి ప్రవేశిస్తాడు. దాంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజును గురుపౌర్ణమిగా వ్యవహరిస్తారు.

ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు, విశేష ఫలితాన్నిస్తాయి. ఆషాడంలో చేసే సముద్ర నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు.

ఆషాఢమాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం శుభకరం. ఆషాడ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించడం తోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది.

వేదం ప్రకారం చూసినా ‘అన్నం బహుకుర్వీత’ అంటోంది. వ్యవసాయదారుని కృషికి అండగా భగవంతుని అనుగ్రహం తోడై వర్ష రూపంగా, ఎక్కువ పరిమాణంలో ధాన్యం పండి, ఎవరికీ జనులకి ఆకలి బాధ లేకుండా ఉండాలని పరమార్ధం.

ఈ శూన్యమాసంలో..

‘ఆషాఢ శుద్ధ విదియనాడు’ పూరీ జగన్నాధ రధయాత్ర.

ఆషాఢ శుద్ధ పంచమి ‘స్కంధ పంచమి’గా

ఆషాఢ శుద్ధ షష్టి ‘స్కంద వ్రతము – సృమతి కౌస్తుభం’ ఈనాడు వ్రతములో సుబ్రహ్మణ్యేశ్వరుని షోడపచారాలతో పూజ చేస్తారు. ఉపవాసం వుండాలి.

జలం మాత్రమే పుచ్చుకోవాలి. కుమార స్వామిని దర్శించాలి.

ఆషాడ శుద్ధ సప్తమి – మిత్రాఖ్య భాస్కర పూజ అని నీలమత పురణము.

ద్వాదశ సప్తమీ వ్రతము.

చతుర్వర్గచింతామణి.

ఆషాడ శుద్ధ అష్టమి

మిహషఘ్ని పూజ, సృ్మతి కౌస్తుభం

ఆషాడ శుద్ధ నవమి – ఐంద్రదేవి పూజ

ఆషాడ శుద్ధ దశమి – శాకవ్రత మహాలక్ష్మి వ్రతారంభము.

ఆషాఢ శుద్ధ దశమి.. మహలక్ష్మి వ్రతం..

ఈ రోజును మహాలక్ష్మి వ్రతారంభంగా చెప్తారు. దధి వ్రతారంభం అంటారు. ఈనాడు మహాలక్ష్మి పూజ చేసి ఒక నెల ఆకుకూరలు తినటం మానేసి ఆకుకూరలు దానం చేయాలి. ఈ రోజును చాక్షుషమన్వాం తరాది దినము అంటారు.

ఈ మాసంలో జగన్నాథుని రధయాత్ర, స్కంద పంచమి, తొలి ఏకాదశి, గురు పౌర్ణమి లాంటి ప్రత్యేకమైన విశిష్ట పండుగలతో పాటుగా, ‘దక్షిణాయన పుణ్యకాలం’ కూడా ప్రారంభమవుతుంది.

శూన్యమాసం అంటే?

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యుడు నవగ్రహాలకు రాజు. అసలు జ్యోతిషంలో ఒక్క గ్రహం రాశి మారటానికి ఒక్కో కాల వ్యవధి ఉంటుంది. అంటే చంద్రుడు మేష రాశి నుంచి వృషభరాశికి మారటానికి 2 1/2 రోజులు పడుతుంది. శని గ్రహం 2 1/2 సం. పడుతుంది. రాహు, కేతువులకి 1 1/2 సం, రవికి నెల రోజులు.. ఇలా ప్రతి గ్రహానికి కొంత కాల పరిమితి వుంటుంది. అయితే ముఖ్యంగా సూర్యుడు నెలకి ఒక్కో రాశి చొప్పున (మేషాది మీనరాశులు) 12 రాశులలోనూ 12 నెలలు సంచరిస్తే.. సంవత్సర కాలం పూర్తవుతుంది.

సూర్యుడు మేష రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మేష సంక్రమణం’ అని, సూర్యుడు వృషభ రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘వృషభ సంక్రమణం’ అని, సూర్యుడు మిథున రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మిథున సంక్రమణం’ అని, సూర్యుడు కర్కాటక రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘కర్కాటక సంక్రమణం’ అని… ఇలా ఏయే రాశుల్లో ప్రవేశిస్తే ఆయా సంక్రమణ కాలంగా చెబుతారు.

ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ కూడా. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఆషాడ శుద్ద విదియ నాడు పూరీ జగన్నాధ, బలభద్ర, సుభద్ర రథయాత్ర కన్నుల పండుగ గా జరుపుతారు. ఆషాడ శుద్ద పంచమి స్కంధ పంచమిగా చెప్తారు. సుబ్రమణ్యస్వామిని ఈ రోజు అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఆషాడ షష్ఠిని కుమార షష్ఠిగా జరుపుకొంటారు.

ఆషాడ సప్తమిని భాను సప్తమిగా చెప్పబడింది. ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న ప్రభాకరుడు 3 నెలలు తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజున పగలు, రాత్రి, నిమిషం ఘడియ విఘడియల తేడా లేకుండా సరిసమానంగా ఉంటాయి.

ఆషాడ శుద్ద ఏకాదశి ని తొలి ఏకాదశి అని శయన ఏకాదశి అని అంటారు. ఈ రోజు నుంచే చాతుర్మాస వ్రతం మొదలవుతుంది. దీనినే మతత్రయ ఏకాదశి అని అంటారు. ఆషాడ మాసంలోనే తెలంగాణా ప్రాంతంలో సంప్రదాయబద్దమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్దలతో జరుపుకొంటారు. మహంకాళి అమ్మవారి కోసం తయారు చేసే భోజనాన్ని బోనంగా చెప్తారు. దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్నే బోనాలు అంటారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం లో ఈ పండుగ అత్యంత వైభవం గా జరుపుకొంటారు. సమస్త జగత్తుకు కారణమైనటువంటి అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు. అన్నం, బెల్లం, పెరుగు, పసుపు నీళ్ళు, వేపాకులు ఈ బోనంలో ఉంటాయి.

ఇక వ్యవసాయ పనులన్నీ ఈ మాసంలోనే రైతులు ప్రారంభిస్తారు. చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు. కాబట్టే ఈ సమయంలోనే వివాహాది శుభముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజుల్లో కొత్తగా పెళ్లి అయిన అబ్బాయి ఆరు నెలల కాలం అత్తా గారి ఇంట్లో ఉండే సంప్రదాయం ఉండేది. కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చొని ఉంటే, సకాలంలో జరగాల్సిన పనులు జరగవు. వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకొనే రోజులు అవి. ఇప్పటి లాగ కాలువల ద్వారా నీరు లభించేది కాదు. సరైన సమయంలో విత్తనాలు చల్లక పొతే సంవత్సరమంతా దారిద్ర్యంతో బాధ పడవలసిందే. అందుకే కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి. అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు పెద్దలు. ఇంటి ధ్యాసతో పనులు సరిగా చేయరని ఆషాడమాస నియమం పెట్టారు. అంతేకాకుండా, అనారోగ్య మాసం ఆషాడం. కొత్త నీరు త్రాగటం వల్ల చలి జ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన వ్యాధులు వచ్చే సమయం, స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు, అనారోగ్య దినాలలోను అశుభ సమయాల లోను, గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉంది. ఇన్ని కారణాల వల్ల ఆషాడమాసాన్ని కొన్ని పనులకు నిషిద్ధం చేశారు మన పెద్దలు.