Movies

విలక్షణమైన విలన్…అమ్రీష్‌పూరీ

విలక్షణమైన విలన్…అమ్రీష్‌పూరీ

ఆకట్టుకునే ఆహార్యం… గంభీరమైన గొంతు… కళ్లలో కనిపించే క్రౌర్యం… కలిస్తే అమ్రీష్‌పురి. ప్రతినాయకుడి ప్రాతలో విలక్షణమైన విలనీని పండించడంలో ఆయనకు ఆయనే సాటి. అమ్రిష్‌ పురి పూర్తి పేరు అమ్రిష్‌లాల్‌ పురి. హిందీ, తెలుగు, కన్నడ, మరాఠీ, పంజాబీ, మలయాళం, తమిళ్, ఆంగ్లం వంటి భాషల్లో దాదాపు 400పైగా చిత్రాల్లో నటించారు. ఫిలింఫేర్‌తో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకొన్నాడు. అమ్రీష్‌పురి సోదరులు కూడా నటులే. మదన్‌పురి, చమన్‌ పురిలు అమ్రీష్‌ కంటే ముందే నటులుగా నిలదొక్కుకున్నారు. వారిలా నటుడుగా మారాలనే అమ్రీష్‌ పూరి జలంధర్‌ నుంచి ముంబై వెళ్లాడు. మొదటి ప్రయత్నంలోనే కెమెరా ముందు పరీక్షలో విఫలం అయ్యాడు. దీంతో ముంబైలోనే ఉద్యోగం వెతుక్కోవలసి వచ్చింది. ఉద్యోగం చేస్తూనే నాటక ప్రదర్శనలిస్తూ నటనలో శిక్షణ పొందాడు. ‘సంగీత్‌ నాటక్‌ అకాడమీ’ అవార్డును 1979లో మొదటిసారి సొంతం చేసుకొన్నాడు. ‘ప్రేమ్‌ పూజారి’ చిత్రంతో బాలీవుడ్‌లో రంగప్రవేశం చేశారు. ‘మేరీ జంగ్‌’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ప్రతినాయకుడిగా నటించిన ‘సూరజ్‌ కా సత్వాన్‌ ఘోదా’, ‘ఘటక్‌’, ‘విరాసాట్‌’ వంటి చిత్రాలు బాలీవుడ్‌లో తనను తిరుగులేని స్థానంలో నిలబెట్టాయి. ‘సౌధాగర్‌’, ‘తెహల్కా’, ‘ముస్కురాత్‌’, ‘దామిని’, ‘గార్డిష్‌’, ‘కరణ్‌ అర్జున్‌’, ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’, ‘కోయ్లా’, ‘బాద్‌షా’ వంటి సినిమాలతో భారీ విజయాలందుకున్నారు. ‘మిస్టర్‌ ఇండియా’లో అద్భుత నటన కనబరిచారు. తెలుగులో చిరంజీవి, శ్రీదేవి నటించిన ‘జగదేకవీరుడు..అతిలోకసుందరి’లో ‘మహాదృష్ట…కాపాళిక’ అన్న మాటలు తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పుడూ గుర్తుండిపోతాయి. అలాగే వెంకటేష్‌ నటించిన ‘కొండవీటి దొంగ’లో ‘కాళీ కబాలి పాతాల్‌ కాళీ’, ‘అబ్రకదబ్ర’ వంటి మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బాపు దర్శకత్వంలో బోనీకపూర్‌ నిర్మాతగా అమ్రీష్‌కు గుర్తింపు తెచ్చిన సినిమా ‘హంపాంచ్‌ ’(1980). 1984లో స్టీఫెన్‌స్పీల్‌ బర్గ్‌ చిత్రం ‘ఇండియానా జోన్స్‌’ చిత్రంలో పాత్ర కోసం ఆయన గెడ్డం, గుండు చేయించుకున్నారు. రిచర్డ్‌ అటెన్‌ బరో తీసిన ‘గాంధీ’ చిత్రంలో పాత్ర ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకకులకు పరిచయం అయ్యారు. 1932లో పంజాబ్‌లోని జలంధర్‌లో (జూన్‌ 22, 1932) పుట్టిన ఆయన 72 ఏళ్లు జీవించారు. నేడు ఆయన జయంతి.